కోనసీమ: ఈ నెల 25 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అమలాపురంలో ఉన్న జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్లో బడి బస్సుల భద్రతపై సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా రవాణాధికారి దేశంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్, రవాణా, విద్యా శాఖలు సంయుక్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ATP: జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. వినియోగదారులు 89777 16661, 91547 90355 నంబర్లకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని సూచించారు.
తూ.గో. జిల్లాలో అనూరియా (మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్యులతో ఫోన్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. వ్యాధి వ్యాప్తి నివారణకు అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు APSPDCL,CMD శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు ఉంటుందన్నారు. వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు.
KDP: కమలాపురం మార్కెట్ యార్డులో ఏపీ మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి శనగలను పరిశీలించి, తూకాల్లో మోసాలు లేకుండా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి చంద్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
KDP: ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు కడప జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 33,664 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు.1st ఇయర్ 17,100,2nd ఇయర్ 16,564 మంది విద్యార్థులు ఉన్నారు. KDP-20, PDTR-8, MYKR, PRMML, BDVLలో 4, PVLD, JMDలో 3, KMLPRM, KJPTలో 2, మిగతా ప్రాంతాల్లో ఒకటి చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు.
అన్నమయ్య: రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా అశ్వవాహనం పై పారువేటకు స్వామివారు బయలుదేరగా, దేవస్థానం నుంచి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. కోలాటాలు, మేళతాళాలు, డప్పులతో పారువేట ఉత్సవం సందడిగా జరిగింది. కార్యక్రమంలో రాయచోటి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
KDP: వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ఎస్సై తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ మోసాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద కాల్స్పై 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.
SKLM: పలాస మండలం మహాదేవిపురంలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి మహిళ తమ సెల్ఫోన్లో నారి శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.
కాశినాయన మండలం గంగనపల్లెకు చెందిన దిలీప్(24) అనే వ్యక్తిపై దుండగులు ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించారు.గాయపడిన యువకుడిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై జనసేన ఇన్చార్జ్ పోతుల సాయినాథ్ ఆదివారం స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు జరిగితే శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం బాలిక బాబాయి తనను సంప్రదించిన విషయం నిజమేనని, అప్పట్లో మందలించామని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
సత్యసాయి: రొద్దం మండలం కోగిర గ్రామానికి చెందిన ప్రశాంతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి సవిత తక్షణమే స్పందించారు. బాధితురాలి వైద్య ఖర్చుల నిమిత్తం ఆదివారం రూ. 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా కల్పించారు.
VZM: బొబ్బిలి గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధి రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు లాడ్జీలను సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బందితో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ఖచ్చితమైన ఆధారాలు తీసుకొని ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు.
ASR: పీఎం ఉష పథకంలో భాగంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకంపై 15 రోజుల పాటు ఇచ్చిన శిక్షణ ఆదివారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి తెలిపారు. సీఎంఎస్ లేబొరేటరీస్, పీఎం ఉష కోఆర్డినేటర్ డాక్టర్ టీఎన్ రసూల్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారన్నారు. మొదటి బ్యాచ్ గా 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామన్నారు.
KKD: జగ్గంపేట మండలం ఇర్రిపాక – మర్రిపాక రోడ్డు జంక్షన్లో ఆదివారం సాయంత్రం ధాన్యం లోడుతో వెళ్తున్న ఐసర్ వ్యాన్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. భారీ గోతులే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.