Gold Rates Today : రూ.74వేలు దాటిన బంగారం.. రూ.85వేలకు చేరిన వెండి!
బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. ఒక రోజు స్వల్పంగా తగ్గుతున్న బంగారం, మరుచటి రోజు భారీగా పెరుగుతోంది. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర బుధవారం భారీగా పెరిగింది. మంగళవారం రూ.73,380గా ఉన్న పసిడి ధర, బుధవారం నాటికి రూ.713 పెరిగి రూ.74,093కు చేరుకుంది. 74 వేల రూపాయల మార్క్ని క్రాస్ అయిపోయింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,093గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో వెండి ధరలు(Silver Rate) సైతం భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.84,025 ఉండగా, బుధవారం నాటికి రూ.1,107 పెరిగి రూ.85,132కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి భారీ పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,345 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 7 డాలర్లు పెరిగి 2,352 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 28.15 డాలర్లుగా ఉంది.