VZM: జిల్లాలో అమలవుతున్న జలధార-జలహారతి పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం, మన్యం జిల్లాల అధికారులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100రోజుల ప్రత్యేక డ్రైవ్ జిల్లాలో మంచి ఫలితాల దిశగా సాగుతుందన్నారు.
SKLM: నరసన్నపేట మండలం పారశెల్లి గ్రామం శ్రీ జల భవాని సమేత కేదారేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తుల ఆహ్వానం మేరకు స్వామివారిని ఎమ్మెల్యే రమణమూర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ATP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని అనంతపురం ఎస్పీ పి.జగదీష్ ప్రజలను కోరారు. అన్ని బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు సృష్టించినా, బ్లాక్ మార్కెట్లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NDL: అవుకు మండలం కాశీపురంకి చెందిన కుందన్ రెడ్డి ఇటీవల ప్రమాదంలో గాయపడి HYDలోని అనంత రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న బీసీ ఇందిరా రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
GNTR: తెనాలిలో ఫర్టిలైజర్స్ షాపు యజమానులు సోమవారం బంద్ చేపట్టారు. నిర్బంధ ట్యాగింగ్, యూరియా, DAP వంటి రాయితీ ఎరువులతో పాటు, అమ్ముడుపోని ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తయారీ కంపెనీలు డీలర్లను బలవంతం చేయడాన్ని నిరసిస్తూ షాపులు మూసివేసి బంద్ పాటించారు. గత 4-5ఏళ్లుగా పెరిగిపోతున్న ఈ పద్ధతిని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం జిల్లాకు ఇంధన సరఫరా వివరాలను వెల్లడించారు. మూడు ఆయిల్ కంపెనీల ద్వారా జిల్లాకు 2,57,000 లీటర్ల పెట్రోల్, 5,09,000 లీటర్ల డీజిల్ సరఫరా అవుతున్నాయని తెలిపారు. ఇంధనంతో నిండిన ట్యాంకర్లు ఇప్పటికే జిల్లాకు బయలుదేరాయని, జిల్లాలో ఇంధన కొరత లేదని, ప్రజలు వదంతులను నమ్మవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ 388 అర్జీలను స్వీకరించారు. అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని, పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ATP: వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన బోయ వినోద్ పిడుగుపాటుకు గురై మరణించగా, ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 4 లక్షల నష్టపరిహారం ప్రొసీడింగ్ పత్రాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ అందజేశారు. సోమవారం కౌకుంట్ల గ్రామంలోని తన క్యాంపు కార్యాలయంలో వినోద్ భార్య వరలక్ష్మికి ఈ కాపీని అందజేసి ఓదార్చారు.
ELR: ఉపాధి హామీ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా పంచాయతీ రాజ్ వైసీపీ సెల్ అధ్యక్షుడు పుప్పాల గోపి అన్నారు. సోమవారం PGRSలో ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ.. పనుల వద్ద నీరు, నీడ, మందుల సౌకర్యం కల్పించాలన్నారు.
KRNL: ఎమ్మిగనూరులోని కటికగేరి ప్రాంతానికి చెందిన సుమారు 500 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే వారికి పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేయాలని సోమవారం పిలుపునిచ్చారు.
మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, కనిగిరి వైసీపీ సమన్వయకర్త దద్దాల నారాయణ యాదవ్ డీఎస్పీ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (ABN)పై, సంబంధిత వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ELR: కైకలూరు కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 24 తెల్లవారుజామున నిందితుడు ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసినా, నగదు దొరకకపోవడంతో పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వెంకట్ కుమార్ తెలిపారు.
బాపట్ల జిల్లాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గంటల తరబడి బంకుల వద్ద బారులుతీరి క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారని, ఇది ముమ్మాటికీ డబుల్ ఇంజిన్ సర్కార్ వైఫల్యమేనని సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో సోమవారం మండిపడ్డారు.
GNTR: తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను అస్సాం రాష్ట్ర వైద్యాధికారుల బృందం సోమవారం సందర్శించారు. మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చిన అధికారులు ఇక్కడ పలు వార్డులను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఆసుపత్రిలో పరిస్థితులను అధికారులకు వివరించారు.
PLD: నరసరావుపేటలోని ఎస్ఎస్ & ఎన్ కళాశాలలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తెలిపారు. ఈ మేళా ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. అర్హత గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.