ASR: డుంబ్రిగూడ మండలం జోగిపుట్టు గ్రామానికి చెందిన కోర్రా బ్రుందకు ఆదివారం ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో 108అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్లో ప్రసవం జరిగి ఆడ శిశువు జన్మించింది. తల్లి, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని EMT ఏ. అప్పలనాయుడు తెలిపారు.
TPT: నాగలాపురంలోని వేద నారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల వేళ సన్నిధి వీధిలో రాజకీయ ఫ్లెక్సీలు విస్తరించడం వివాదాస్పదమైంది. దర్శన మార్గంగా ఉండాల్సిన వీధి పార్టీ బ్యానర్లు, బోర్డులతో నిండిపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ATP: గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో నివాసముండే షాహినా అనే మహిళ ఇంట్లో శనివారం రాత్రి 4 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం జిల్లా క్లూస్ టీం సభ్యులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. కిటికీలు, డోర్లపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. పరిసరాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
KRNL: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే బర్తరాఫ్ చేయాలని ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ధరూర్ జేమ్స్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
GNTR: నగరంపాలెం పీఎస్ పరిధిలోని సత్తెనపల్లి రోడ్డులో విజయలక్ష్మి బార్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, ఖాతాల్లో రూ.3,748 ఉన్నట్లు గుర్తించారు. తదుపరి విచారణకు కేసును నగరంపాలెం పోలీసులకు అప్పగించామన్నారు.
VZM: జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు రాత్రి గస్తీ, పెట్రోలింగ్ను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు SP దామోదర్ ఆదివారం తెలిపారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు.
AKP: మునగపాక మండలం తోటాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. 2010-11 బ్యాచ్కి చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించి చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి భోజనాలు చేసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు.
కోనసీమ: జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా అల్లవరం మండలానికి చెందిన సాధనాల శ్రీను నియమితులయ్యారు. ఆయనకు అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ అభినందనలు తెలిపారు. వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కొనుకు గౌతమి, రాపాకు విజయలక్ష్మి, బర్రె సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ జిల్లా నేర సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని, సీసీటీఎన్ఎస్ డేటా అప్డేట్ చేయాలని సూచించారు. రౌడీషీటర్లకు వారానికి కౌన్సెలింగ్, గంజాయి కేసుల్లో సస్పెక్ట్ షీట్లు తప్పనిసరి అన్నారు. మహిళా భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొత్తూరులో కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆళ్ళగడ్డ పట్టణానికి చెందిన వెంకట నాగరాజు 395 గ్రాముల వెండి నాగభరణము వితరణ చేశారని ఈవో రామకృష్ణ తెలిపారు. వెండి నాగాభరణం అందించిన దాతలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేసినట్లు వివరించారు.
W.G: ఆకివీడులో అర్థరాత్రి గొంతేనమ్మ గుడిని కూల్చివేయడం అప్రజాస్వామికమని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తీవ్రంగా ఖండించారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించి, పోలీసు, పంచాయతీ సిబ్బందితో ఈ చర్య చేపట్టడం దారుణమన్నారు. ఘటనలో అధికార యంత్రాంగం, పోలీసుల పాత్రపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం రేపు (సోమవారం) ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జేసీ నవీన్ ఇవాళ తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
NTR: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయ నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన భక్తులు విరాళం అందజేశారు. చింతల్కు చెందిన కమ్మిరి సునీల్, పావని దంపతులు తమ తండ్రి దివంగత వెంకట దుర్గా బాలాజీ రావు జ్ఞాపకార్థంగా రూ.1,00,516ను ఆలయ అధికారులకు సమర్పించారు. వారికి ఆలయ అధికారులు ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు.
W.G: పాలకొల్లు హౌసింగ్ బోర్డులోని ఏ సిటీ సైన్స్ సెంటర్లో ఏప్రిల్ 27 నుంచి మే 10 వరకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కన్వీనర్ పి. శ్రీశ్రీ తెలిపారు. విద్యా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో సైన్స్ ప్రయోగాలు, చిత్రలేఖనం, హస్తకళలపై అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అన్నమయ్య: పీలేరులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాజ్యాంగ హక్కు అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ అన్నారు. మతం మారినా దళితుల సామాజిక పరిస్థితులు మారవని,1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వివక్షపూరితమని విమర్శించారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.