NLR: గుడ్లూరు MPDO కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం జరిగింది. కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గత మూడు నెలల అర్జీల వివరాలను పరిశీలించి పరిష్కారంపై అధికారులను ప్రశ్నించారు.
ATP: గుంతకల్లుకు చెందిన 9 ఏళ్ల బాలిక రుత్విక రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలకు ఎంపికయింది. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-9 చెస్ క్రీడా పోటీలలో విజేతగా నిలిచి సత్తా చాటినట్లు కోచ్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 18న తూర్పు గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు వెళ్లనున్నట్లు తెలిపారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరించారు. నాడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఏ లోటు లేకుండా ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి, గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందన్నారు.
E.G: దేవరపల్లి మండలంలో సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించే దిశగా పచ్చి రొట్ట & నవధాన్యాల కిట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహింకారు. ఎర్నగూడెం శ్రీ వేణుగోపాల ప్రాధమిక పరపతి సంఘం ఆధ్వర్యంలో మొత్తం 500 నవధాన్యాల కిట్లు తయారు చేసి రైతులకు అందజేశారు. పచ్చి రొట్ట విధానం రైతులకు అనేక విధాలుగా ఉపయోగకరమని వారు తెలిపారు.
PLD: కలెక్టరేట్లోని PGRS హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఆమె స్వయంగా విని, వారి నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కడప జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కడప తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్పను వీఆర్కు అటాచ్ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నరసింహరాజును కడప తాలూకా నూతన సీఐగా నియమించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నరసింహరాజు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
VZM: జిల్లాలో ఉన్న పది మండలాల్లో ఉన్న ఆరు ప్రభుత్వ పాఠశాలలు, నాలుగు ప్రైవేట్ పాఠశాలలు ఒక కేంద్రీయ విద్యాలయం కలిసి ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ సర్వే నిర్వహించనున్నట్లు DEO మాణిక్యం నాయుడు సోమవారం తెలిపారు. మొత్తం పాఠశాలలో 3వ తరగతి విద్యార్థులకు ఈనెల 16 నుంచి 18 వరకు ఈ సర్వే జరుగుతుందన్నారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయులు , సిబ్బంది సర్వేని విజయవంతం చేయాలని కోరారు.
CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల అతను అనారోగ్యానికి గురయ్యాడు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశాడు. బిస్కెట్ కలర్ షర్ట్, పాచి కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. అతడిని ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పలమనేరు పోలీసులు కోరారు.
AKP: నర్సీపట్నం అయ్యన్న కాలనీలో తలుపులమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, 11వ వార్షిక జాతర మహోత్సవాల కరపత్రాలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఆవిష్కరించారు. ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభమై, 23న విగ్రహ ప్రతిష్ట, 28న జాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని స్పీకర్ ఆకాంక్షించారు.
శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో సహారా ఇండియా ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరుతూ సహారా పోరాట కమిటీ ప్రతినిధులు DRO విశ్వేశ్వరరావుకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహారా ఇండియా ఖాతాదారులు, ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించడంలో విఫలమైందని విమర్శించారు. బాధితులందరికీ తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నెల్లూరులో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్గా మారుతోంది. వైసీపీ సిటీ ఇంఛార్జ్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి వరుస ప్రెస్మీట్లతో మంత్రి నారాయణపై అవినీతి ఆరోపణలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్, మొక్కల పెంపకంలో రూ.కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు. దీనికి మంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన అనుచరులే తిప్పికొడుతున్నారు.
ATP: కనేకల్లు మండలం మాల్యం గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని MLA కాలవ శ్రీనివాసులు ఆవిష్కరించారు. రామాయణం ద్వారా సమాజానికి ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
NDL: ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 15వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు. ఎంపీపీ గజ్జల రాఘవేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు అందరూ తమ శాఖాలకు సంబంధించిన పూర్తి నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు.
PLD: సత్తెనపల్లి పట్టణంలోని ఆటోనగర్ సాంసంగ్ షోరూమ్ వెనుక కొత్తగా నిర్మించిన రేకుల షెడ్డులో పేకాట రాయుళ్లును పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా, పేకాట ఆడుతున్న 48 మంది అరెస్ట్ అయ్యారు. వారివద్ద నుంచి రూ. 1,70,016, 5 కార్లు, 26 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా: పెదప్రోలు గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్పై గ్రామస్థులు సోమవారం PGRSలో ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులను అధిక బిల్లులతో దుర్వినియోగం చేస్తున్నారని, కాంట్రాక్ట్ పనుల్లో తనకు అనుకూలమైన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. వీధి దీపాలు, పన్నుల సమస్యలు నెలలుగా పరిష్కారం కాలేదని వాపోయారు. వెంటనే ఆయనను బదిలీ చేయాలని కోరారు.