W.G: పాలకొల్లు హౌసింగ్ బోర్డులోని ఏ సిటీ సైన్స్ సెంటర్లో ఏప్రిల్ 27 నుంచి మే 10 వరకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కన్వీనర్ పి. శ్రీశ్రీ తెలిపారు. విద్యా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో సైన్స్ ప్రయోగాలు, చిత్రలేఖనం, హస్తకళలపై అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అన్నమయ్య: పీలేరులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాజ్యాంగ హక్కు అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ అన్నారు. మతం మారినా దళితుల సామాజిక పరిస్థితులు మారవని,1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వివక్షపూరితమని విమర్శించారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
GNTR: పెట్రోల్, డీజిల్ కొరత వదంతులతో ప్రజలు వాహనాలను ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. కానీ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇంధనం విస్తరించి ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్యాంక్ పూర్తిగా నింపకుండా కొంత ఖాళీ ఉంచితే సేఫ్ అని పేర్కన్నారు. వేడిలో ఫుల్ ట్యాంక్ వాహనాలు నిలిపితే ప్రమాదాలు ఎక్కువవుతాయని హెచ్చరించారు.
E.G: ప్రపంచ స్థాయిలో ఏర్పడుతున్న ఇంధన సరఫరా అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు JC వై.మేఘా స్వరూప్ తెలిపారు. ఆదివారం రాజమండ్రిలో JC మాట్లాడారు. సంబంధిత మంత్రి, కమిషనర్ & ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో సమన్వయం చేస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు.
PPM: ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా C-KYC ప్రక్రియ చెయ్యాలిని విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు ఆయన సాలూరు డీసీసీబీ బ్రాంచ్ను ఆదివారం ఆకస్మికంగా సందర్శించి, C-KYC ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. RBI మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా C-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
AKP: ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరించింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ త్వరితగతిన పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితి సవ్యంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ASR: జీకే వీధి మండలం సంకాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: పుంగనూరు సుబేదారి వీధిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఆరాధన మహోత్సవాలను ఆదివారం స్వర్ణకార సంఘం వారు నిర్వహించారు. మొదట స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. మహోత్సవాలలో భాగంగా రాత్రికి స్వామి వారి ఊరేగింపు ఉంటుందని అర్చకులు చెప్పారు.
KDP: ముద్దనూరులో రౌడీ షీటర్లకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సీఐ నగేష్ ఆధ్వర్యంలో వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా మంచి ప్రవర్తనతో ఉండాలని సూచించారు. భవిష్యత్తులో చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NDL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారిందని ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. గార్లపాటి మద్దులేటి స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా బంకులు ‘నో స్టాక్’ బోర్డులతో కనిపిస్తున్నాయన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్లాక్ మార్కెట్ పెరిగిందని విమర్శించారు. వెంటనే ఇంధన సరఫరా పెంచాలని జిల్లా కలెక్టర్ను కోరారు.
కోనసీమ: ఆత్రేయపురం సెక్షన్ పరిధిలోని అంకంపాలెంలో ఆదివారం విధి నిర్వహణలో ఉన్న లైన్మెన్ కె.నారాయణ ప్రసాద్పై ఓ వినియోగదారుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తోటి సిబ్బంది తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోగా, తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు.
KRNL: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దిగువ కాలువలో నీటి ప్రవాహం తగ్గింది. ఈనెల 3న టీబీ డ్యాం నుంచి 3 వేలకుపైగా క్యూసెక్కుల నీరు విడుదల చేసినా, ప్రస్తుతం కర్ణాటక వాటా నిలిపివేయడంతో కేవలం 1100 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. హానవాళుకు చేరేసరికి ఇది 400 క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు తెలిపారు. దీంతో తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది.
SS: పెనుకొండలోని పరిటాల శ్రీరాములు పభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 28న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయప్ప తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఉంటుందన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18–35 ఏళ్ల వయసు గల వారు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
E G: ఎపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఐఎస్టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రధాని నరేంద్ర మోడీ 133వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విద్యార్థినులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని చర్చించే అంశాలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.3,73,823 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 212 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 24 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 2386 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.