E.G: రాజమండ్రి మార్కెట్లో చికెన్ ధరలు ఆదివారం తగ్గుముఖం పట్టాయి. గత వారంతో పోలిస్తే ధరలు దిగిరావడంతో మాంసం దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.230, స్కిన్తో రూ.210, లైవ్ కోడి రూ.130కి విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.1000 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని వ్యాపారస్థులు తెలిపారు.
KKD: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన పలువురు శనివారం రాత్రి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారు. గ్రామ టీడీపీ నాయకులు జ్యోతుల పెద్దబాబు, పెంటకోట శ్రీధర్, నూకతాటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో పెదశంకర్లపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
సత్యసాయి: వేసవి సెలవుల నేపథ్యంలో పుట్టపర్తి RTC బస్టాండ్ విద్యార్థులు, ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్కు భారీగా తరలివచ్చారు. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
NDL: డోన్ పట్టణంలోని న్యూ మహాలక్ష్మి హాస్పిటల్ పక్కన ఏర్పాటు చేసిన “సోనో స్కాన్స్” కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు YCP యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని పార్టీ కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు.
ATP: గార్లదిన్నె మండలం యర్రగుంట్లలో ఆదివారం వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాల సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆరుపల్ల ఒంగోలు జాతి ఎద్దులకు రాతిదూలం లాగు పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ..రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మొదటి బహుమతి రూ.35 వేలు, 2వ బహుమతి రూ.30 వేలు, 3వ బహుమతి రూ.20 వేలు, అందజేస్తున్నట్లు తెలిపారు.
KKD: కాకినాడ నుంచి మైసూర్ వెళ్లే స్పెషల్ ట్రైన్ను బై-వీక్లీ ఎక్స్ప్రెస్గా మారుస్తూ రైల్వే శాఖ అనుమతించిందని సామర్లకోట స్టేషన్ సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ట్రైన్ నెం.17289/17290 కాకినాడ నుంచి సోమ, శుక్రవారాల్లో.. మైసూర్ నుంచి గురు, శనివారాల్లో నడుస్తుందని వివరించారు. ప్రయాణికులు ఈ మెరుగైన రైలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
TPT: భారత ఉపరాష్ట్రపతి C. P.రాధాకృష్ణన్ తిరుపతి-తిరుమల పర్యటన నేపథ్యంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ ASL సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎయిర్పోర్ట్ నుంచి తిరుచానూరు, తిరుమల వరకు భద్రతా ఏర్పాట్లు పరిశీలించి కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.
CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117 నుంచి రూ.126, స్కిన్ రూ.170 నుంచి 205 వరకు పలుకుతోంది. స్కిన్లెస్ రూ.193 నుంచి రూ.230 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 78 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని దుకాణదారులు తెలిపారు.
అన్నమయ్య జిల్లాలో చికెన్ కేజీ రూ.220, స్కిన్ లెస్ రూ.240గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900 స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ.450, రాగండి రూ.200, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. ఆదివారం సందర్భంగా చికెన్ ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.
E.G: పెట్రోల్, డీజిల్ కొరత వార్తలపై రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి శనివారం కలెక్టర్ కీర్తి చేకూరితో ఫోన్లో సమీక్షించారు. కొన్ని ఏజెన్సీలు, సరఫరాదారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన నిఘా ఉంచి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడాలన్నారు.
GNTR: తెనాలిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఆదివారం ఉదయం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మునగాల మోహన శ్యాం ప్రసాద్ చేతుల మీదుగా వైశ్యపతాక ఆవిష్కరణతో ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి 11 రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు. ఈ ఉత్సవాలలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PLD: నరసరావుపేటలో ఆదివారం నాన్వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్లెస్ కేజీ ధర రూ. 240-260, విత్ స్కిన్ రూ. 220-240 అమ్ముతున్నారు. లైవ్ కోడి కేజీ రూ. 115, నాటు కోడి కేజీ రూ. 300-400 విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ. 900-1000 మధ్య అమ్ముతున్నారు. 100 కోడి గుడ్లు రూ. 600గా ఉన్నాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు.
కోనసీమ: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చిరస్థాయిగా నిలిచే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పి.గన్నవరంలో శనివారం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు వంటి వినూత్న వ్యవస్థలను జగన్ స్థాపించారని కొనియాడుతూ పార్టీ బలోపేతంపై చర్చించారు.
ATP: జిల్లాలో శనివారం నిర్వహించిన పాలిసెట్- 26 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 9,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 9,110 మంది హాజరయ్యారు. ఇందులో 5,557 మంది బాలురు, 3,553 మంది బాలికలు ఉన్నారు. జిల్లా పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి తెలిపారు.
KRNL: కల్లూరు అర్బన్ పరిధిలోని 19వ వార్డులో నగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న మున్సిపల్ పార్కులు, సీసీ డ్రైనేజీల అభివృద్ధి పనులకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరు జనార్దన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.