కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడిన వారిని ఎమ్మిగనూరు నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ప్రకాశం: కంభంలోని స్థానిక ఆదిఅంధ్ర ప్రాధమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లర్నింగ్ & స్టడీ మదింపు ప్రక్రియను గురువారం ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే లక్ష్యంగా ఉపాధ్యాయులతో మదింపు చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇంటి వద్ద ఇవాళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎస్ఆర్బీసీ కాలనీలోని కూలిపోయిన దర్గా వద్దకు వెళ్తుండగా బనగానపల్లె పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.
గుంటూరు నగరంలో ఓ జువెలర్స్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయనతో హీరోయిన్ డింపుల్ హయాతి పాల్గొనగా అభిమానులు భారీగా తరలి వచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ATP: జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా MLA కాలవ శ్రీనివాసులు స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. ఖచ్చితమైన సమాచారం అందిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికలకు ఈ గణాంకాలే బలమైన పునాది అని వివరించారు. దేశాభివృద్ధికి కీలకమైన ఈ జాతీయ కార్యక్రమంలో ప్రతి కుటుంబం పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
తూ.గో జిల్లాలో సెన్సస్–2027లో భాగంగా స్వీయ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, వివరాలతో పాటుగా కుటుంబ సభ్యులు వివరాలు కూడా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చన్నారు.
KRNL: కోసిగి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో అక్రమ మద్య రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలపై ఇవాళ బహిరంగ వేలం నిర్వహించారు. కర్నూలు అసిస్టెంట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేలంలో మొత్తం 15 వాహనాలు అమ్ముడై ప్రభుత్వానికి రూ.59,590 ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో పీ & ఇఐ పి.భార్గవ రెడ్డి పాల్గొన్నారు.
NDL: సచివాలయం దగ్గరకు వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ హరిప్రసాద్ సూచించారు. బేతంచెర్లలోని సచివాలయం-5ను ఇవాళ ఆయన తనిఖీ చేశారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సేవలను అందజేయాలని, అటెండన్స్, ప్రభుత్వం నుండి వచ్చే సర్వేలు, వాట్సాప్ గవర్నెన్స్ గురించి రికార్డ్స్ మెయింటైన్ చేయాలన్నారు. ఆఫీస్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.
NLR: పొదలకూరులో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం మారుతీ నగర్ అగ్నిమాపక సిబ్బంది స్థానిక ప్రజలకు ఎలక్ట్రికల్, గ్యాస్, వల్ల ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా సురక్షితంగా రక్షించుకోవాలి అనే అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎండాకాలం చిన్న పిల్లలు బావులు, చెరువుల వద్దకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
KDP: మైదుకూరు పట్టణ ప్రాంతానికి చెందిన పలువురు యువత వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన యువత అటవీ ప్రాంతానికి వెళ్లి తొట్లను ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలతో బిందెల ద్వారా నీటిని తెచ్చి మూగజీవాల దాహార్తి తీరుస్తున్నారు. అటవీ అధికారులు చేపట్టాల్సిన పనిని స్వచ్ఛంద సేవకులు చేస్తూ ఉండడం పట్ల పలువురు యువతను అభినందిస్తున్నారు.
W.G: నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్వీయ గణన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ.. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు.
ELR: చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ విభాగంలో 979 మార్కులతో జిల్లాలో రెండవ స్థానంలో నిలిచిన మారుమూడి చరిష్మాను ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందించారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని అభినందించారు. నారా లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ కళాశాలలు , పాఠశాలలో పెను మార్పులు తీసుకొచ్చారని వివరించారు.
PLD: మాచవరం మండలంలో గత కొద్ది రోజులుగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకు తీవ్ర ఎండ తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఉష్ణోగ్రత 38 నుంచి 40 డిగ్రీలు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని వైద్యులు చూపిస్తున్నారు. అలాగే బయటకు వచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
TPT: తిరుపతిలో తెలుగు నాటక రంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి కళాకారులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం ఛైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కందుకూరి వీరేశలింగం తన రచనలు, నాటకాల ద్వారా ఆంధ్రులను ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు.
అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ సర్వ బోధన ఆసుపత్రిలో రోగిని పట్టించుకోలేదనే ఆరోపణలు ఇవాళ చర్చనీయాంశంగా మారాయి. అత్యవసర పరిస్థితిలో రోగిని స్ట్రెచర్పై తీసుకువచ్చినా, వైద్య సిబ్బంది స్పందన ఆలస్యమైందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.