SS: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తన పుట్టినరోజును పురస్కరించుకుని ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. భక్తులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
W.G: భీమవరం మున్సిపల్ కార్యాలయంలో రేపు నిర్వహించనున్న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గోడపత్రికను జేసీ రాహుల్ ఆవిష్కరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్ను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని, వివిధ కంపెనీలు పాల్గొనే ఈ కార్యక్రమంలో అర్హత గల అభ్యర్థులు హాజరవ్వాలని కోరారు.
VSP: భీమిలి జోన్లో సంతపేట, తగరపువలసలలో ఖాళీగా ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ షాపు రూములకు ఈనెల 13న జోనల్ కార్యాలయంలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు భీమిలి జోనల్ కమిషనర్ విజయ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ వేలం పాటలో పాల్గొనదలచిన వారు కార్యాలయం పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
PPM: పదోతరగతి సమాధాన పత్రాల ముల్యాంకనం పట్టణంలో ఉన్న DVMM హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం సజావుగా నిర్వహించామని మన్యం జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం ఐదు సబ్జెక్టులకు సంబంధించి జిల్లాకు 98377 సమాధాన పత్రాలు రాగా, అందులో 4982 పత్రాలు దిద్దడం జరిగిందన్నారు. మొత్తం 418 పరీక్షల పరిశీలకులు హాజరయ్యారన్నారు.
ELR: నూజివీడు పట్టణంలోని 21,22 వార్డులలో మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బందితో కలిసి ఇంటింటికి పర్యటించి ప్రజల నుంచా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీల తీరు, వాటిలో పరిశుభ్రత, రోడ్లపై చెత్తాచెదారం వంటి అంశాలు పరిశీలించారు. చెత్తను రోడ్లపై వేయవద్దని, గ్రీన్ అంబాసిడర్లకు డస్ట్ బిన్స్తో చెత్త అందించాలన్నారు.
CTR: పుంగనూరు పట్టణం ఎంపీటీ రోడ్డులోని శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా నిజరూప దర్శనంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ASR: జిల్లా కలెక్టర్ టీ.నిశాంతిని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలువురు నేతలు సోమవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్గా గిరిజనులకు అత్యుత్తమ సేవలు అందించాలని కోరారు. అలాగే గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగం సూర్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
AKP: మాడుగులలో ఈ నెల 13న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరగనుందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ తెలిపారు. రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ క్యాంటీన్ను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభిస్తారన్నారు. ఈ సందర్భంగా పాండవుల చెరువు శంకుస్థాపన, జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ, సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
NLR: ఇందుకూరుపేట పీఎస్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దేవరకొండ కిశోర్ అనే వ్యక్తి బాధితుడి నుంచి రూ.10 లక్షలు తీసుకుని పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
VZM: కొత్తవలస న్యాయవాదుల నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితను ఆమె ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. నూతన కార్యవర్గం సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కొత్తవలస నూతన భవనం అవశ్యకతను ఆమెకు వివరించారు. కొత్తవలస సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరామని అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.
SKLM: హిరమండలం పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా Y. మధుసూదన్ రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. హిరమండలంలో పనిచేస్తున్న వి.హేమంత్ కళ్యాణ్ ఆకస్మిక బదిలీ కారణంగా మధుసూదన్ రావు నియామకం జరిగింది. ఈ మేరకు ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయనకు పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
KRNL: రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ, సిగ్నలింగ్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. కాచిగూడ-కర్నూలు (17435) రైలు ఈనెల 10-18 వరకు, కర్నూలు-కాచిగూడ (17436) రైలు 11-19 వరకు, కాచిగూడ-గుంతకల్లు (57414) రైలు 11-19 వరకు రద్దు చేయబడ్డాయన్నారు.
NDL: బేతంచర్ల పట్టణంలో సత్రం సమీపంలో నాపరాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఇవాళ ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. బనగానపల్లె నుంచి అయ్యల చెరువుకు వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను వివరించారు.
NLR: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల వినూత్నంగా డ్రోన్ నిఘా వ్యవస్థను అమలులోకి తెచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని ముఖ్య కూడళ్లు, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ల సహాయంతో రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. సంబంధిత డీఎస్పీల పర్యవేక్షణలో CI, SIలు క్షేత్రస్థాయిలో ఈ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.