ASR: మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతగిరి మండలం మల్లిపాడు గ్రామానికి ఇప్పటికీ రహదారి లేదు. గ్రామానికి చెందిన బాబూరావు అనారోగ్యానికి గురికావడంతో స్థానికులు అతడిని ఆరు కిలోమీటర్ల దూరం డోలీమోతతో మోసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
VZM: టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో స్థానం దక్కించుకున్న గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గంట్యాడ శ్రీదేవిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పార్టీ నాయకులు కార్యకర్తల హర్షద్వానాల మధ్య మంత్రి శ్రీనివాస్ శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. నాయకులు కార్యకర్తలు శ్రీదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు.
NLR: ఉదయగిరి (M) బండగానిపల్లి పంచాయితీ బీజేపీకి చెందిన గుంటా రాము (30) అనే యువకుడు అనుమానాస్పదంగా బెంగళూరులోని మారతహళ్లి రైల్వే ట్రాక్ వద్ద విగతజీవిగా పడి ఉన్నారు. వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న తండ్రి గుంటా పిచ్చిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు తరలివెళ్లారు.
TPT: తిరుమలలో మోకాళ్ల మెట్లు సమీపంలోని ఘాట్ రోడ్డుపై సుమారు 7 అడుగుల నాగుపాము ప్రత్యక్షమై వాహనదారుల్లో భయాందోళనకు గురిచేసింది. రోడ్డుపైకి వచ్చిన పామును గమనించిన వాహనదారులు కాసేపు ఆగిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.
NLR: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా బుధవారం కందుకూరు ఆర్టీసీ డిపోలో సిబ్బందికి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరమని, అత్యవసర సమయాల్లో వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారి ఎం. చంద్రమౌళి కోరారు. అనంతరం కేసరగుంట కాలనీలోని గుడిసెల నివాసితులకు నివారణ చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: నరసన్న పేట మండలం మడపాం టోల్ గేట్ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వాహనాలను పట్టుకొని , సీజ్ చేసినట్లు ఎస్సై బి. గణేష్ తెలిపారు. 12 మూగజీవాలను సంరక్షించి, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మూగ జీవులను అక్రమ రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
CTR: నగరం సమీపంలోని గంగాసాగరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. హైవే అధికారులు గురువారం ఉదయం లారీలను రోడ్డుపై ఆపుతున్న సందర్భంలో వెంట వెంటనే రెండు లారీలు ఆపడంతో వెనుక నుంచి వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో హైవే అధికారులు వెంటనే అక్కడి నుంచి జారుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
VZM: ముందస్తుగా పన్నులు చెల్లిస్తే 5 శాతం రిబేటు పొందవచ్చని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2026-27 పన్నులు ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రిటేట్ వస్తుందన్న విషయం ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు.
E.G: సీతానగరం మండలంలో కాతేరు నుంచి సీతానగరం వరకు నిర్మించిన సీసీ రోడ్డుపై ఎటువంటి ఆక్రమణలు చేయవద్దని కోరుకొండ సీఐ వివిఎస్ మూర్తి బుధవారం హెచ్చరించారు. రోడ్డుపై ధాన్యం, మొక్కజొన్నలు ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదానికి కారణమైన వారిపై ఇప్పటికే FIR నమోదు చేసినట్లు తెలిపారు.
కాకినాడ జిల్లా పోర్టుతో పాటు పలు గోడౌన్లలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, డీఎస్వో సత్యనారాయణ రాజు బృందం బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొన్ని మిల్లుల్లోని బియ్యంలో పీడీఎస్ బియ్యానికి సంబంధించిన కెర్నాల్స్ను అధికారులు గుర్తించారు. దీంతో 910 టన్నుల బాయిల్డ్ బియ్యం, రవాణాకు సిద్ధంగా ఉన్న 10 లారీలను సీజ్ చేశారు.
అల్లూరి: కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో (సీబీఎస్ఈ) 100 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. 30 మంది బాలురు, 30 మంది బాలికలు మొత్తం 60 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. నంద కిషోర్ 446/500, బద్రి 442/500 పాఠశాలలో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచారని తెలిపారు.
సత్యసాయి: వివాహితపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బిల్లా కుమార్ను కనగానపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముత్తవకుంట్ల ఎస్సీ కాలనీకి చెందిన ఇతడు, ఈ నెల 14న ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్సై మహమ్మద్ రిజ్వాన్, నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు.
అనకాపల్లి: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి 4 ఏళ్ల 9 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ విశాఖ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. 2021లో నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఆకాశ్ పాండురంగన్ (A3)పై నేరం రుజువుకావడంతో శిక్ష ఖరారైనట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు.
TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, బయట ATGH వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 77,077 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 27,241 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
E.G: బివిఎమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత 9 రోజులుగా జరిగిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని డీఈవో కంది వాసుదేవరావు బుధవారం తెలిపారు. 7 జిల్లాల నుంచి 7 సబ్జెక్టులకు సంబంధించిన 1,76,032 పత్రాలు వచ్చాయి. 780 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారన్నారు. ఇందులో 75 చీఫ్ ఎగ్జామినర్లు, 455 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 221 సహాయకులు విధులు నిర్వహించినట్లు వెల్లడించారు.