ATP: జిల్లాలో శనివారం నిర్వహించిన పాలిసెట్- 26 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 9,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 9,110 మంది హాజరయ్యారు. ఇందులో 5,557 మంది బాలురు, 3,553 మంది బాలికలు ఉన్నారు. జిల్లా పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు ప్రిన్సిపల్ జయచంద్రారెడ్డి తెలిపారు.
KRNL: కల్లూరు అర్బన్ పరిధిలోని 19వ వార్డులో నగర్ వాటర్ ట్యాంక్ వద్ద రూ.40 లక్షల వ్యయంతో చేపట్టనున్న మున్సిపల్ పార్కులు, సీసీ డ్రైనేజీల అభివృద్ధి పనులకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరు జనార్దన్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని ముంబై జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్లో రోడ్డు దాటుతున్న వ్యక్తిని అకస్మాత్తుగా బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అవ్వగా ఇరువురిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
NDL: జిల్లాను చెత్త రహితంగా మార్చేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని శనివారం కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో స్వచ్ఛ సర్వేక్షణపై మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేటి నుంచి మే 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణపై కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు పర్యటించనున్నాయన్నారు.
అనకాపల్లి: మండల కేంద్రమైన ఎస్. రాయవరంలో రూ.1.5 కోట్లతో నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయం ఇవాళ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా రెండు రోజులు నుంచి ఆలయంలో పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. శనివారం సాయంత్రం విగ్రహాలకు కలశాలకు పాలు, తేనె, పెరుగు, పంచదార తదితర వాటితో అభిషేకాలు చేశారు.
VZM: యువత చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని బొబ్బిలి CI కె.నారాయణరావు సూచించారు. శనివారం సాయంత్రం స్దానిక కోమటిపల్లిలో అభ్యుదయం 2.0 నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు లోనైతే జీవితాలు నాశనం అవుతాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు, ATM, అధార్, OTP వివరాలు చెప్పవద్దన్నారు.
BPT: పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు ఎస్సై పులి గోపి శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని, శాంతి భద్రతలకు సహకరించాలని సూచించారు. చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో మంచి పౌరులుగా మారి జీవనోపాధిపై దృష్టి పెట్టాలని తెలిపారు. పోలీసులు పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం ఆయన చేశారు.
మన్యం: జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి శనివారం సీతానగరం మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా పెద్ద భోగిల్లి గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆనంతరం సిబ్బంది హాజరు పట్టిక, వారి కదలిక రిజిస్ట్రార్ను నిశితంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో కార్యాలయానికి చేరుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు భీమవరం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ తెలిపారు. వరి కోతలు, ఆక్వా సాగు యంత్రాలు, రవాణా వాహనాలకు ఇంధన కొరత లేకుండా చూసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఎదురైతే ప్రజలు వెంటనే 8121676653 నంబర్ను సంప్రదించాలన్నారు.
CTR: యాదమరి మండలం సంతగేటు గ్రామంలో అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. ఎస్సై ఈశ్వర్, డీటీ జయంతి, ఆర్ఐ ప్రసాద్ నిర్వహించిన ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 9 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న అబ్దుల్ సలాంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
కోనసీమ జిల్లాలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల ద్వారా తలసరి ఆదాయం తెలుపుతూ పలు ప్రతిపాదనను రూపొందించామని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో శనివారం సమావేశంలో మాట్లాడారు. బాలయోగి స్టేడియం అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు. అభివృద్ధికి రూ.1 కోటి కేటాయించామన్నారు. రూ.1,650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం మంజూరు అయ్యిందన్నారు.
E.G: ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపులపై రాయితీ పొందేందుకు మరో ఐదు రోజులే గడువు ఉందని కమిషనర్ రాహుల్ మీనా శనివారం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సర పన్నును ఈ నెల 30లోపు ఏకమొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీతో పాటు, పాత బకాయిల వడ్డీపై 50 శాతం మినహాయింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATP: తాడిపత్రి డిపో నుంచి కర్నూలు వెళ్లే ఆర్టీసీ బస్సులను నేటి నుంచి యాడికి మీదుగా నడుపుతున్నట్లు టీఐ పుల్లయ్య తెలిపారు. గతంలో బస్సులు బైపాస్ మీదుగా వెళ్లడం వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను స్థానికులు CM చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విన్నపంపై స్పందించిన అధికారులు యాడికి మీదుగా సర్వీసులను పునరుద్ధరించారు.
NLR: సీతారామపురం మండలం బోడసిద్దయ్య పల్లిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వెంకటేశ్వర్లును శనివారం స్పెషల్ స్క్వాడ్ పోలీసులు పట్టుకొని ఉదయగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఉదయగిరి ఎక్సైజ్ ఎస్సై దీప్తి కారంత్ తెలిపారు. తన దుకాణంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గుంటూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. గృహ నిర్మాణాల పురోగతిపై నిన్న సమీక్ష నిర్వహించిన ఆయన, ఇంజనీర్లు, గుత్తేదారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.