VSP: భీమిలి ఆర్డీవో కార్యాలయంలో జనగణన కార్యక్రమాన్ని ఇవాళ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజల సమగ్ర సమాచారం ఉంటేనే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతాయని అన్నారు. మొబైల్ ద్వారా స్వీయ గణన పూర్తి చేసి పొందిన ఐడీని ఎన్యూమరేటర్లకు ఇవ్వాలని సూచించారు.
KRNL: జిల్లాలో అకాల వర్షం పడుతోంది. తుగ్గలి, సి. బెలగళ్, గోనెగండ్ల, తదితర మండలాల్లో సాయంత్రం నుంచి వాన కురుస్తోంది. గోనెగండ్ల సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ వద్ద ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎమ్మిగనూరు – కర్నూల్ ప్రధాన రహదారిపై విద్యుత్ తీగలు పడడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది.
AKP: ఉపాధి కార్మికుల పొట్ట కొట్టడానికే కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ పథకాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో ఉపాధి కార్మికులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు పూటలా ముఖ ఆధారిత హాజరు కాకుండా ఒక్క పూటే తీసుకోవాలన్నారు.
బాపట్ల పురపాలక సంఘానికి స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలక పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతానికి అధికారులు కృష్ణి చేయాలన్నారు.
CTR: చిత్తూరు 1 టౌన్ పోలీసులు అదృశ్యమైన ఇద్దరు మైనర్ బాలికల కేసును 48 గంటల్లోనే ఛేదించి, వారిని సురక్షితంగా రక్షించారు. సోషల్ మీడియా పరిచయాలతో బాలికలు వెళ్లినట్లు విచారణలో తేలింది. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సకాలంలో స్పందించిన పోలీసులను బాధితుల తల్లిదండ్రులు అభినందించారు.
గుంటూరు: అమరావతి అసెంబ్లీ భవన్లో గురువారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయన సమీక్షించారు. ఇతర సభ్యులతో కలిసి ప్రభుత్వపరమైన పలు విషయాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ASR: పాడేరు మండలం కందమామిడి జీటీడబ్ల్యూఏ బాలికల పాఠశాలలో ప్రపంచ కళాదినం సందర్భంగా చిత్రలేఖన పోటీలు గురువారం నిర్వహించారు. ఈ పోటీలలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 6 నుంచి 9వ తరగతి వరకు సుమారు 30 మంది విద్యార్థినులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ జనపరెడ్డి అప్పారావు స్వఖర్చులతో బహుమతులు అందజేశారు.
మార్కాపురంలో ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఓ గుర్తుతెలియని మహిళను బలంగా ఢీ కొట్టడంతో మహిళ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆవుల బెడద ఎక్కువైందని పలుమార్లు వార్తా కథనాలు ఇచ్చిన.. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థలం మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగింది.
ATP: తాడిపత్రి మున్సిపాలిటీలో ఓ ఉన్నతాధికారి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పలుమార్లు హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీచక పర్వంపై సమగ్ర విచారణ జరిపి, సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాంగ్ రూట్ ప్రయాణాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో జరిగిన రోడ్డు భద్రత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
PPM: APTF ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న జరగనున్న జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రావాడ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు మంజూరు చేయాలన్నారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల సాధన కోసం గళం విప్పాలని వారు కోరారు.
BPT: కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, 108 వాహనాన్ని ఎంపీడీవో శ్రీనివాసరావు పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యాజలి, పేరలి, చింతాయపాలెం, గణపవరం గ్రామాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
AKP: జనగణన ప్రక్రియలో భాగంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అచ్యుతాపురం మండలం మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్వీయ గణన చేసుకున్నారు. గృహ గణనకు సంబంధించి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో అడిగిన వివరాలను నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి గృహ గణన ప్రారంభం అయిందని అన్నారు.
SKLM: అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా ఆమదాలవలస పట్టణం మెట్టక్కివలసలో గురువారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ వల్ల జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో వివరించడంతో పాటు, వాటిని అరికట్టే పద్ధతులను ప్రదర్శించారు. ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్వయంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. భారత జనగణన 2027లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ఆయన వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ ఎంతో సులభమన్నారు.