అన్నమయ్య: గాలివీడు మండలంలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కాలువలు, చెరువుల పునరుద్ధరణ పనులతో వర్షపు నీటి సంరక్షణకు తోడు సాగునీటి లభ్యత పెరుగుతోంది. రూ.5 లక్షల వ్యయంతో చేపట్టిన ఫీడర్ కాలువ పనుల ద్వారా సుమారు 210 ఎకరాలకు నీరు అందనుంది. ఈ కార్యక్రమం గ్రామీణ ఉపాధిని పెంచుతూ రైతులకు ఆశాజ్యోతిగా నిలుస్తోంది.
AKP: జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన ఎండలు వడగాల్పులు నేపథ్యంలో పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టేందుకు, కార్మికుల భద్రతను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో పరిశ్రమల భద్రత ప్రమాణాలపై పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో భద్రత తనిఖీలు నిర్వహించాలన్నారు.
PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి కాన్వాయ్పై దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కారంపూడిలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకే పిన్నెల్లి సోదరులు ఈ కుట్ర పన్నారని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేకనే ఇలా చేస్తున్నారన్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
E.G: మంగళగిరిలో నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేష్ యువ నాయకత్వానికి ప్రతీకగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని, జాతీయ స్థాయిలో పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు బుధవారం మొక్కలను నాటారు. ఆసుపత్రి పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. పచ్చని వాతావరణం ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు.
CTR: ఆస్తి పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిబేట్ రేపటి(గురువారం)తో ముగియనుంది. దీంతో బుధవారం సాయంత్రం పుంగనూరు పట్టణంలోని గృహాల యజమానులు పన్నులు చెల్లించేందుకు పురపాలక కార్యాలయానికి క్యూ కట్టారు. ప్రజల సౌకర్యార్థం కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు ప్రత్యేకంగా రెండు కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ప్రకాశం: పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చూపించుకునేందుకు గుంటూరుకు వెళ్లారు. ఈ క్రమంలో దొంగలు ఆయన ఇంటిలో బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును దోచుకు వెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ASR: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో, ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రభుత్వం సరికొత్త అత్యవసర చికిత్స పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ నిషాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం పీఎం రహత్ పథకం-రోడ్డు ప్రమాద బాధితులకు అభయ హస్తం గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 112కు కాల్ చేయవచ్చన్నారు
సత్యసాయి: ధర్మవరంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సత్యకుమార్ బుధవారం ఆవిష్కరించారు. సామాజిక న్యాయం, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన గొప్ప మహిళా నాయకురాలు చాకలి ఐలమ్మ అని మంత్రి కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. మహనీయుల సేవలను స్మరించుకోవడం ద్వారా సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం పెంపొందుతుందన్నారు.
KKD: పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో బుధవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ రైతు కళ్లాలను సందర్శించారు. వరి కోత యంత్రాల పనితీరు, కోత అనంతరం ధాన్యం తేమ శాతం వ్యత్యాసాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. జిల్లాలో రబీ కోత పనులు జోరుగా సాగుతున్నాయని, ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని జేసీ తెలిపారు.
ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కృషి ఫలితంగా తిరుమల ఎక్స్ప్రెస్ సేవలు గుంతకల్లు వరకు విస్తరించాయి. కడప నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలు ఇకపై గుంతకల్లు నుంచి ప్రారంభం కానుంది. మే 12న ఎంపీ అంబికా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఉత్తరాంధ్రకు ప్రయాణించే జిల్లా ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.
కృష్ణా: అవనిగడ్డ మండలం వేకనూరులో పునర్ నిర్మించిన మాదివాడ వారి కోదండ రామాలయ ప్రతిష్ట బుధవారం జరిగింది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిచే ప్రతిష్ట గావించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే దంపతులు మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి పాల్గొన్నారు. మహా కుంభ ప్రోక్షణ, మహామృత దివ్య కార్యక్రమాలు, భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై నేరాల నివారణ, చట్టపరమైన రక్షణలు, హెల్ప్లైన్ సేవలపై వివరించారు. భయపడకుండా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
CTR: కార్వేటినగరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సీఐ హనుమంతప్ప బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన మజ్జిగను పంపిణీ చేశారు. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BPT: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అర్హులకే అందాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జేసీ భావన వశిష్టతో కలిసి వివిధ శాఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిధుల మళ్లింపు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, పనుల నాణ్యతపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ సూచించారు.