కోనసీమ: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన అమలాపురం కలెక్టరేట్లో గురువారం సాయంత్రం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. భవన నిర్మాణ రంగానికి ఇబ్బంది లేకుండా డిమాండ్ మేరకు పారదర్శకంగా ఇసుక పంపిణీ చేయాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందే జొన్నాడ, కపిలేశ్వరపురం, రావులపాడు, ఆలమూరు స్టాక్ పాయింట్లలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలని సూచించారు.
ATP: విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. నిందితులను సత్వరమే అరెస్ట్ చేయడం, దర్యాప్తును సకాలంలో నాణ్యతగా పూర్తి చేయడం వంటి విధుల్లో రాణించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, మహిళా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించిన వారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ELR: స్వయం ఉపాధితో జీవనం సాగించడానికి తనకి చేయూత కావాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ను ఓ యువతి కోరింది. ప్రభుత్వం చాయ్ రాస్తా వ్యాపారం చేసుకోవడానికి సెర్ప్ ద్వారా చేయూత అందిస్తోందని అందుకు స్థలాన్ని కేటాయించే విధంగా సహకరించాలని కోరింది. చాయ్ రాస్తా వ్యాపారం నిమిత్తం స్థలాన్ని కేటాయింపు చేయాల్సిందిగా చింతలపూడి మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
NDL: కొలిమిగుండ్ల మండల ఇంఛార్జ్ తహసీల్దార్గా నాగేశ్వర రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఇంఛార్జ్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న సాయి విశ్వతేజ పది రోజుల క్రితం సెలవులపై వెళ్లారు. దీంతో ఉన్నతాధికారులు నాగేశ్వర రెడ్డిని కొలిమిగుండ్ల మండలం ఇంఛార్జ్ బాధ్యతలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరారు.
KRNL: ఆస్తి పన్ను చెల్లింపులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ ఓ ప్రకటనలో కోరారు. ఏప్రిల్ 30లోపు పన్ను చెల్లిస్తే 50 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం నగరంలో 6 ప్రత్యేక కౌంటర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
NDL: డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ శుక్రవారం ఉదయం 10 గంటలకు బేతంచెర్లకు వస్తున్నట్లు టీడీపీ మండల నాయకులు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె అందుబాటులో ఉంటారన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లవచ్చని చెప్పారు.
PPM: స్థానిక గాయత్రి అపార్ట్మెంట్లో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని మహిళలకు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. పాలకొండ అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు, సిబ్బంది గృహిణులకు నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు, వాటిని ఎదుర్కొనే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.బహిరంగ మంటలు నిషేధం అని సూచించారు.
సత్యసాయి: జిల్లాలో జలాశయాలు, ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యంగా ఆక్రమణలను వెంటనే తొలగించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్లో నిర్వహించిన వాచ్డాగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మవరం చెరువులో గుర్తించిన 290 ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నోటీసులు జారీ చేయాలని సూచించారు.
W.G: భీమవరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అహ్మదునిషా మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి యాప్’ మహిళలకు అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుందని, ప్రతి విద్యార్థిని తమ స్మార్ట్ ఫోన్లలో దీనిని ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో ఈ యాప్ ఎంతో తోడ్పడుతుందని వివరించారు.
KDP: ప్రతి ద్విచక్ర వాహనదారుడు లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని SI హారిక తెలిపారు. సిద్ధవటం గ్రామ శివారులోని మూలపల్లె క్రాస్ వద్ద గురువారం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. హెల్మెట్, వాహన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనదారులకు ఒక్కొ వాహనానికి రూ.185 చొప్పున జరిమానా విధించామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.
కోనసీమ: సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సహకారంతో చదువుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినిని మంత్రి వాసంశెట్టి సుభాష్, ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలు గురువారం సాయంత్రం కలిసి అభినందించారు. కాకినాడ శ్రీ చైతన్యలో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ చదువుతున్న కాటే శ్రీకృష్ణ హర్ష 470 మార్కులకు గాను 459 మార్కులుతో ఉత్తీర్ణత సాధించాడు.
ATP: ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెల 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. పరీక్ష ఫీజు ఈ నెల 20 నుంచి 27వ తేదీలోగా ఆన్లైన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీటోటలింగ్ చేయించుకోవాలనుకుంటే ఫీజు చెల్లించుకోవచ్చున్నారు. సబ్జెక్టుకు 260 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు.
KDP: పులివెందుల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామ పొలాల్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. రైతు సాయిలీల, గంగరాజులకు చెందిన అరటి తోటల్లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పులివెందుల అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అరటి పంటతో పాటు డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. సుమారు రూ. 2.70 లక్షల మేర నష్టం వాటిల్లింది.
ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించబడుతుందని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
KRNL: ఓర్వకల్లు మండలంలోని కొమ్మిచెరువు ఆంజనేయస్వామి ఆలయంలో చైత్రమాసం శుక్రవారం అమావాస్య పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రమేష్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ అర్చకులు దత్తాత్రేయ స్వామి, శివరామయ్య శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, సింధురార్చన, ఆకు పూజ మహా మంగళ హారతి నిర్వహిస్తామన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.