• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్వామివారిని దర్శించుకున్న చాగంటి

TPT: తిరుపతి కపిలేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కపిలతీర్థంలో స్నానం చేసి, విఘ్నేశ్వరుడు, కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి దర్శనం చేస్తే శ్రేయస్సు, సంతానం, కుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. కాలభైరవ స్వామి, కోటిలింగాలు దర్శనం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని తెలిపారు.

April 15, 2026 / 07:12 PM IST

రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో నిలిచిన మన్యం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన్యం జిల్లా అద్భుతమైన ప్రగతిని కనబరిచిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కొనియాడారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో ఉన్న జిల్లా, ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 3వ స్థానానికి చేరుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీపడి జిల్లా టాప్-3లో నిలవడం గొప్ప అన్నారు.

April 15, 2026 / 07:03 PM IST

250 అక్రమ మద్యం బాటిళ్ల స్వాధీనం

KDP: తాళ్ల ప్రొద్దుటూరు పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సుగుమంచిపల్లి చెక్‌పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి 250 క్వార్టర్ బాటిళ్ల కేరళ మాల్ట్ విస్కీ స్వాధీనం చేసుకున్నారు. చామలూరు గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి వద్ద నుంచి మద్యం పట్టుబడగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 15, 2026 / 07:00 PM IST

టీడీపీ పొలిట్‌బ్యూరోలో లావుకు కీలక బాధ్యత

PLD: నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలుకు టీడీపీలో ప్రాధాన్యం పెరిగింది. పార్టీ అధిష్టానం ఆయనను పొలిట్‌బ్యూరో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా నియమించింది. ఇప్పటికే ఈ విభాగంలో లోకేష్, పల్లా శ్రీనివాసరావు సభ్యులుగా ఉన్నారు. తాజాగా లావు శ్రీ కృష్ణ దేవరాయలు కూడా ఈ జాబితాలో చేరారు.

April 15, 2026 / 06:58 PM IST

ఫలితాలు.. జిల్లా టాపర్లు వీరే..!

సత్యసాయి: జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 67 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు జిల్లా విద్యాధికారి చెన్నకేశవ ప్రసాద్ తెలిపారు. హిందూపురం ప్రభుత్వ కళాశాల విద్యార్థిని జయశ్రీ (494/500), కదిరి విద్యార్థిని ఎస్. చాందిని (991/1000) జిల్లా టాపర్లుగా నిలిచారని తెలిపారు.

April 15, 2026 / 06:50 PM IST

అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

ATP: రాప్తాడు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె స్వయంగా భోజనాన్ని పరిశీలించి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారధి పాల్గొన్నారు.

April 15, 2026 / 06:50 PM IST

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

ASR: గ్రామస్థాయిలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశించారు. పాడేరులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, సామాజిక అవగాహనపై చర్చించారు. మహిళలపై వేధింపులు, గృహహింస తదితర సంఘటనలు జరిగిన వెంటనే స్పందించాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ సహకరించాలన్నారు.

April 15, 2026 / 06:45 PM IST

‘ఫెయిల్ అయిన విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు’

AKP: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి, ఆందోళనకు గురికావద్దని పాయకరావుపేట సీఐ అప్పన్న విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయన్నారు. మీ కుటుంబానికి సమాజానికి మీరు ఎంతో అవసరం అన్నారు. పరీక్ష ఫెయిల్ అయితే మళ్లీ రాసే అవకాశం ఉంటుంది, కానీ ప్రాణం పోతే తిరిగి రాదన్నారు.

April 15, 2026 / 06:42 PM IST

స్పోర్ట్స్ హాస్టల్ తరలింపుపై వివాదం

కర్నూలులోని శాయి స్పోర్ట్స్ హాస్టల్‌ను తిరుపతికి తరలించాలనే యత్నాలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి భరత్ స్పందించాలని డిమాండ్ చేశారు. కర్నూలును స్పోర్ట్స్ సిటీగా చేస్తామని చెప్పిన ప్రభుత్వం హాస్టల్ పరిరక్షణపై తీసుకున్న చర్యలు వెల్లడించాలని కోరారు.

April 15, 2026 / 06:40 PM IST

మృత హోమ్ గార్డు కుమారుడికి కారుణ్య నియామకం

KDP: అనారోగ్యంతో మృతి చెందిన హోమ్ గార్డు ఎం. రమణమూర్తి కుమారుడు ఎం. అభిషేక్‌కు కారుణ్య నియామకం కింద హోమ్ గార్డు ఉద్యోగాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కుటుంబ యోగక్షేమాలు తెలుసుకుని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.

April 15, 2026 / 06:40 PM IST

జిల్లా జడ్జిని కలసిన న్యాయవాదుల సంఘ అధ్యక్షలు

CTR: పుంగనూరుకు జడ్జిలను నియమించాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ కోరారు. చిత్తూరులో జిల్లా న్యాయమూర్తి అరుణ సారికను బుధవారం ఆయన కలిశారు. శని, ఆదివారాల్లో హైకోర్టు జడ్జి జయ సూర్య జిల్లా పర్యటన నిమిత్తం రానున్నారని వారిని కలిసి పుంగనూరులోని కోర్టులోని సమస్య ఆయన దృష్టికి తీసుకువచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

April 15, 2026 / 06:37 PM IST

లోకేష్ నియామకంపై మంగళగిరిలో టీడీపీ సంబరాలు

GNTR: మంత్రి లోకేష్‌ను TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంపై మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పొలిట్‌బ్యూరో, జాతీయ-రాష్ట్ర కమిటీలలో లోకేష్‌కు కీలక బాధ్యతలు దక్కడంతో మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్‌లో నాయకులు స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

April 15, 2026 / 06:36 PM IST

భట్టిప్రోలులో అన్న క్యాంటీన్ ప్రారంభం

BPT: పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని బాపట్ల కలెక్టర్ డా. వినోద్ కుమార్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. భట్టిప్రోలులో కొత్తగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను వారు బుధవారం ప్రారంభించారు. రూ.61 లక్షలతో ఆధునిక వసతులతో దీనిని నిర్మించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ పేదలు, కూలీలకు రోజూ నాణ్యమైన భోజనం అందించనున్నారు.

April 15, 2026 / 06:35 PM IST

చందనోత్సవ ఏర్పాట్లపై తుది సమీక్ష

VSP: సింహాచలం చందనోత్సవంపై తుది సమీక్ష బుధవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ మేరకు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ ఉత్సవాన్ని 12 సెక్టార్లుగా విభజించి, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సుమారు 2 లక్షల మంది భక్తులు రానున్న నేపథ్యంలో క్యూలైన్‌లు, పార్కింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పారు.

April 15, 2026 / 06:32 PM IST

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన కాకినాడ విద్యార్థులు

KKD: కాకినాడ పీ.ఆర్ ప్రభుత్వ వృతి విద్యా కళాశాల విద్యార్థులు బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ గ్రూపుకు చెందిన రెండోవ సంవత్సరం విద్యార్థిని బి.రూప ఆశ్రిత 992/1000, మొదటి సంవత్సరం ఎలక్ట్రానిక్స్ చదువుతున్న ఎస్. హర్షిత 488/500 మార్కులు సాధించారు.

April 15, 2026 / 06:32 PM IST