KDP: పులివెందుల మున్సిపాలిటీలో ఇంఛార్జ్ కమిషనర్గా పనిచేస్తున్న మునికుమార్కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇప్పటి వరకు ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వహించిన ముని కుమార్, ఇప్పుడు పూర్తి స్థాయి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ATP: జిల్లా పరిధిలో భూ సర్వే పనులు వేగవంతం చేసేందుకు 247 లైసెన్స్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జాయింట్ కలెక్టర్ (జేసీ) విష్ణు చరణ్ పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆధునిక సర్వే పరికరాలపై శిక్షణ పొంది ఉండాలని, మూడేళ్ల లైసెన్స్ రెన్యువల్ కలిగి ఉండాలని తెలిపారు.
KRNL: YCP హయాంలో మహిళలను అనేక రకాలుగా కించపరిచారంటూ నిన్న పార్లమెంట్లో MP భైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలకు MLC వరుదు కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. ‘ఏపీలో కూటమి నేతల అరాచకాలు కనిపించడం లేదా? మీకు కళ్లు ఉండి చూడలేకపోతున్నారా? అఘాయిత్యాలకు పాల్పడిన వారికి పదవులు కట్టబెట్టారు. జగన్ హయాంలోనే 50% రిజర్వేషన్లు, డీబీటీ ద్వారా రూ.2.74 లక్షల కోట్లు అందించామన్నారు.
VSP: ఫేకర్స్ లే అవుట్లో ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. సుమారు 800 కుటుంబాలకు వినోదం, పిల్లల ఆటల కోసం వాకింగ్ ట్రాక్, ఫౌంటెన్, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థల వివరాలు, అంచనాలు సిద్ధం చేయాలని ఇంజనీర్లకు ఆదేశించారు.
VZM: మే 9న రాజాంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని స్థానిక కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శారదాంబ కోరారు. గురువారం కోర్టు ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో లోక్ అదాలత్ నిర్వహణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, బీమా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.
NDL: CM రేవంత్ రెడ్డిని గురువారం జిల్లాలోని మహిళా ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, భూమా అఖిలప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ను మహిళా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఢిల్లీకి ఏపీ టీడీపీ మహిళలు వెళ్లారు.
NDL: సంజామల మండలంలో అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.1°C, ఆ తర్వాత కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 44.9°C ఎండ తీవ్రత నమోదైనట్లు గురువారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మరోవైపు నేడు రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43°C – 44.5°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
PPM: మాజీ MLA అలజంగి జోగారావు ఆద్వర్యంలో గురువారం పార్వతీపురం అర్బన్లో కాఫీ విత్ YCP కేడర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 11,12,13 వార్డుల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టకాలంలో తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలను కలుపుకుని పార్టీ బలోపీతానికి కృషి చేస్తామని స్పష్టం చేసారు.
అన్నమయ్య: మదనపల్లెలో ఇంటర్ ఫలితాల నేపథ్యంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం కలకలం రేపింది. కురబలకోట మండలానికి చెందిన MPC విద్యార్థిని 9 మార్కులు తక్కువ రావడంతో ఫెయిల్ అయి మనస్థాపంతో పురుగులమందు తాగింది. మరోవైపు ఇందిరానగర్కు చెందిన CEC విద్యార్థిని ఫెయిల్ కావడంతో నిద్ర మాత్రలు మింగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: ఇంటర్ ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ భార్య సత్తా చాటారు. జిల్లాలోని ఆదోనికి చెందిన ఎస్.సుజాత స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివారు. సెకండియర్ MPHWలో 1000 మార్కులకు గాను, 991 మార్కులు సాధించారు. ఆటో నడుపుతూ చదివిస్తున్న భర్త జయరాం కష్టానికి ఫలితంగా ఆమె ఇలా ప్రతిభ చాటడంపై ప్రశంసలొస్తున్నాయి.
బాపట్లలో సచివాలయం తనిఖీలో డ్రెస్ కోడ్ పాటించని డిజిటల్ అసిస్టెంట్పై కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. విధులకు నైట్ దుస్తులతో హాజరైనందుకు సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 11 అర్జీలు పెండింగ్లో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసి, పనితీరును మెరుగుపరచాలని సూచించారు.
W.G: కాలువలు, డ్రైన్ల నుంచి గుర్రపుడెక్కను సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ వినూత్న కార్యక్రమం వల్ల అటు డ్రైన్ల ప్రక్షాళనతో పాటు ఇటు మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు.
సత్యసాయి: ధర్మవరం చేనేత క్లస్టర్ అభివృద్ధిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చేనేత కార్మికులకు స్థిరమైన ఉపాధి, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మాస్టర్ మోడల్ ప్లాన్ ద్వారా ఆధునిక మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరిచి, ధర్మవరం నేత ఖ్యాతిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు.
ఎన్టీఆర్: తిరువూరు పట్టణంలో పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ కే. మనోజ శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలలో చెత్త సేకరణ, కాలువల శుభ్రత పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పరిశుభ్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. శుభ్రత పనులు నిరంతరం కొనసాగాలని అధికారులను ఆదేశించారు.
కాకినాడ- లింగంపల్లి మధ్య నడిచే కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డైలీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ రమేశ్ గురువారం తెలిపారు. కాకినాడ-లింగంపల్లి ఎక్స్ప్రెస్ సామర్లకోటలో హాల్ట్ కల్పించినట్లు చెప్పారు. ప్రజలు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు