ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి, నిర్ణీత సమయంలోపు సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, తదితర అధికారులు పాల్గొన్నారు.
ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ ప్రజలకు జీవీఎంసీ పలు సూచనలు చేసింది. స్వచ్ భారత్ మిషన్ ప్రకారం ఇండ్లలో చెత్తను నాలుగు భాగాలుగా విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలో, పొడి చెత్తను నీలం రంగు, సానిటరీ వేస్ట్ను ఎరుపు రంగు, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలను నలుపు రంగు డబ్బులో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు.
KDP: మైదుకూరు హైవేపై వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్ రూట్ డ్రైవింగ్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని మైదుకూరు అర్బన్ సీఐ కె. రమణా రెడ్డి సూచించారు.
NDL: మహానందీశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులతో నేరుగా మాట్లాడారు. ఆలయ ఏర్పాట్లు, దర్శనంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కలిగేలా చూడాలని ఆదేశించారు.
ATP: యాడికి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ, డీఆర్డీఏ, గనులు, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.
ATP: యాడికిలో జరగనున్న జలధార కార్యక్రమానికి విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీడిపల్లి నుంచి బీటీపీ కాలువకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. పెండింగ్లో ఉన్న నిధులను వీలైనంత త్వరగా మంజూరు చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని మంత్రికి విన్నవించారు.
CTR: జీడీ నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. వీటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
TPT: తిరుపతి రైల్వేకాలనీకి చెందిన శ్రీనివాసులు హత్యకు గురైన విషయం తెలిసిందే. గత నెల 28న తనపల్లి వద్ద శ్రీనివాసులు, హోంగార్డు మురళి మరికొందరు మద్యం తాగారు. ఈక్రమంలో హోంగార్డు గంజాయి సేవిస్తుండగా శ్రీనివాసులు వీడియో తీసినట్లు సమాచారం. దీంతో శ్రీనివాసులును హోంగార్డు అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బీరు బాటిల్తో పొడిచి చంపేసినట్లు తెలుస్తోంది.
KDP: పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి చక్రాయపేట మండలంలోని 40 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొన్నాయి. గ్రామాలకు నీటి సరఫరాకు రూ.3.46 లక్షలు, 24 హ్యాబిటేషన్లలో పశువుల తాగునీటికి రూ.12.81 లక్షలు, 16 చోట్ల అద్దె బావుల కోసం రూ.3.68 లక్షలు, 31 బోరు బావుల డీపెనింగ్ కోసం రూ.18.60 లక్షలు అవసరమవుతాయని RWS SE ఏడుకొండలు తెలిపారు.
ప్రకాశం: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. టౌన్ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. అటల్ బిహారి వాజపేయి స్ఫూర్తితో నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు.
E.G: రాజమండ్రిలో అనుమతులు లేకుండా ప్రైవేట్గా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ యూనియన్ సభ్యులు సోమవారం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి దిశగా నడిపిస్తోందని గుంటూరు పశ్చిమ MLA గళ్ళా మాధవి తెలిపారు. అన్ని హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ పరిధికి రూ.604 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
BPT: కర్లపాలెంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ శ్రీదేవి ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆమె స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు.
KRNL: ఆదోని పట్టణంలోని 35వ వార్డులో మాజీ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ స్థాపించి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యేగా పార్థసారథి గెలిచిన వెంటనే నియోజకవర్గంలో రూ. 10 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహబూబ్, మధుసూదన శర్మ, తదితరులు పాల్గొన్నారు.