కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉందని, అవసరమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోర్టు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.130 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఇవాళ వెల్లడించారు.
VZM: తెర్లాంకి చెందిన శనపతి రాము కుమార్తె జ్ఞానవర్షిణికు మంజూరైన సీఎం సహాయ నిధి రూ.1,00,000 చెక్కును ఎమ్మెల్యే బేబినాయన అందజేశారు. బొబ్బిలి కోటలో శనివారం చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదం చేస్తుందని బేబినాయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
CTR: స్వచ్ఛతపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్వచ్ఛ రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కుమారి ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ప్రజలందరూ పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఎంపీడీవో నాగరాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సత్యసాయి: లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం నుంచి శ్రీస్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ ఛైర్మన్ రమానందన్ ఎమ్మెల్యే కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వాదాలు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు.
కోనసీమ: మండపేట జూనియర్ కళాశాల ఆవరణలలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న క్రీడా వికాస కేంద్రాన్ని పూర్తిచేయుటకు రూ.1.41 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలియజేశారు. టెండర్లు పిలవటం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. మండపేట నియోజకవర్గంలో యువతకు ఎటువంటి క్రీడా ప్రాంగణాలు లేనందున ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. తాడిపత్రికి చెందిన మహిళా ప్రయాణికురాలు సంధ్యారాణి పత్తికొండ వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్లో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NLR: సౌర వెలుగులతో గ్రామాలు వెలిగిపోనున్నాయి. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివెలపాలెం, మనుబోలు, కాకుపల్లి వంటి 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలను ఎన్నుకొన్నారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన గ్రామాలకు రూ. కోటి కేంద్ర మంజూరు చేస్తుంది.
WG: నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.
KDP: లింగాల మండలం అక్కులగారిపల్లెలో హరిస్వామి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ‘న్యూ కేటగిరీ’ విభాగంలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆరు రకాల నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొనే రైతులు శనివారం లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
TPT: వెంకటగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతూ సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు ఈ సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి రూపాయి నేరుగా అర్హులైన బాధితులకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.
BPT: మార్టూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పంచాయతీ సిబ్బందితో కలిసి ఆసుపత్రి పరిసరాలను, వార్డు గదులను శుభ్రం చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చికెన్ పాక్స్ (ఆటలమ్మ) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు,యువత ఎక్కువగా ప్రభావితమవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం, దద్దుర్లు, తీవ్రమైన దురద వంటి లక్షణాలతో అనేక మంది బాధపడుతున్నారని సమాచారం. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, బాధితులకు వైద్యసహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు
TPT: పురమిత్ర యాప్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ ఎన్.మౌర్య, అధికారులను ఆదేశించారు. పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆరోగ్య శాఖ అధికారులతో కలసి ప్రకాశం పార్క్, శివ శక్తి కళ్యాణ మండపం, తదితర ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. స్వర్ణ వార్డులో కార్యదర్శుల హాజరు నమోదు రికార్డులను పరిశీలించారు.
GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు చినరావూరు పార్కు వద్ద ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సంప్రదాయ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు.
PPM: ప్రజల భాగస్వామ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు గన్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతినెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ కార్యక్రమం పార్వతీపురం కేంద్ర ఆసుపత్రిలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.