CTR: మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి సంఘం డస్క్ బెంచీలను వితరణగా అందజేశారు. సుమారు రూ. 90 వేలు విలువగల 60 డస్క్ బెంచీలను పాఠశాలకు అందజేసి దాతృత్వాన్ని చాటారు. HM శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అసోసియేషన్ ఫౌండర్ ప్రొఫెసర్ మోహన్ ఆచారి నిధుల సమీకరణ జరిపి చేస్తున్న కృషి ఆదర్శప్రాయం అని కొనియాడారు.
NTR: తిరువూరు లోని కేడీసీసీ బ్యాంక్ కార్యాలయం వద్ద నియోజకవర్గ పరిధిలోని తిరువూరు, గంపలగూడెం, ఏ కొండూరు, విసన్నపేట మండలాల సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా 4వ రోజు నిన్న ధర్నా చేశారు. జీవో నెం 36 అమలు చేయాలని, 2019 నుంచి 2024 వరకు పెండింగ్లో ఉన్న పీఆర్సీలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రకాశం: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులతో కొండేపి ఏమ్మెల్యే, మంత్రి స్వామి అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల పట్ల భయం లేకుండా రాయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. గురుకుల విద్యార్థుల కొరకు పరీక్షలు రాసేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును తొలగించడాన్ని గురువారం వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. 2009లో పాలకమండలి తీర్మానం ప్రకారమే ఆ పేరు పెట్టారని ఆయన గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.
ATP: రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ఉర్దూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పని చేస్తాయని డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని వివరించారు.
AKP: జనన మరణాల నమోదుపై ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువచ్చిందని డీఎం అండ్ హెచ్వో డాక్టర్ హైమావతి గురువారం తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం జనన మరణాల రిజిస్ట్రేషన్ను 21 రోజుల్లో ఉచితంగా నమోదు చేయించుకోవచ్చునని సూచించారు. 21 రోజుల నుంచి 30 రోజుల్లో నమోదు చేస్తే రూ.25, 30 నుంచి ఏడాదిలోపు రూ.250 అపరాధ రుసుం చెల్లించాలన్నారు.
PLD: పిడుగురాళ్లలో మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తికి కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. నిందితుడిని పోలీసులు సివిల్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. పట్టణంలో రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వాహనదారులను గురువారం రాత్రి హెచ్చరించారు.
E.G: రాజమండ్రిలోని SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 20, 21 తేదీలలో ‘యువతలో ఆవిష్కరణలు, వ్యాపార నైపుణ్యాల అభివృద్ధి’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. బి.వి. తిరుపణ్యం తెలిపారు. ఈ సదస్సులో అధ్యాపకులు పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులు పాల్గొని అవసరమైన మెలకువలు నేర్చుకోవచ్చన్నారు.
SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ గురువారం సీఎం చంద్రబాబును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు, బోధి బట్టి డ్రైనేజీ సమస్యలు తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. వంశధార కాలువలు, డ్రైనేజీ పనుల కోసం రూ. 31.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.
PPM: నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా ఆరోగ్య సర్వేలు చేపట్టాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. అడ్డాపుశీల లో ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత ఎన్.సి.డి, ఆర్.బి.ఎస్.కె సర్వే, స్క్రీనింగ్లపై వైద్య సిబ్బందిని ఆరా తీసి ఆన్లైన్ నమోదు నివేదికలు పరిశీలించారు.
ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెంకు చెందిన సతీశ్ (25) గురువారం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. కాళ్లలో చెరువు పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సతీశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఏడాది క్రితమే వివాహమైన సతీశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
E.G: సీతానగరం మండలంలోని పలు గ్రామాలకు శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎస్ఈ నటరాజన్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతానగరం, సింగవరం పంచాయతీలోని నాగరత్నం కాలనీ, రఘుదేవ పురాల్లో గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగగదారులకు విద్యుత్ను నిలిపివేస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.
KRNL: ఆదోని శివారు సిరుగుప్ప సర్కిల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన విరుపాక్షి గాయపడ్డారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు టిప్పర్ను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు సీఐ అబ్దుల్ తెలిపారు.
CTR: గ్యాస్ పంపిణీలో సంతృప్తి శాతం పెంచాలి అని జేసీ రాజేంద్రన్ హెచ్చరించారు. నిన్న సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా డీలర్లు, నిర్వాహకులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జేసీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీబీఆర్ఎస్ సర్వేలో గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ప్రజల సంతృప్తి శాతంలో జిల్లా చాలా వెనుకబడి ఉందన్నారు.