ఇవాళే రిలీజైన కుబేర సినిమా కుమ్మేసింది. బాక్సాఫీసు గుండెల్లో దడ పుట్టించింది. ఓపెనింగ్స్ చూస్తుంటే సింగిల్ స్క్రీన్ ధియేటర్లకి పునర్జన్మలా ఉంది. అంటే ఈ మధ్య చాలా సినిమాలకు ఓపెనింగ్సే లేవనుకోండి. తెలుగు సినిమా హీరోలైతే ఆడియన్స్ ధియేటర్లకి రావడానికి ఏమాత్రం ఇష్టం చూపించడంలేదు. వచ్చినవి వచ్చినట్టుగా పోతున్నాయి. ఈ దెబ్బకే థియేటర్లు ఒకటీఒకటి మూత పడిపోతున్నాయి. ఉన్నవి కూడా మేం రన్ చేయలేం బాబోయ్ అని ఎగ్జిబిటర్లు జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు మూసేస్తామని చిన్నసైజు బెదిరింపులే పంపించారు. ఇది వేరే కథ కాదు. కుబేరకి సంబంధించిన కధే.
రిచ్ వెర్సస్ పూర్ కథలు సవాలక్ష వచ్చేశాయ్ ఇప్పటివరకూ అన్ని భాషల్లో. కుబేర కూడా అదే కోవలో కథ. కానీ, ఇందులో ప్రేక్షకుల్ని పీడించి, పీకపిసికి చంపే డైలాగుల బాదుడు, వీర ఎలివేషన్లు, ఐటెమ్ సాంగ్ కోసమే క్లైమాక్స్ అన్నట్టుగా తోసుకొచ్చే ఆఫ్ నూడ్ ఐటెమ్ సాంగ్స్….ఇలాటి బెడద లేకుండా సరికొత్త పంథాలో పాత కథని కొత్త పాయంట్తో చాలా ఇంట్రస్టింగ్గా నెరేట్ చేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇలాటి కథని ఓ భారీ చిత్రంగా నిర్మించడానికి కథని ఎంపిక చేసిన నిర్మాతల్లో ఒకరైన పుస్కూర్ రామ్మోహన్రావుని ముందస్తుగా మెచ్చుకోవాలి. ఆయన ఎంపిక మీద నమ్మకంతో సునీల్ నారంగ్ ఎంత ఖర్చయినా సరే పుస్కూర్ రామ్మోహనరావుతో సంయుక్తంగా నిర్మాణంలోకి అడుగుపెట్టినందుకు ఇద్దరినీ మనసారా అభినందించాలి.
ఎందుకంటే మూస చిత్రాల ఊభిలోనుంచి, ఉచ్చులోనుంచి, ఆ రొచ్చునుంచి నిర్మాతలు ఇంకా బైటకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. లేకుంటే ఓ లైలా, మజాకా, రాబిన్హుడ్ లాంటి మూస చిత్రాలు వచ్చే ఉండేవి కావు. కొత్త కథలను ఎంపిక చేయడంలో మన తెలుగు నిర్మాతలు పూర్తిగా వెనుకబడిపోయారు. మళ్ళీ ఇదే నిర్మాతలు మంజుమ్మల్ బాయ్స్ , భూతకాలం, సూక్ష్మదర్శిని, తుంబాట్ లాంటి సినిమాలను మెచ్చుకుంటుంటారు. కావాలంటే డబ్ చేసేస్తారు, లాభాలు సంపాదించేస్తుంటారు. దానికి మాత్రం ఢోకా ఉండదు. కోర్ట్, హిట్ 3లాంటి చిత్రాలు తీసే దమ్ము, ధైర్యం ఉన్న నిర్మాతల్ని భూతద్దం పెట్టి వెతికినా కూడా దొరకరు. అందుకే హీరో నాని నిజంగా నిర్మాతగా కూడా హీరోగా నిలబడ్డాడు.
ఇప్పుడు మళ్ళీ ఆ హీరోలు సునీల్ నారంగ్ అండ్ పుస్కూర్ రామ్మోహనరావులు మాత్రమే. కుబేర కథని నమ్మి, కరెక్ట్ జడ్జిమెంట్తో తీశారు. బడ్జెట్ బాగా ఎక్కువైనా కూడా వెనుకంజ వేయకుండా దమ్ముగా తీశారు. ఇది ఒక రకంగా కొత్త దర్శకుల కొత్త పోకడల కథలకు కుబేర ప్రాణం పోసినట్టే. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో అన్నీ సీరియస్గా నడిచిన కథాచిత్రాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తున్నారు. ఓటిటిలలో అన్ని భాషాచిత్రాలను చూడ్డానికి అలవాటు పడిన మన తెలుగు ప్రేక్షకులకు నాసిరకం చిత్రాలను చూసే ఓపిక ఉండడం లేదు. ఆ నిజాన్ని గ్రహించడానికి మన తెలుగునిర్మాతలకు టైం పడుతోంది. ఈ లోగా కోట్లు కోట్లు ఆవిరైపోతున్నాయి. ఆ దుస్థితికి కుబేర చెక్ పెట్టింది అనే చెప్పాలి.