ప్రపంచప్రఖ్యాతమైన హైదరాబాద్లోని విశ్వకీర్తిని సాధించుకున్న మన రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలు తిరుగుతున్నాయా? ఆశ్చర్యం. ఎన్ని షూటింగ్లు, ఎన్నెన్ని సినిమాలు, ఇన్నేళ్ళలో, ఇన్నాళ్ళలో…..ఎప్పుడూ కనీవినీ ఎరుగనిది. కలలో కూడా ఊహించనిది. ఓకే విష సర్పాలున్నాయన్నారు. పులులు కూడా వచ్చాయన్నారు. దానికి అధినేత రామోజీరావు శ్రద్ధగా తగు పరిష్కారచర్యలను తీసుకున్నారు. అన్నీ సద్దుమణిగిపోయాయి. కానీ బాలీవుడ్ భామ కాజోల్ ఈ మధ్య ఓ స్టేట్మెంట్ ఇచ్చి దేశమే కాదు, ప్రపంచమంతా కలకలం రేపింది.
ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న మా సినిమా ప్రమోషన్ల సందర్భంలో రామోజీ ఫిల్మ్ సిటీలో హాంటింగ్ వైబ్స్ ఉన్నాయని, మళ్ళీ జన్మలో ఎప్పుడూ రామోజీ ఫిల్మ్ సిటీకి రానని తెగేసి చెప్పింది. ఆయ్యబాబోయ్ ఇంత స్టేట్మెంట్ ఇంత దారుణంగా ఇచ్చిందేంటి అందరూ అవాక్కయిపోయారు. గతంలో ఇక్కడ కాజోల్ కొన్ని సినిమాల షూటింగ్లో పాల్గొంది. అప్పటి నుంచే అలాటి భయం కలిగింది అని చెబుతూ, దానికి కావాలసిన యదార్ధ అనుభవాన్ని మాత్రం ఏం చెప్పలేదు. హాంటింగ్ వైబ్స్ అంటే ఎవరో వెనకనే వస్తున్నట్టు, ఎవరో ముట్టుకున్నట్టు, ఎవరో పక్కగా నడిచి వెళ్ళిపోతున్నట్టు, మంచం మీద తన పక్కనే ఎవరో పడుక్కున్నట్టు, లేదా పీక పిసుకుతున్నట్టు అనిపించడాన్ని హాంటింగ్ వైబ్స్ అంటారు. ఇలాంటివేవో కాజల్కి ఎదురైనట్టుగా కాజల్ మాటలు మీడియా తర్జుమా చేసింది. కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంతవరకూ అలాంటిది ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. పైగా రామోజీ ఫిల్మ్ సిటీ అంటే పడి చచ్చిపోతారు. బాహుబలి, కల్కి, త్రిబుల్ ఆర్ లాంటి చిత్రాలే కాదు, ఎన్ని హిందీ సినిమాలు, కొన్ని హాలీవుడ్ సినిమాలు….లెక్కలేనన్ని జరిగిన చిత్రపరిశ్రమకి ఓ భూతల స్వర్గం రామోజీ ఫిల్మ్ సిటీ అంటే.
సినిమాలన్నవి ఒక్కటే కాదు, రామోజీ ఫిల్మ్ సిటీ అన్నది గత కొన్నేళ్ళగా ప్రపంచయాత్రికులకు ఓ అద్భుతమైన సందర్శనా స్ధలం. సాలీనా లక్షలాదిమంది వచ్చిపోతుంటారు. ఫిల్మ్ సిటీ అందాలను మెచ్చుకుని పొగడ్తలలో ముంచెత్తుతుంటారు. అలాంటి ఓ గొప్ప ప్లేస్ని కాజోల్ తన భయాలతో చాలా బేడ్గా కామెంట్ చేసిందని అందరూ కాజోల్ ని పిచ్చిపిచ్చిగా కామెంట్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు హాలీవుడ్ సంబంధిత కొన్ని సంస్థలు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏషియాలోనే ద బిగ్గెస్ట్ ఫ్లోర్ని నిర్మిస్తున్నారు. ఇటీవల వైల్డ్ ఫైర్లొ తగలబడిపోయిన హాలీవుడ్ స్టూడియోలో సగంలో ఆగిపోతే అవన్నీ ఈ ఫ్లోర్లోనే జరిపించాలని హాలీవుడ్ నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో కాజోల్ కామెంట్లు సంచలనాన్ని సృష్టించాయి.
ఊటీలో కూడా దెయ్యాలు
ఊటీలో వేల సినిమాలు అన్ని భాషలవి షూటింగులు జరుపుకున్నాయి. అక్కడ షూటింగ్ చేయని ఇండియన్ సూపర్ స్టార్స్ లేనే లేరు. అక్కడ దెయ్యాలున్నాయని చెప్పుకునేవారు. మన సహజనటి జయసుథ కూడా ఒకసారి చెప్పారు. షూటింగ్లో ఉన్నప్పుడు గ్యాప్లో కుర్చీలో కూర్చుంటే ఎవరో పక్కనే వచ్చి నిలబడినట్టు, వెనకనే నిలబడి టచ్ చేసినట్టు అనిపించేదని, తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించేవారు కాదని తలచుకున్నారు. అలాగని అక్కడ షూటింగ్లు ఏవీ ఆగలేదు. ఊటీ కూడా ఓ వరల్డ్ ఫేమస్ సమ్మర్ స్టేషన్.
అన్నానగర్లో హాంటింగ్ హౌస్
మద్రాసులో అన్నానగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో రెగ్యులర్గా షూటింగులు జరుగుతుండేవి. అయితే అక్కడ కూడా ఈ దెయ్యాల ప్రస్తావన వచ్చింది. యూనిట్ సభ్యులతో పాటు ఎవరో వచ్చి అక్కడ టిఫిన్లు, కాఫీలు తినితాగుతున్నట్టుగా అనిపించేదని యూనిట్ వారు చెప్పాక అక్కడ షూటింగులు ఆపేశారు తర్వాత రోజుల్లో. అయితే రామోజీ ఫిల్మ్ సిటీ మీద అప్పట్లో ఓ ఫిర్యాదు ఉండేది. అక్కడ నీళ్లు తాగితే కీళ్ళ నొప్పులు వస్తున్నాయని ఆ ఫిర్యాదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓ సారి దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నపూర్ణ స్టూడియలో ఒక సినిమా షూట్ చేస్తుండగా అక్కడికి వచ్చి, రామోజీ ఫిల్మ్ సిటీలో నీళ్ళు తాగి తనకి కీళ్ళ నొప్పులు వచ్చాయని చెప్పారు. దాసరి అందుకు అంగీకరించలేదు. ఇలా ఇప్పుడు కొత్తగా కాజోల్ రామోజీ ఫిల్మ్ సిటీ మీద దుమారం లేపింది.