MDCL: అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో అల్వాల్లో పోలీసులు బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు సిద్ధమైన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చింతల మాణిక్ రెడ్డి, మోయి సుజాత, మల్లికార్జున గౌడ్, మురళీకృష్ణ, అజయ్ రెడ్డి, ఉదయ్, గోపి, పద్మిని, అజిత్ ఉన్నారు.
NZB: యాసంగి సాగు పనుల్లో నిమగ్నమైన అన్నదాతకు సర్కారు తోడ్పాటు లభించింది. రైతు భరోసా పథకం కింద 2025-26 సీజన్కు సంబంధించి నిధుల జమ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5,69,770 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 274.37 కోట్లు వచ్చి చేరాయి.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకులను కరీంనగర్ రూరల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ చర్యపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్య గొంతును నొక్కలేరని విమర్శించారు.
HNK: వనమాల కనపర్తి గ్రామంలో ఉపాధి హామీ పనులను స్థానిక సర్పంచ్ రిపిక ఎల్లస్వామి ప్రారంభించారు. ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పనులు చేసే వద్ద ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈజీఎస్ సిబ్బందికి సర్పంచ్ సూచనలు చేశారు. ఉపసర్పంచ్ నోముల కుమార్, 4వ వార్డు సభ్యుడు వినయ్, తదితరులు ఉన్నారు.
JGL: పండుగల కారణంగా వచ్చిన సెలవుల తర్వాత జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నేటి నుంచి క్రయవిక్రయాలు మళ్లీ ప్రారంభం కానున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అమావాస్య, ఉగాది, రంజాన్, ఆదివారం నేపథ్యంలో మార్కెట్ మూసివేయగా.. నేటి నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగనున్నాయని వెల్లడించారు. రైతులు, వ్యాపారులు గమనించాలన్నారు.
MBNR: నవాబ్పేట్ మండల కేంద్రంలోని బాలాజీ మార్కెట్ యార్డ్కు 1998 క్వింటాళ్ల వేరుశనగ వచ్చినట్లు కార్యదర్శి రమేష్ తెలిపారు. వేరుశనగ క్వింటాల్ గరిష్ట ధర ₹8,010 పలకగా, కనిష్టంగా ₹7,590 పలికింది. అయితే, చింతపండు గరిష్టంగా ₹9,890 ధర పలకడం విశేషం. వేరుశనగతో పోలిస్తే చింతపండుకే అధిక ధర రావడంతో రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
MDCL: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. గత మూడు వారాల్లోనే 20 వేలకుపైగా కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటించని వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు.
NLG: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రాక్టికల్ తరగతులు నల్గొండ ఎన్జీ కాలేజీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఐదో సెమిస్టర్ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, బొటనీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ తరగతులు ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
NRPT: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఊట్కూరు మండలంలో పోలీసులు ముందస్తు అరెస్టులు కొనసాగించారు. రామచంద్రరావు పిలుపు మేరకు రాజధానికి బయలుదేరే బీజేపీ నాయకులను అర్ధరాత్రి నుంచే ఇళ్ల వద్ద మోహరించి అదుపులోకి తీసుకున్నారు. నాయకులు ఈ చర్యలను ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వం భయంతోనే అక్రమ అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు.
SDPT: చేర్యాల మండలం వెచరేణిలో 2008-09 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. నాటి పాఠశాల ముచ్చట్లను మిత్రులు గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆ రోజంతా సరదాగా గడిపారు. కొందరు మిత్రులు తమ జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఎంతో కాలం తర్వాత కలిసిన స్నేహితుల నవ్వులతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.
MHBD: కేసముద్రం మండలం అర్పణపల్లిలోని వట్టి వాగులో చేపల వేటకు వెళ్లిన అలవాల సాయి (28) మత్స్యకారుడు సోమవారం మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనమ్మతుని గడ్డ వాసిగా గుర్తించారు. సాయి ఉపాధి నిమిత్తం గ్రామ శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి వలలో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు.
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో సాహితి వేదిక ఏకగ్రీవ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్బంగా గౌరవ అధ్యక్షుడిగా రాథోడ్ భీంరావు, అధ్యక్షుడిగా ముంజం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షులుగా తొడసం కైలాష్, పవార్ వినోద్, ప్రధాన కార్యదర్శిగా జాదవ్ మురళిలను ఎన్నుకున్నారు. అదేవిధంగా సభ్యులను సైతం నియమించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.
KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పంటల కోసం పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగుతోంది. యాసంగి పంటల కోసం సోమవారం 229 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 23 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతుందని, ఎటువంటి ఇన్ ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు యాసంగి పంటల కోసం 0.908 TMCల నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు.
PDPL: మంథని మండలం సూరయ్యపల్లి రైతువేదిక నుంచి తెనుగు గూడెం వరకు, గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి పోచమ్మ దేవాలయం వరకు ఆదివారం రూ.15 లక్షలతో EGS నిధుల కింద సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. సర్పంచ్ ఆర్ల నాగరాజు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రోడ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారూ.
WGL: వరంగల్ ఆర్టీసీ రీజియన్లో అవుట్ సోర్సింగ్ డ్రైవర్ల నియామకాలపై అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీలు దళారుల ద్వారా అభ్యర్థుల నుంచి రూ.20–50 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ప్రచారం. పర్మినెంట్ ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. అధికారులు స్పందించి మోసాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.