తెలంగాణ మంత్రి కేటీఆర్ కి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ఇవ్వడం లేదంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తాను చేయాల్సిన పనులను చేయకుండా కేంద్రంపై తరచూ విమర్వలు చేస్తోందని మండిపడ్డారు.
ఐటీఐఆర్ పై బహిరంగ చర్చకు రావాలంటూ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఐటీఐఆర్ పై కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. ఐటీఐఆర్ ను 2 విడతలుగా చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.ఐటీఐఆర్ కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేయలేదన్నారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు మొదటి ఫేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం 2015 లోనే 85 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇమ్లిబన్ బస్టాండ్ నుంచి ఫలక్ నామా వరకూ మెట్రో ఎందుకు రాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మెట్రో రాకపోవడానికి బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎంకు పాతబస్తీ అభివృద్ధి పై చిత్తశుద్ధి లేదన్నారు.
ఫలక్ నామా నుంచి శంషాబాద్ వరకూ కొత్త మెట్రో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. కొత్త రైల్వే లైన్ కోసం డీపీఆర్ పూర్తి చేయకుండా,స్థలం సేకరించకుండానే కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపడం లేదని స్పష్టం చేశారు. కేవలం కేంద్రానికి ఉత్తరాలు రాస్తే కంపెనీలు రావని, డీపీఆర్ లు ఇస్తే పనులు ముందుకు సాగుతాయని సూచించారు.