ATP: గుంతకల్లు పట్టణంలోని పక్కిరప్ప కాలనీలో శనివారం పిచ్చికుక్క దాడిలో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క దాడిలో గాయపడిన నాగరాజు మాట్లాడుతూ.. కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
HNK: దేశంలోనే తెలంగాణలో వరి పంట ఎక్కువ ఉత్పత్తి అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పని లేకుండా రికార్డు స్థాయిలో పంటలు పండించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. గోదావరి, కృష్ణ జలాల విషయంలో బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.
PDPL: సింగరేణి ఆర్జీ-2 ఏరియాలో కార్పోరేట్ జిఎం (ఇఅండ్రం) సీహెచ్పీ సోమయాజుల వి.రామమూర్తి శనివారం ఆర్జీ-2 ఏరియాని సందర్శించారు. ముందుగా సీహెచ్పీ లోని సమస్యలను, పని స్థలాలను పరిశీలించారు. సీహెచ్పీ నుండి ఎన్టీపీసీకి బొగ్గు రవాణా రోజుకు ఎన్ని రేకులు సరఫరా తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం జీఎం కార్యాలయంలో ఆయనను ఏరియా జనరల్ మేనేజర్ వెంకటయ్యను సన్మానించారు.
W.G: పాలకొల్లులో “KVM ఛాంబర్స్ జూనియర్ కళాశాల” గోల్డెన్ జూబ్లీ, “BRR & GKR ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల” పెర్ల్ జూబ్లీ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే శ్రీ రఘురామకృష్ణ రాజు పాల్గోని కళాశాలలో ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ బ్లాక్ను ప్రారంభించారు.
SDPT: రైతులను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేటలో మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పత్తి యార్డులో నిరసనకు దిగారు. రైతులు 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
KDP: కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షురాలు ఎన్.డీ విజయ జ్యోతి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ సెక్రెటరీ కుమార్ హాజరయ్యారు. రాబోయే లోకల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందించాలని వారు సూచించారు.
VKB: పెళ్లి పేరుతో మోసాలు జరుగుతున్నాయని అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వికారాబాద్ జిల్లా సైబర్ సెక్యూరిటీ టీం ప్రకటన విడుదల చేసింది. మోసగాళ్లు పెళ్లి పేరుతో పెళ్లి సంబంధాలు, ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల వలలో పడకండి. మోసం గమనించిన వెంటనే 1930కి కాల్ చేయండి, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామంలో సీసీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను ఎంపీపీ మొదలవలస చిరంజీవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.5 లక్షల మండల పరిషత్ నిధులతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
WGL: సమాచార హక్కు చట్టంపై ప్రతీఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ICDS వరంగల్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి అన్నారు. GWMC 42వ డివిజన్ రంగశాయిపేటలోని అంగన్వాడీ కేంద్రాలలో సమాచార హక్కు చట్టంపై పిల్లల తల్లిదండ్రులకు శనివారం ఆమె అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు వినీత, యశోద, హైమావతి, ఆశ కార్యకర్తలు, తదితరులున్నారు
KRNL: మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో ఎద్దుల బండి ప్రమాదంలో బాలుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాజా అనే రైతు ఎద్దుల బండితో పొలం పనులకు వెళ్తుండగా ఎద్దులు అకస్మాత్తుగా బెదిరి, అదే గ్రామానికి చెందిన బీరప్ప అనే బాలుడిపై దాడి చేశాయి. గాయాలతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.
KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెంలో కంటే లక్ష్మి శనివారం ఉదయం కళ్లు తిరిగి పడిపోయింది. 108కి సమాచారం అందించి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
RR: జిల్లా బీజేపీ నేతల ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. రూ.8,300 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దీంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
WGL: ఖానాపురం BRS పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులు సమావేశాన్ని ఏఎంసి మాజీ ఛైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల పట్ల నిజంగా ప్రేమ ఉంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీని వెంటనే అమలుపరచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగ భవాని ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధ్యక్షతన డీఎస్సీ- 2025 ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. గురువులు సమాజానికి ఆదర్శమని అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్ష సాధింపులకు పాల్పడితే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ తీసి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నూతన ఉపాధ్యాయులను నియమించిందని తెలిపారు.
RR: రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, హయత్ నగర్, మహేశ్వరం సహా అనేక ప్రాంతాల్లో పత్తి పండించిన రైతులు కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, పత్తికాయల నుంచి మొలకలు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.