HYD: ఆరోగ్యమే ఆస్తి అని పెద్దలు చెబుతుంటారు. ఇదే సూత్రం ఇప్పటి తరానికి సైతం వర్తిస్తుందని HYD జీవన్ దాన్ అధికారులు పేర్కొన్నారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, గుండె కవటాలు, కిడ్నీల విలువ లక్షల నుంచి కోట్లతో సమానం. మీ ఆరోగ్యం కాపాడితే కోట్లు సంపాదించినట్లే. అవయవాల ఫెయిల్ అయిన వారు 4 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.
NDL: కలెక్టర్ రాజకుమారి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులకు శుక్రవారం కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సునీల్ షౌరాణ్తో కూడిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
NGKL: ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో వెలసిన 12వ శతాబ్దపు పురాతన లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 1171 నాటి చారిత్రక శాసనాలు, పురాతన బావి, మెట్లు, తేరు ఇప్పటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.
AP: అనకాపల్లిలో బ్లూజెట్ హెల్త్కేర్ యూనిట్కు మంత్రి లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్లో యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్కేర్ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ సంస్థ ఏర్పాటులతో 1,750 మందికి ప్రత్యేక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.
SRD: జిల్లా ఆసుపత్రిలో మార్చి నెలకు సంబంధించిన సదరం శిబిరాల షెడ్యూల్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ విడుదల చేశారు. మార్చి 4, 11, 18, 25 తేదీల్లో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. శిబిరానికి వచ్చే వారు స్లాట్ బుకింగ్ మెసేజ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావలన్నారు.
అన్నమయ్య: రాజంపేట పార్లమెంటు కార్యాలయం ఎదుట TDP పార్టీ ప్రచార రథాన్ని రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ప్రారంభించారు. మార్చి 2న జరిగే పార్లమెంటు పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు, కమిటీలోని 41 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
CTR: చీటీల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇటివల పలమనేరులో ఓ ఘటన వెలుగు చూడగా, నేడు పూతలపట్టులో అనధికార చీటీ నిర్వాహకుడు పరారైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2-3 కోట్ల మేర చీటీ డబ్బులతో ఓ వ్యాపారి ఉడాయించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో సహా అందుబాటులో ఉండకపోవడం, చీటీ కార్యాలయాన్ని మూసివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ATP: జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. అంగన్వాడీ, పీహెచ్సీల పరిధిలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అన్నారు. తక్కువ బరువున్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, బాలింతలకు పౌష్టికాహారం సకాలంలో అందించాలని సూచించారు.
KKD: రాష్ట్రంలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, అధికారమే కల్తీగా మారిందని వైసీపీ మాజీమంత్రి కాకినాడ రూరల్ ఇంఛార్జ్ కురసాల కన్న బాబు ఆరోపించారు. శుక్రవారం రూరల్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కల్తీ పాలు తాగి జనం చచ్చిపోతే శవాల వద్ద కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే అధికార ఎమ్మెల్యేలు ఆటలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు అంకురార్పణ పూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుల ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుని గౌరవంగా ఆహ్వానించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ ఆన్లైన్ టికెట్లు, ఈ-హుండీ, ఏసీ సేవలను ప్రారంభించారు. అనంతరం స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.
SKLM: పలాస మున్సిపాలిటిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
MNCL: వేమనపల్లి శివారులోని చేనులో మేకలు మేపుతున్న రాజన్న, తుమ్మిడి సాయికిరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజన్న, సాయికిరణ్ కాలు మడమపై గొడ్డలితో దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. నీల్వాయి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
W.G: భీమవరంలో పలు పాల కేంద్రాలపై శుక్రవారం ఆహార భద్రత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాస్ సెంటర్, డీఎన్ఆర్ కళాశాల రోడ్డులోని కేంద్రాల్లో నిల్వ ఉన్న పాలను పరిశీలించి, నమూనాలను సేకరించారు. ఆహార భద్రతాధికారి సుందరరామిరెడ్డి మాట్లాడుతూ.. సేకరించిన శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు.
MDK: రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
GDWL: గద్వాల ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి అయిజ పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో 50 మంది సిబ్బందితో డీఎస్పీ వై. మొగిలయ్య భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 76 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించిన డీఎస్పీ, కాలనీల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.