CTR: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని బైరెడ్డిపల్లి ఎంపీడివో ఉపేంద్ర శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అకౌంట్స్ సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తూ ప్రమోషన్ పై బైరెడ్డిపల్లి ఎంపీడివోగా ఇక్కడికి వచ్చారు. విధుల్లో చేరిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నుంచి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలో కలసి సన్మానించారు.
JN: సలాక్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శంభు రామ దేవాలయంలో గత మూడు రోజులుగా దేవతమూర్తుల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు వేడుకలకు జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. సలాక్ పూర్ గ్రామాభివృద్ధికి సహకరిస్తానని, భగవంతుడి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలన్నారు.
ELR: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను రాజకీయ ప్రదర్శనలకు వినియోగించడం అత్యంత నీచమైన పని అని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడి, తీవ్రంగా ఖండించారు.
NGKL: అచ్చంపేట పట్టణంలో ఈనెల 23న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు గిరిజన నేతలు తెలిపారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ వేడుకలకు ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో యాదగిరి, డీఎస్పీ పల్లె శ్రీనివాస్ హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో భూ, రెవెన్యూ సమస్యలపై అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి భూములకు సంబంధించిన వివాదాలు, రెవెన్యూ సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను నమోదు చేసి పరిష్కార చర్యల కోసం వివరాలను సేకరించారు.
VSP: కేజీహెచ్లో ‘జీరో వేస్ట్–లిటిల్ గవర్నెన్స్’ థీమ్పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఐ. వాణి ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ చేపట్టారు. పాల్గొన్న వారితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
KMM: కల్లూరు మండలంలోని గంగారం గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు శనివారం తెల్లవారుజామున దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.65 వేల నగదు, కోడిపుంజులు, కత్తులు, 6 బైక్లు, 11 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: తాను ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేని షబ్బీర్ అలీ.. ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని BJP ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మండిపడ్డారు. తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. షబ్బీర్ అలీ వల్లే తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ అవినీతి బాగోతం మాచారెడ్డి ప్రజలకు తెలుసన్నారు. ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు.
BDK: కరకగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పోలే బోయిన సుజాత అభివృద్ధి పనులలో భాగంగా ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి సమస్యను శనివారం పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్యతో పాటు గ్రామంలోని ఇతర మౌలిక వస్తువుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాన్ని తెలిపారు.
VZM : గంజాయి రవాణకు పాల్పడినా, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతోపాటు, చెక్ పోస్టులను బలోపేతం చేసామని తెలిపారు. గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు సమాచారం అందించాలన్నారు.
KMR: బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రిలియన్స్ మార్ట్ వద్ద జరిగిన గొడవ, కానిస్టేబుల్పై దాడికి సంబంధించి ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం బృందాలు గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
AP: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక నిందితుడు వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి A2గా ఉన్నారు. రూ.3,500 కోట్ల స్కాంలో ఆయన కీలక నిందితుడని సిట్ నివేదికలో పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ.7.50 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంజనీర్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
KNR: సైదాపూర్ మండలం ఆకునూర్ కస్తూరిబా బాలికల విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వో రజిత మాట్లాడుతూ.. ఒక వ్యక్తి తన చిన్నతనంలో కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకునే భాషనే మాతృభాష అంటారని పేర్కొన్నారు. ఇది మనిషికి వ్యక్తిత్వంతో పాటు గుర్తింపునిస్తుందని తెలిపారు.
E.G: వైసీపీ జిల్లా సోషల్ మీడియా కార్యదర్శిగా పెదపాటి చిన్నబాబును నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలోకి చెందిన చిన్నబాబు, పార్టీ పథకాలు, కార్యాచరణను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తానేటి వనితకు కృతజ్ఞతలు తెలిపారు.