మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో 21,884 మంది విద్యార్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు సౌకర్యాల కోసం కనీస వసతులు అందించినట్లు అధికారులు తెలిపారు.
NZB: నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారి మృతికి నిరసనగా జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు DSP కార్యకర్తలు ఈ ర్యాలిలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చిన్నారి మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజలు, దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BDK: రోగులకు మెరుగైన సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని DMHO హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం DMHO డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదివారం పాల్వంచ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు, చట్టపరమైన ప్రమాణాల అమలును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
TPT: తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఆదివారం భక్తులకు 12 వేల సర్వ దర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో 2 వేల టోకెన్లు జారీ చేశారు.
KMM: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిన్న నిర్వహించిన ‘రైతుబడి అగ్రి షో’ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ స్టాళ్లను పరిశీలించిన ఆయన, సాగు రంగంలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులు, శాస్త్రవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చిన నిర్వాహకులను మంత్రి అభినందించారు.
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సందర్శకులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వినతుల్లోని అంశాలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు.
TG: మంచిర్యాల జిల్లా కోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకుల అరెస్టుకు సంబంధించి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. పిటిషన్పై ఇప్పటికే బాల్కసుమన్ అడ్వకేట్ల బృందం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే రిమాండ్లో ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వకుండా బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరినట్లు న్యాయవాదులు తెలిపారు.
AKP: అక్రమంగా తరలిస్తున్న 20 మద్యం సీసాలను కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులను చూసి కె.కాశీ విశ్వనాథం అనే వ్యక్తి పారిపోతుండగా ఎస్సై మనోజ్ కుమార్ పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద ఉన్న 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామన్నారు.
ATP: గుంతకల్లులోని మోదినాబాద్ ఏరియాలో గల రైల్వే క్వార్టర్స్లో ఆదివారం అర్ధరాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న నగదుతో పాటు నగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరిసర ప్రాంతాలతో పాటు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
HYD: నగరంలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ సోమవారం AWHO కాలనీలో 225గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
KMM: నగర సుందరీకరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సకాలంలో సిద్ధం చేయాలని ఉద్యానవన అధికారి ఆదేశించారు. ఖమ్మం నగరం గొల్లగూడెం నర్సరీలో జరుగుతున్న మొక్కల పెంపకం, నిర్వహణ పనులను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ హరితీకరణ లక్ష్యంగా చేపడుతున్న పనులను సమీక్షించి, సిబ్బందికి సాగు పద్ధతులపై పలు సూచనలు చేశారు.
BDK: సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నందనవనం కాలనీలో భారీ దొంగతనం నిన్న జరిగింది. ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ రఘునాథ్ కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 5.9 తులాల బంగారం, 40.8 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దోచుకెళ్ళినట్లు ఎస్సై రమాదేవి తెలిపారు.
VSP: విశాఖ నుంచి ఆగ్రాకు వెళ్తున్న మహిళ బ్యాగ్ రైల్వే స్టేషన్లో మిస్ అయింది. బ్యాగ్లో 200 గ్రాముల బంగారం, రూ.12,500 ఉన్నట్టు ఆమె సీపీకి ఫోన్ చేశారు. సీపీ RPF పోలీసులకు సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించి హర్యానాకు చెందిన వ్యక్తి బ్యాగును దొంగలించి ట్రైన్లో వెళ్లిపోయినట్టు గమనించిన RPF పోలీసులు అతడిని అరెస్టు చేసి బ్యాగు స్వాధీన పరుచుకున్నారు .
KRNL: రైతుకు గిట్టుబాటు ధర కల్పించే చర్యల్లో భాగంగా నేటి నుంచి మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయాధికారి రవి, మార్క్ ఫెడ్ నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. క్వింటాలు రూ. 5,875కు కొంటామని చెప్పారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.