BDK: పినపాక పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై సుమారు రూ. 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని స్వయంగా వీక్షించి, నిర్మాణ నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానిక గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతుందని తెలిపారు.
TPT: దొరవారిసత్రం నూతన ఎస్ఐగా గరికపాటి వెంకటేశ్వర చౌదరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమై శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. మండల పరిధిలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద నిర్మించిన శ్రీ సంత్ గాడ్గే బాబా మహరాజ్ మూర్తి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను సమాజ సభ్యులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుమల గౌడ్, రవి నాయక్, మాధవ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
TPT: వెంకటగిరి నియోజకవర్గ YCP సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు 41ఏ నోటీసులు అందజేశారు. గతంలో 27-12-2024న విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలపై దుర్భాషలాడారని C.C నాయుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
RR: స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులు గెలుపొందడం పట్ల సేవాలాల్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. షాద్నగర్ పట్టణంలోని సేవాలాల్ కమిటీ సభ్యులు 6వ వార్డు కౌన్సిలర్ రాజునాయక్, దేవుని బండ తండా సర్పంచ్ శ్రీను నాయక్ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి నచ్చే విధంగా పాలన అందిస్తామన్నారు.
MDK: తూప్రాన్ మండలం యావపూర్లో చేపడుతున్న స్వచ్చ భారత్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ స్వచ్ఛ భారత్ పురస్కరించుకుని సర్పంచ్ యంజాల స్వామి పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. అనంతరం వీధులను శుభ్రం చేశారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ యువత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్ల గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఆయా జిల్లాల మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వద్ద ఉన్న పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కుటుంబసభ్యులు శనివారం రాత్రి మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠాన్ని సందర్శించారు. ఆయన ధర్మపత్ని బండ్ల జ్యోతి, తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి సహా పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులను దర్శించి ఆశీస్సులు పొందారు. మార్చి 14న జరిగే వివాహ మహోత్సవానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘RRR’ మరోసారి వార్తల్లో నిలిచింది. అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ ‘రీగల్’ మార్చి 2న ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేస్తోంది. ఈ ప్రదర్శనలో ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివీల్ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు రాజమౌళి బృందం హాజరయ్యే అవకాశం ఉంది.
AP: కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. పరకామణి కేసులో మళ్లీ FIR నమోదు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నేతలను నిందితులుగా ఇరికించేందుకే ఒక డీఎస్పీకి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారని విమర్శించారు.
తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో నిర్మాణం ప్రారంభమయ్యే నూతన టీడీపీ పార్టీ పార్లమెంటు భవన భూమి పూజ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యక్రమ సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి హాజరై ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.
BHPL: చిట్యాల మండలం వెంకట్రావుపల్లి (C) గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శ్రీరామదాసు భక్తమండలి చేల్పూర్ ఆధ్వర్యంలో భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం గోటితో వడ్ల వలవడం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ తౌటం లక్ష్మి, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వయంగా గోటితో వడ్లు వలిచి తలంబ్రాలు సిద్ధం చేశారు.
NLG: ఆమనగల్లులోని శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవాలయ భూమి బహిరంగ కౌలు వేలం రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాలయ ఇన్ఛార్జ్ మేనేజర్ మృత్యుంజయ శాస్త్రి, ఛైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ.5 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. దేవాలయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నిర్వాహకులు కోరారు.
MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 4 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్ ద్వారా బద్దంపల్లి, చామనపల్లి, లక్ష్మీపూర్, మొట్లగూడ గ్రామాలకు చెందిన వారి ఫోన్లను గుర్తించారు. SI జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ భరత్ సహకారంతో వీటిని యజమానులకు అప్పగించారు.
PDPL: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో పెద్దపల్లి ఉద్యమకారుల ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రెస్క్లబ్లో సమావేశమైన నాయకులు, ప్రజాప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉండటం సంతోషకరమని తెలిపారు. ఫోరం కన్వీనర్ ఐలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.