భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అలాగే భారీ వర్షం వల్ల మిర్చి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చి చివరి దశలో ఉండటంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారు.
MNCL: నిరుపేద లబ్ధిదారులకు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ కమిటీ సమీక్లో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, అర్హులైన వారందరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
MHBD: ఫిజికల్ సైన్స్ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులో నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూలులో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సింగారం దీక్షిత్ ప్రతిభ కనబరిచి జిల్లా ప్రథమ విజేతగా నిలిచాడు. దీక్షిత్ ప్రథమ బహుమతి, ప్రశంస పత్రం ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. దీంతో ఎంఈవో రాందాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు విద్యార్థిని అభినందించారు.
KMM: కామేపల్లి మండలంలోని కామేపల్లి, పాత లింగాల, కొమ్మినేపల్లి రైతు వేదికల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఏవో తారాదేవి తెలిపారు. నిషేధిత హెచ్ టీ పత్తి సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. సాగులో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు వివరించారు.
HYD: మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. HMWSSB ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులకు నిర్ణయం తీసుకుంది. రూ. 282 కోట్లతో ఉస్మాన్సాగర్ మంచినీటి పైప్లైన్ ఆధునీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాలంచెల్లిన పైపులు, పంప్ హౌస్ల కారణంగా దాదాపు 30% నీటి సరఫరాలో నష్టం వాటిల్లుతోంది.
SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇంటి దొంగలే ఓటమికి పాల్పడ్డారని వారిపై పార్టీ పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు సింహ వాహనంపై తిరువీధుల్లో విహరించారు. స్వామివారిని, అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి మాడవీధుల్లో ఊరేగింపు సేవ కొనసాగించారు. భక్తుల జయ జయ ద్వానాలతో, కళాకారుల నృత్యాలు మేళా వాయిద్యాలతో కన్నులవిందుగా కొనసాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.
NLG:హైదరబాద్లో సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.
MDK: రామాయంపేటలోని దామరచెరువు చౌరస్తా వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు సదాశివనగర్ మండలం విసనపల్లి గ్రామస్థుడిగా పోలీసులు గుర్తించారు. స్థానికులు స్పందించి 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
NZB: తెలంగాణ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీశ్ తేజ సిల్వర్ మెడల్ సాధించాడు. HYD లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 65 కేజీల కేటగిరిలో హరీశ్ తేజ కోచ్ రాజ్ కుమార్ సహకారంతో స్నాచ్లో 96, క్లీన్ అండ్ జెర్క్111 కేజీల బరువెత్తి మొత్తం 207 కేజీల బరువుతో ద్వితీయ స్థానంలో నిలిచారు.
WGL: ఖిలా వరంగల్ ఏబీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ సత్య శారద సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సౌకర్యాలు, బోధన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
KMR: కామారెడ్డిలో నేడు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
ASF: ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన అల్లర్లు, మంత్రి కాన్వాయ్పై దాడి ఘటనలో ఇప్పటికే మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ కాగా, 13 మంది BRS నాయకులపై కేసు నమోదు చేశారు. ఆ గొడవలో ఓ మహిళా కానిస్టేబుల్ను MLA నెట్టేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు.
ADB: రేవంత్ అన్న కా సహారా-మిస్కినో కే లియే పథకం కింద ఆర్థిక సహాయం కోసం కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన నిన్న ఇంటర్వ్యూల కార్యక్రమం చేపట్టారు. ఈ పథకం కోసం మొత్తం 67 మంది దూదేకుల, ఫకీర్ కమ్యూనిటీలతో పాటు సామాజికంగా వెనుకబడిన ముస్లింలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం తుది జాబితా ఎంపిక చేస్తామని తెలియజేశారు.
ASF: త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ నిషేధమని, మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ లేకపోవడం, నంబర్ ప్లేట్ లేకపోవడం, తప్పుడు నంబర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.