NZB: డిచ్పల్లిలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సేవాలాల్ విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ చేశారు.
VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేటు స్థానిక వాహనదారులకు తీరని సమస్యగా మారింది. ప్రతిరోజూ రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో గేటు పడటంతో 15 నుంచి 20 నిమిషాలు నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ రూట్లో నిత్యం ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు వెళ్తుంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో స్థానిక వాహనదారులు సతమతమవుతున్నారు.
WGL: నర్సంపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో షీ టీమ్స్ ఎస్సై స్వాతి ఆధ్వర్యంలో శనివారం మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొనే వేధింపులు, ఫిర్యాదు చేసే విధానం, షీ టీమ్స్ సేవలను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై వివరించారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎస్సై స్వాతి తెలిపారు.
KMR: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని కారుతో అతివేగంగా దూసుకెళ్లిన నిందితుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పాత నేర చరిత్ర కలిగిన ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, విద్వేషాలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడాలన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ క్రీడలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఘనంగా ప్రారంభించారు. స్వయంగా వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన ఆయన, క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు నిరంతరం నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటేనే క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని కలెక్టర్ ఆకాంక్షించారు.
SRPT: పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా మున్సిపల్ ఛైర్పర్సన్గా ఎన్నికైన ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో వైద్యశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
వనపర్తి: నిరుపేదల సొంత ఇంటి కల నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమవుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తిలోని పలు మండలాల్లో ఆయన పర్యటించి నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారుల గృహప్రవేశాలకు హాజరై నూతన వస్త్రాల అందజేశారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కలలుగన్న కుటుంబాల ఇంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగు నింపిందన్నారు.
NZB: రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా జమునా తెహజీబ్కు ప్రతీక అని కొనియాడారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ADB: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం బేల మండలంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.
మంచిర్యాల పట్టణం హమాలివాడలోని పెద్దమ్మ టెంపుల్లో జరిగిన చోరి కేసులో నిందితుడు గుమ్మడి సారయ్యను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. SI తిరుపతి వివరాల ప్రకారం. నిందితుడు సారయ్య టెంపుల్లో హుండీ పగలగొట్టి రూ. 3,000 దొంగతనం చేయడం జరిగిందన్నారు. విచారణలో నిందితుడు నిజం ఒప్పుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామన్నారు.
JN: సలాక్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శంభు రామ దేవాలయంలో గత మూడు రోజులుగా దేవతమూర్తుల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు వేడుకలకు జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. సలాక్ పూర్ గ్రామాభివృద్ధికి సహకరిస్తానని, భగవంతుడి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలన్నారు.
NGKL: అచ్చంపేట పట్టణంలో ఈనెల 23న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు గిరిజన నేతలు తెలిపారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ వేడుకలకు ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో యాదగిరి, డీఎస్పీ పల్లె శ్రీనివాస్ హాజరవుతున్నట్లు వారు తెలిపారు.
MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో భూ, రెవెన్యూ సమస్యలపై అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి భూములకు సంబంధించిన వివాదాలు, రెవెన్యూ సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను నమోదు చేసి పరిష్కార చర్యల కోసం వివరాలను సేకరించారు.
KMM: కల్లూరు మండలంలోని గంగారం గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు శనివారం తెల్లవారుజామున దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.65 వేల నగదు, కోడిపుంజులు, కత్తులు, 6 బైక్లు, 11 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: కరకగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పోలే బోయిన సుజాత అభివృద్ధి పనులలో భాగంగా ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి సమస్యను శనివారం పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్యతో పాటు గ్రామంలోని ఇతర మౌలిక వస్తువుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాన్ని తెలిపారు.