ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో అధికారులకు క్లాడ్ (Claude) AI సాంకేతికతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పరిపాలనలో వేగం, ఖచ్చితత్వం పెంచేందుకు ఎక్సెల్, నివేదికల తయారీలో ఈ AI సాధనాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణలో AI టూల్స్ కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
కృష్ణా: చల్లపల్లి అభివృద్ధికి ఎంపీ విజయేంద్ర ప్రసాద్ సహకారం అభినందనీయం అని స్వచ్ఛ చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ అన్నారు. గ్రామంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి గురించి తెలుసుకుని చల్లపల్లి అభివృద్ధికి ఆయన తమ ఎంపీ లాడ్స్ ద్వారా రూ.50 లక్షలు కేటాయించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాదులో డా.డి.ఆర్.కె.ప్రసాదు, డాక్టర్ పద్మావతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకాశం: పెద్దారవీడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరించే స్వర్ణ రథాలను స్థానిక టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని, తడి చెత్త-పొడి చెత్త విడివిడిగా సేకరించి తమ ఇండ్ల వద్దకే వస్తున్న స్వచ్ఛ రథాలలో వేసి పరిశుభ్రతకు సహకరించాలన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత డిసెంబర్లో నిర్వహించిన 2/2 బీపీఈడీ (మూడో సెమిస్టర్) రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను, రీవాల్యుయేషన్ మరియు ఫీజు చెల్లింపు వంటి ఇతర పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడొచ్చన్నారు.
పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పుష్పలత అనే మహిళ స్థానిక శాంతినగర్ కాలనీ వీధి రోడ్డుపై చేపడుతున్న అక్రమ కట్టడాలను తొలగించాలని కలెక్టర్కు ఆర్జీ సమర్పించారు. ఇది వరకు ఫిర్యాదులు ఉన్నప్పటికీ చాటు మార్గంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మునిసిపల్ కమిషనర్కు లేఖ రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
NGKL: బొల్లారం గ్రామానికి చెందిన అమర్ సింగ్ దంపతులు ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి రూ. 25,116 విరాళం అందజేశారు. కీర్తిశేషులు నేనావత్ భావన జ్ఞాపకార్థం ఆలయ అభివృద్ధి, నిత్య అన్నదానం కోసం ఈ మొత్తాన్ని ఛైర్మన్ మాధవరెడ్డికి సోమవారం సమర్పించారు. అనంతరం దంపతులకు ఆలయ కమిటీ సన్మానం చేసి ప్రత్యేక పూజలు చేశారు.
CTR: విభిన్న ప్రతిభ వంతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ల్యాప్టాప్ పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అనంతరం జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శాంతిపురం మండలం, బెల్లకోగిల గ్రామనికి చెందిన పాలిటెక్నిక్ కళాశాల నందు మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆర్. విజయరాజ్కి ల్యాప్టాప్ అందజేశారు.
KNR: హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, రామడుగు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. నెలల తరబడి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ATP: జిల్లాను వంద శాతం అక్షరాస్యత దిశగా మార్చడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో ‘అక్షర ఆంధ్ర’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఏడాది జిల్లాలో 1.25లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. అక్షర కేంద్రాలను అధికారులు సందర్శించి హాజరు శాతాన్ని పెంచాలని ఆదేశించారు.
తూ.గో: రాజమండ్రిలో ప్రజలను కలవరపెడుతున్న అనూరియాపై మంత్రి దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితిపై సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.
కడప: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ ఈ నెల 28న డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.
GDWL: అయిజ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్కు వినతిపత్రం అందజేశారు. ఫైర్ స్టేషన్ ఏర్పాటుతో సమీప మండలాలకు అత్యవసర సమయాల్లో సహాయం అందుతుందని పేర్కొన్నారు. వినతిపత్రం సమర్పణలో నాగర్ దొడ్డి వెంకట రాములు, కురువపల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
W.G: భీమవరంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారు, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మాస్ కాపీయింగ్ జరుగుతుందా అనే కోణాల్లో పట్టణంలోని కళాశాలలో తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, సౌకర్యాల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలించారు.
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది ప్రజలు కేంద్ర మంత్రికి తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు. వాటిని పరిశీలించి, అవసరమైన వాటిని సత్వరమే పరిష్కరించారు.
KRNL: కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యాన్ని పక్కదారి పట్టించిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని AISF నాయకులు ఇవాళ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.