గుంటూరు జీజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద గురువారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందారు. అస్వస్థతతో పడి ఉన్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
ప్రముఖ ప్లాట్ఫామ్ బ్లైండ్ 2026 సంవత్సరానికి భారత్లో పనిచేసేందుకు ఉత్తమమైన టాప్ 10 కంపెనీల జాబితాను ప్రకటించింది. ఇందులో ఎన్విడియా (NVIDIA) అగ్రస్థానంలో నిలిచింది. గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సుమారు 40,686 మంది ఉద్యోగుల సమీక్షల ఆధారంగా ఈ ర్యాంకింగ్ను రూపొందించారు. ఈ కంపెనీలు మెరుగైన పని వాతావరణాన్ని అందిస్తున్నాయి.
TPT: ఎర్రవారిపాలెంలోని IIT తిరుపతిలో శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) ‘డెకాయిట్’ కార్యక్రమం జరగనుంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా డెకాయిట్ సినిమా హీరో అజిత్ కుమార్ రేసింగ్ టీం సభ్యులు పాల్గొననున్నారు. అలాగే విద్యార్థులతో వారు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు(మం) జంగిటి వారిపల్లికు చెందిన కొండేటి విజయలక్ష్మికు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.30,795 విలువైన చెక్కును టీడీపీ పార్టీ ఇంఛార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి వారి నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవడం బాధ్యత అని తెలిపారు.
NRPT: మంత్రి డా.వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కన్మనూర్ గ్రామంలో పలువురి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇల్లు లేని వారికి కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉన్నారని నాయకులు తెలిపారు. అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా మంజూరు చేస్తామని తెలిపారు.
NLR: రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని అర్హులైన నిరుపేదలకు త్వరితగతిని ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో హౌసింగ్, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా గిరిజనులకు మంజూరైన 1,000 పక్కా గృహాలకు భూసేకరణ చేయాలని ఆదేశించారు.
VZM: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించారు. ఈ జరిమానాలను అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ MSHR తేజ చక్రవర్తి విధించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
సత్యసాయి: సోమందేపల్లిలోని వినాయక నగర్కు చెందిన చేనేత కార్మికుడు ఖలీల్ మద్యం మత్తులో గురువారం మృతి చెందారు. ఖలీల్ అధికంగా మద్యం సేవించి బ్రాందీ షాపు వద్ద అపస్మారక స్థితిలో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం పూర్తిగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
HYD: జీహెచ్ఎంసీ పరిధి మూడు భాగాలుగా విభజించబడిన తర్వాత పరిపాలన వేగం పెరిగింది. మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుస పర్యటనలు చేపడుతున్నారు. నగరంలోని సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో భూ తగాదా విషయంలో గురువారం బసీనేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు నూర్ భాషాపై వైసీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో నూర్ భాషాకు గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 3, 12 వార్డులలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఇల్లు లేని నిరుపేదలకు మంజూరు చేయిస్తామని తెలిపారు.
VSP: ప్రముఖ పర్యాటక కేంద్రం రుషికొండ బీచ్లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగిన ఓ పర్యాటకుడు అలల ఉద్ధృతికి లోనై నీటిలో మునిగి మృతి చెందారు. మృతుడు ఏ ప్రాంతానికి చెందినవారో సహా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
CTR: వికలాంగులకు, వృద్ధులకు నిత్యవసర వస్తువులను ఇంటి వద్దే అందించాలని పెద్దపంజాణి తహసీల్దార్ రామ్మూర్తి డీలర్లును ఆదేశించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించి ప్రతినెల 1వ తేదీ నుంచి రేషన్ షాప్కి వచ్చిన వస్తువులను పంపిణీ చేయాలని అన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెంట్రల్ కమిటీ ఛైర్మన్ మానవత(ఆలపాటి) నాగేశ్వరరావు సంస్మరణ సభ గురువారం ఏలూరులోని లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఉండి మానవత సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, ట్రెజరర్ కేటీన్ సత్యనారాయణ, మండల ఛైర్మెన్ రుద్రరాజు యువరాజు, కో ఛైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావులు పాల్గొని పుష్పంజలి ఘటించారు.
WGL: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. 15, 16, 17వ డివిజన్లకు చెందిన 50 మంది మైనార్టీ మహిళలకు ఎమ్మెల్యే కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని ఎమ్మెల్యే అన్నారు.