VSP: విశాఖ పరిసరాల్లో పోర్టుల కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోంది. గంగవరం పోర్టులో ఇనుప ఖనిజ మిశ్రమ కేంద్రం ఏర్పాటుతో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది. విశాఖ, గంగవరం, నక్కపల్లి పోర్టుల నుంచి బొగ్గు, ఇనుప ఖనిజ రవాణాతో గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు గిరి ప్రదక్షిణ, సాయంత్రం 4 గంటలకు పూలంగి సేవ, రాత్రి 7 గంటలకు అంకురార్పణం జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.
AKP: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోటవురట్ల మండలం పాములవాక జడ్పీ హైస్కూల్ హెచ్ఎం లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రవి పంటలకు సంబంధించి ఈ పంట నమోదు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగుస్తుందని వ్యవసాయ శాఖ జేడి త్రినాధ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పంట నమోదు తప్పనిసరిగా రైతులు చేసుకోవాలని, ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు పొందాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సత్యసాయి: పెనుకొండ పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. మరుపల్లి గ్రామ శివారులోని చెరువు సమీపంలో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై రవికుమార్ సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ బహిరంగంగా పేకాట ఆడుతున్న ఆరుగురు జూదగాళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16,120 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
ATP: బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామ సచివాలయ ఉద్యోగి కార్తీక్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఏకాంబరేశ్వరయ్య బుధవారం మీడియాకు తెలిపారు. ఇటీవల పింఛన్ నగదు రూ.96 వేలను సకాలంలో ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు.
E.G: కోరుకొండ మండలం కణుపూరులో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో మంజూరైన CMRF చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదగా బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి చెందిన కంచు మూర్తి నూకాలమ్మకి రూ 27,100, కొత్తపల్లి రత్న కుమారికి రూ.77,084 విలువగల CMRF చెక్కులను అందజేశామన్నారు.
కడప నగరంలోని బిల్టప్ కూడలి వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రామరాజుపల్లెకు చెందిన నాగూరు దస్తగిరమ్మ(55) అనే మహిళ మృతి చెందారు. పోలేరమ్మ గుడి వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దస్తగిరమ్మను 108 అంబులెన్స్లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా ముమ్మరం చేశారు. సెక్షన్ 144 అమలులో ఉండగా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
W.G: ఉండి మండలం మహాదేవపట్నం హైస్కూల్లో వీరవల్లి మహేష్ ఇంటర్వెల్లో మరో విద్యార్థి కాలు తగిలి పడిపోగా మహేష్కి చెయ్యి విరిగిందని పాఠశాల HM జాన్ బాబు బుధవారం తెలిపారు. అతనికి వైద్య ఖర్చులు రూ. 20 వేల అయ్యిందని మహేష్ తండ్రి పెద్దిరాజు తెలిపారు. ఈ విషయం వసుధ ఫౌండేషన్ దృష్టికి తీసికెళ్లగా వారు రూ .10 వేలు, పాఠశాల సిబ్బంది రూ. 10 వేలను పెద్దిరాజుకు అందించారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన ఆర్డీవోగా ప్రభాకర్ నియమితులయ్యారు. ఈయన గుంటూరు జిల్లా నుంచి బదిలీపై రానున్నారు. ఇప్పటివరకు మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్గా పని చేసిన వెంకట శివరాంరెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా వెళ్లనున్నారు. అధికారుల ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఆర్డీవో బాధ్యతలు స్వీకరించనున్నారు.
VSP: సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో బుధవారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.
ATP: జిల్లాలోని 15 ఏపీ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి మార్చి 31 వరకు apms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.125 ఫీజు చెల్లించాలని అధికారులు కోరారు.
PPM: అకాల వర్షం కారణంగా సాలూరు మండలం కొత్తవలస, మరిపల్లి, కందులపదం, కురుకుట్టి, మమడిపల్లి, తదితర రైతు సేవాకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో మొక్కజొన్న పంట నష్టానికి గురి అయిందని మండల వ్యవసాయ అధికారి శిరీష తెలిపారు. పై గ్రామాల్లో సుమారు 45 మంది రైతులకు సంబంధించి 60 ఎకరాల పంట అకాల వర్షానికి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు.
VZM: మెరకముడిదాం మండలం గర్భాంలో పంచాయతీ EO విశ్వనాథం పర్యవేక్షణలో బుధవారం పారిశుద్ధ్య కార్మికులు గ్రామంలో రోజువారి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చెత్త కుప్పలను ఎత్తివేసి టాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డ్కి తరలించారు. రోడ్లపై చెత్త వెయ్యరాదని పంచాయతీ వాహనాలు వచ్చినప్పుడు చెత్తని అందించాలని EO సూచించారు.