CTR: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ గాంజా, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. పదేపదే నేరాలకు పాల్పడిన 16 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన రూ.5.32 కోట్ల విలువైన 1064 కిలోల గంజాయిని చట్టపరంగా దగ్దం చేశారు. ఈ ప్రక్రియను అనంతపురం రేంజ్ ఐజీ డా.షిముషి బాజ్పాయి పర్యవేక్షించారు.
TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం బుచ్చి నాయుడు కండ్రిగ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా మండలంలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
E.G: దేవరపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిలో కోడిగుడ్లు లోడుతో రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చున్నారు. కాగా డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల సమస్యలు వెల్లువెత్తాయి. టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మహిళా గ్రీవెన్స్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మహిళల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఉపాధి, ఆరోగ్యం, భద్రత, మంచినీరు, చోరీలు, చిట్టీల మోసాలు వంటి సమస్యలతో మహిళలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.
PLD: పెదకూరపాడు మండలం 75 తాళ్లూరులో యానిమేటర్లకు ప్రభుత్వం అందించిన సెల్ఫోన్లను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 187 మంది యానిమేటర్లకు ఫోన్లు అందించారు. డ్వాక్రా రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు, మండల నాయకులు ఉన్నారు.
ELR: ప్రజల ఆరోగ్యం & గ్రామాల పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు సూచించారు. మంగళవారం పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో ఎమ్మెల్యే ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని డ్రైన్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి, మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడం చూసి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్నమయ్య: చెన్నముక్కపల్లి గ్రామంలోని దేడ్ లాక్ మసీదు సమీప ఉర్దూ స్కూల్ వద్ద రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను TDP రూరల్ అధ్యక్షుడు గండికోట సుధాకర్ ప్రారంభించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు భూమి పూజ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు.
KDP: ప్రొద్దుటూరులోని పుట్టపర్తి నారాయణాచార్యులు గ్రంథాలయంలో సమ్మర్ క్యాంపును MEOలు సావిత్రమ్మ, శోభారాణి ప్రారంభించారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని వారు తెలిపారు. సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
W.G. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం-రాహత్’ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో పథకానికి సంబంధించిన గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ప్రమాద బాధితులు సమీప ఆసుపత్రుల్లో రూ.1.50 లక్షల వరకు ఉచితంగా అత్యవసర వైద్యం పొందవచ్చన్నారు.
GNTR: చిత్తూరు జిల్లా వీ. కోటలో ఓ విలేకరు జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెనాలిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు సంయుక్తంగా నిరసన ప్రదర్శించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ MRO వినతిపత్రం అందజేశారు.
NLR: నెల్లూరు జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని DMHO వి. సుజాత ఆదేశించారు. డాక్టర్ల రెఫరల్ స్లిప్ లేకుండా స్కానింగ్ చేయరాదని స్పష్టం చేశారు. అలాగే RMPలు స్కానింగ్కు రెఫర్ చేయడం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ATP: తాడిపత్రిలో నూతనంగా ఏర్పాటవుతున్న సబ్ కోర్టు, రెండు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు పనులు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నేతృత్వంలో వేగంగా జరుగుతున్నాయి. కోర్టుకు అనువుగా లేని భవనాన్ని తన సొంత నిధులతో ఆధునీకరిస్తూ ఆయన సహకారం అందిస్తున్నారు. కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు తాడిపత్రి న్యాయవాదులు, కక్షిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, వాగు పోరంబోకు స్థలాలు, స్మశాన భూములు అక్రమంగా ఆక్రమించి వెంచర్లు వేసి విక్రయిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్డీవో ప్రభాకర్రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ATP: గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు మంగళవారం ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో 108 మంది దంపతులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి మూలమంత్రంతో పుష్పాలను సమర్పిస్తూ విశేష అర్చనలు చేశారు. విశేష పుష్పార్చన వల్ల ఇంట్లో సుఖశాంతులు, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం.
W.G: జిల్లాలో డీజిల్ కొరత లేదని, రైతులు అవసరానికి మించి కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని కలెక్టర్ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరంలోని పలు పెట్రోల్ బంకులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, నిల్వలను పరిశీలించారు. ఆక్వా, వ్యవసాయ రైతులు అపోహలతో ఇంధనాన్ని నిల్వ చేయవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.