NDL: జుపాడుబంగ్లా మండలంలోని పోతులపాడు గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి చెందిన మేక ఒకే ఈతలో 4 పిల్లలకు జన్మ నిచ్చింది. గతేడాది కూడా ఇదే మేక మూడుపిల్లలకు జన్మనిచ్చింది. గత ఐదురోజుల కిందట నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన తెలి పారు. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన మేకను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురైతున్నారు.
GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరులోని పెట్రోల్ బంకులను కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన సరఫరా సమృద్ధిగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో గత రాత్రి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మినీ బస్టాండ్ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బస్సు షెల్టర్ ప్రారంభించిన అనంతరం సామాన్యుడిలా టికెట్ తీసుకుని ధర్మాజీగూడెం నుంచి ఏలూరు రోడ్ వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తూ.. ప్రయాణికులను ఆత్మీయంగా పలకరించారు.
కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటలకు అంబాజీపేట మండలం చిరుతపూడి సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు పి.గన్నవరం మండలం మానేపల్లి వద్ద 1.48 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు అని తెలిపారు.
కడప జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 197 మందిపై కేసులను నమోదు చేయడం జరిగిందని, రూ. 50,175 జరిమానా విధించామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
NDL: కోవెలకుంట్లలో వెలసిన పురాతన ప్రసిద్ధ శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ చిన్న వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. 27న పేట తిరునాళ్ల, 28న కోనేటి తిరునాళ్ళ, 29న రథోత్సవం, కళ్యాణం నిర్వహిస్తామని వెల్లడించారు.
తూ.గో: రాజమండ్రి 45వ డివిజన్ R&B వాంబే గృహాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన LTP అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అభివృద్ధికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
KRNL: అనంతపురం హనీ ట్రాప్ కేసులో కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ కొరడా ఝళిపించారు. ఈ కేసులో నలుగురు పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. రాప్తాడు రూరల్ సీఐ శేఖర్ను కర్నూలు VRకు అటాచ్ చేయగా, సీఐ శ్రీహర్షతో పాటుగా HC గిరి, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉద్యోగం నుంచి తొలగించారు. రూరల్ SI రాంబాబు, PCలు దేవేంద్ర, జయ నాయక్ను డీఐజీ సస్పెండ్ చేశారు.
కోనసీమ, కృష్ణ జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం రెండు జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. బంకుల్లో నిల్వలు, డిమాండ్ పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించిన మంత్రి, సరఫరాలో అంతరాయం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని బంకుల వద్ద క్రమబద్ధంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు
KKD: అన్నవరం సత్యదేవుడి వార్షిక ఉత్సవాలలో భాగంగా దివ్యకళ్యాణం ఇవాళ రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారుని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. సుమారు 40 అడుగుల వెడల్పుతో వివిధ పుష్పమాలికలు, విద్యుద్దీపాల ఆలంకరణలతో కళ్యాణ వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దారు. సుమారు 25 వేల మంది భక్తులు విచ్చేస్తారని తెలిపారు.
ATP: తాడిపత్రిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ఏటిగడ్డపాలెం బ్రహ్మంగారి గుడి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అబ్దుల్లా అనే వ్యక్తిని హతమార్చారు. నిందితులు కత్తితో మెడపై పొడిచి, బండరాయితో తలపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు బంకమట్టి వీధికి చెందిన పెయింటర్ బాషా కుమారుడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: జిల్లాలో ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం అరసవిల్లి వద్ద ఎస్పీ పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని, అదనపు సిబ్బందిని మోహరించాలని సూచించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంధన ఉత్పత్తుల కొరత లేదని విశాఖ JC విద్యాధరి వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 138 బంకులు ఉండగా పెట్రోల్ 3.478, డీజల్ 2,801 కిలో లీటర్లు ఉందని తెలిపారు. ఇక HPCL కంపెనీలో పెట్రోల్, డీజిల్ 1515 కిలోలీటర్లు ఉందన్నారు. IOC కంపెనీలో 3903 కిలోలీటర్ల వున్నాయన్నారు.
VZM: దాడితల్లి గ్రామదేవత సిరిమానోత్సవం విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని బొబ్బిలి CI కె.నారాయణరావు కోరారు. స్దానిక రావువారివీధిలో ఆదివారం సాయంత్రం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దాడితల్లి గ్రామదేవత పండుగలో అల్లర్లు, గొడవలు చేయకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని సూచించారు.
PPM: గరుగుబిల్లి మండలంలోని సుంకి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది ఇవాళ ఉదయం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.