CTR: చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కాలేజీ సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో దుప్పి మృతి చెందింది. అటుగా వెళ్తున్న స్థానికులు దుప్పి మృత దేహాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుక్కల దాడిలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.
PPM: ఆశ్రమ పాఠశాలల్లో విద్య ప్రమాణాలను మెరుగుపరచాలని, విధి నిర్వహణలో ఏమాత్రం ఆలసత్వం వహించనా సహించేది లేదని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. గురువారం కురుపాం మండలం పాడి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థుల విద్య ప్రమాణాలను ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
KDP: ఐపీఎల్ టోర్నీ నేపథ్యంలో బద్వేలులోని లాడ్జీలు, డార్మిటరీల్లో పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. SI కొండారెడ్డి సిబ్బందితో కలిసి బస చేసిన వారి వివరాలను, రికార్డులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేయడంతో పాటు, అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.
NDL: పాణ్యం మండలం నెరవాడలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఆకస్మికంగా గురువారం పర్యటించారు. గ్రామ సచివాలయం, చౌక ధరల దుకాణాన్ని పరిశీలించి సేవల అమలు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణపై సమీక్షించారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని JC సూచించారు. రేషన్ పంపిణీ పారదర్శకంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
NDL: డోన్ జంగాల కాలనీకి చెందిన ఈభూది లక్ష్మికి చెందిన ఆస్తిని మరిదికి రాసివ్వాలని ఒత్తిడి చేస్తున్నారని మహిళా సంఘం నాయకురాలు పట్నం రాజేశ్వరి మండిపడ్డారు. మరిది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. భార్యా భర్తల మధ్య ఆస్తి విషయంలో మరిది లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఎటువంటి హక్కు లేదన్నారు. సమస్యను చట్టపరంగా పరిష్కరించాలన్నారు.
NLR: కలువాయి మండలం పెరంకొండకు చెందిన బి. వివేక్ (38) గురువారం సాయంత్రం తన బర్రెలు ఇంటికి రాకపోవడంతో ఎస్.వెంకటేశ్వర్లు 60తో కలిసి ముక్కు తిప్పు ప్రాంతంలో వెతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో కండలేరు జలాశయం దాటడంలో వివేక్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్సై కోటయ్య ఆధ్వర్యంలో ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
KDP: ప్రొద్దుటూరు నెహ్రూరోడ్డులోని TDP కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ATP: పాత గుంతకల్లులో ఈ నెల 9న మజ్జిగ కృష్ణ అనే వ్యక్తిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడు లింగయ్య ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. పాత కక్షలు కారణంగా ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. సీఐ బి.మనోహర్ మాట్లాడుతూ..నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు
అన్నమయ్య: గుర్రంకొండ మండలం తరిగొండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 16,20,510లుగా నమోదైంది. టీటీడీ అధికారులు గురువారం హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ మొత్తం వచ్చినట్లు సూపరింటెండెంట్ మునిబాలకుమార్ తెలిపారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో పెరిగిపోయిన మొక్కలను పోలీస్ సిబ్బంది తొలగించారు. ఎస్సై చంటిబాబు మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించవచ్చని అన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
NDL: రాయలసీమకు ఇచ్చిన హక్కులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి గురువారం విమర్శించారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన హక్కులు 12 ఏళ్లుగా అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
PPM: కొమరాడ మండలం వన్నం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం తెలిపింది. ఈ మేరకు రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
KRNL: నందవరం మండలం హాలహర్వికి చెందిన విద్యార్థులు అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ప్రేమ్ కుమార్ను గ్రామస్థులు అభినందించారు. విద్యాభ్యాసంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.
SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను ఆమదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత పార్టీ స్థితిగతులపై చర్చించారు. అలాగే, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ సూచించారు.
సత్యసాయి: సత్యసాయి నీటి సరఫరా బోర్డును జిల్లా పరిషత్లో విలీనం చేయవద్దని అహుడా చైర్మన్ టీసీ వరుణ్కు కార్మిక సంఘం నాయకులు విన్నవించారు. అనంతపురంలో ఆయనను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్మికులకు అండగా ఉంటామని, మెరుగైన వ్యవస్థ కోసం కృషి చేస్తామని వరుణ్ హామీ ఇచ్చారు.