ASR: రాష్ట్ర స్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలని డుంబ్రిగూడ యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. డుంబ్రిగుడలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 12న రంపచోడవరంలో 6వ రాష్ట్రస్థాయి గిరిజన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, కనీస వసతుల లేమి, అదనపు బాధ్యతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
అన్నమయ్య: మదనపల్లె నుంచి తిరువన్నామలైకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్రైన్ నం.17165 తెల్లవారుజామున 01:05 గంటలకు బయలుదేరి ఉదయం 07:28 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. భక్తులకు అనుకూలంగా ఈ సేవలను ప్రారంభించగా, తక్కువ ధరలతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
PLD: ప్రత్తిపాడు ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ భరోసా ఇచ్చారు. గుంటూరు ఆర్టీవో ఆఫీసు సమీపంలోని తన నివాసంలో బుధవారం ఆయన ప్రజలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై కిరణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. సమస్యలు పరిష్కరిస్తానన్నారు.
PLD: చిలకలూరిపేట కృష్ణ మహల్ రోడ్డులో అపార్ట్మెంట్ నిర్మాణం స్థానికులకు శాపంగా మారింది. బిల్డర్లు కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాల శబ్దాలు, భూ ప్రకంపనలతో ఇళ్లు బీటలు వారుతున్నాయి. రక్షణ వలయాలు లేకపోవడంతో రాళ్లు పడి పక్క ఇళ్ల అద్దాలు పగులుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి ఆ నిర్మాణ పనులను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.
SKLM: విజయవాడలో ప్రసిద్ధి గాంచిన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యేని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
KRNL: ఆలూరు(మం) ముద్దునగేరిలో బూడిద గుమ్మడికాయ రైతులు ధరలు లేక ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి రూ. లక్ష వరకూ పెట్టుబడి పెడితే కనీసం పెట్టుబడి రావడం లేదన్నారు. మార్కెట్లో కిలో రూ.2 ధర మాత్రమే పలుకుతోందన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని వారు కోరారు.
W.G: నరసాపురం(మం) మాధవాయిపాలెం సమీపంలోని గోదావరి నదిలో సుమారు 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. తుమ్మచెట్టు ప్రాంతంలో మృతదేహం నదిలో నీటిపై తేలుతుండటాన్ని గమనించిన వీఆర్వో కొప్పినీడి వెంకట సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
AKP: మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో విద్యుత్ సమస్యలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం సూర్యఘర్ పథకం, ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్స్ సబ్సిడీ గురించి అధికారులు వివరించారు. ఇందులో నర్సీపట్నం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.రామకృష్ణ, డిప్యూటీ ఇంజనీర్ కేవి.త్రినాథ్, ఏఈ బాలకృష్ణ, మాజీ సర్పంచ్ అల్లు రామునాయుడు పాల్గొన్నారు.
GNTR: యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పిలుపునిచ్చారు. నాగార్జున యూనివర్శిటీలోని డాక్టర్ హెచ్.హెచ్.డైక్ మన్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవకాశాలపై ఒకరోజు అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
NDL: వెంకటేశ్వర విద్యా మందిర్ స్కూల్లో విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తు వీడాలని AIYF నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు, అధ్యక్షుడు ఎర్రిస్వామి అన్నారు. అఘాయిత్యాలపై విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నంద్యాలలో ధర్నా చేశారు.
KRNL: పెద్దకడబూరు మండల రెగ్యులర్ తహసీల్దార్గా పీ.వలిబాషాను నియమిస్తూ కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మిగనూరులో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమోషన్ నేపథ్యంలో ఆయనను పెద్దకడబూరు మండలానికి నియమించారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ELR: దెందులూరు నియోజకవర్గ పరిధిలోని వట్లూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఓ భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతో కాలంగా ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ వృక్షం విరిగిపడిపోవడంతో స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న ఈ చెట్టుని తొలగించాలని కోరారు.
SKLM: మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శ్రీకాకుళంలోని ABN కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బుధవారం కాశీబుగ్గ పోలీసులు ఆయనను ఇంటి వద్దే ఆపి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
W.G: వీరవాసరం (మం) తోలేరు గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద బుధవారం గ్రామ సభ, పునఃసర్వేలో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతన్నలకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పులను సరిదిద్ది భూ వివాదాలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ కర్తవ్యమని చెప్పుకొచ్చారు.
ATP: మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురంలోని ఏబీఎన్ కార్యాలయం వద్ద వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఆందోళన చేపట్టారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై నీచమైన రాతలు రాశారంటూ మండిపడ్డారు. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.