NLR: నెల్లూరు జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని DMHO వి. సుజాత ఆదేశించారు. డాక్టర్ల రెఫరల్ స్లిప్ లేకుండా స్కానింగ్ చేయరాదని స్పష్టం చేశారు. అలాగే RMPలు స్కానింగ్కు రెఫర్ చేయడం నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రకాశం: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, వాగు పోరంబోకు స్థలాలు, స్మశాన భూములు అక్రమంగా ఆక్రమించి వెంచర్లు వేసి విక్రయిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్డీవో ప్రభాకర్రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ATP: గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు మంగళవారం ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో 108 మంది దంపతులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి మూలమంత్రంతో పుష్పాలను సమర్పిస్తూ విశేష అర్చనలు చేశారు. విశేష పుష్పార్చన వల్ల ఇంట్లో సుఖశాంతులు, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం.
W.G: జిల్లాలో డీజిల్ కొరత లేదని, రైతులు అవసరానికి మించి కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని కలెక్టర్ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరంలోని పలు పెట్రోల్ బంకులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, నిల్వలను పరిశీలించారు. ఆక్వా, వ్యవసాయ రైతులు అపోహలతో ఇంధనాన్ని నిల్వ చేయవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
KRNL: ఆదోని మండలంలో కొత్తగా ఏర్పడిన సుల్తానాపురం, చాగి గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరయినప్పటికీ పనులు ప్రారంభం కాలేకపోతున్నాయి. సుల్తానాపురానికి రూ.32 లక్షలు, చాగి గ్రామానికి రూ.32లక్షలు మంజూరు చేసినట్లు AE యమునప్ప ఇవాళ తెలిపారు. అయితే గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి తగిన స్థలాలు అందుబాటులో లేకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు.
KDP: సీఎం చంద్రబాబు నాయుడు అసమర్థుడని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పెట్రోల్, డీజిల్ కొరత ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని 4,500 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయన్నారు.
ELR: రసాయనిక పరిశ్రమలలో విపత్తు సమయంలో నష్ట నివారణకు సంబంధిత శాఖల అధికారులు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈనెల 30వ తేదీన చింతలపూడిలో IOCL పైప్ లైన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి టేబుల్ టాప్ ఎక్సరసైజ్ నిర్వహించారు.
KKD: యు. కొత్తపల్లి మండలం నాగులపల్లి రక్షిత మంచినీటి చెరువులో మూడు రోజులుగా చేపల మృతి స్థానికంగా కలవరపెడుతోంది. దీంతో చెరువు నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ పరిస్థితి కారణంగా, సమీపంలోని 18 గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి నాణ్యతపై ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో ఈ సమస్య తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
VSP: తిరుమల శ్రీవారిని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబంపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా శ్రీవారి కటాక్షం ఉండాలని కోరారు.
VZM: జిల్లాలో ఇంధన కొరతపై కూటమి ప్రభుత్వం అధికారులతో తప్పుడు ప్రకటనులు ఇప్పిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమావ్వాలని, ఇంధన కొరతపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
PPM: రుణాల మంజూరులో సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కారించి, రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు మంజూరు కావలసిన బ్యాంకు రుణాలు పెండింగ్ లో ఉండడంపై ప్రత్యేక గ్రీవెన్స్ డే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
AKP: రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ధరల విషయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అనకాపల్లిలో వ్యవసాయ అధికారులు, ఏడీఎలు, హోల్సేల్ డీలర్స్తో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీకి ఏపీ ఎయిమ్స్ యాప్ అమలులోకి తీసుకొచ్చిందన్నారు.
PLD: నరసరావుపేటలో పల్నాడు జిల్లాను ‘బాల స్నేహపూర్వక జిల్లా’గా తీర్చిదిద్దుతామని ఏపీ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు కే.జీ. వెంకట పద్మలత తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన, పిల్లల సంరక్షణపై శాఖల సమన్వయం అవసరమన్నారు. అంగన్వాడీలు, ఆసుపత్రులను పరిశీలించి లోపాల నివారణకు చర్యలు సూచించారు.
నంద్యాల జిల్లాలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మెసేజ్ల ద్వారా హెచ్చరికలు పంపింది. మరోవైపు మహానంది మండలంలో ఈదురుగాలులు మొదలవ్వడంతో అరటి రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి వేగానికి పంట దెబ్బతినే అవకాశం ఉందని భయపడుతున్నారు.
GNTR: రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెనాలి ఏడీఏ రాగల విజయబాబు రైతులకు జాగ్రత్తలు సూచించారు. పీఎంపీఎస్ ద్వారా 30 రకాల విత్తన కిట్లు అందిస్తున్నామని, రూ.1500 విలువైన కిట్లు రూ.1000కే ఇస్తున్నట్టు తెలిపారు. మేలో పచ్చిరొట్టె ఎరువులు సబ్సిడీపై పంపిణీ చేస్తామన్నారు.