ASR: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో, ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రభుత్వం సరికొత్త అత్యవసర చికిత్స పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ నిషాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం పీఎం రహత్ పథకం-రోడ్డు ప్రమాద బాధితులకు అభయ హస్తం గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 112కు కాల్ చేయవచ్చన్నారు
సత్యసాయి: ధర్మవరంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి సత్యకుమార్ బుధవారం ఆవిష్కరించారు. సామాజిక న్యాయం, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన గొప్ప మహిళా నాయకురాలు చాకలి ఐలమ్మ అని మంత్రి కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. మహనీయుల సేవలను స్మరించుకోవడం ద్వారా సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం పెంపొందుతుందన్నారు.
ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కృషి ఫలితంగా తిరుమల ఎక్స్ప్రెస్ సేవలు గుంతకల్లు వరకు విస్తరించాయి. కడప నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలు ఇకపై గుంతకల్లు నుంచి ప్రారంభం కానుంది. మే 12న ఎంపీ అంబికా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఉత్తరాంధ్రకు ప్రయాణించే జిల్లా ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.
కృష్ణా: అవనిగడ్డ మండలం వేకనూరులో పునర్ నిర్మించిన మాదివాడ వారి కోదండ రామాలయ ప్రతిష్ట బుధవారం జరిగింది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిచే ప్రతిష్ట గావించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే దంపతులు మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి పాల్గొన్నారు. మహా కుంభ ప్రోక్షణ, మహామృత దివ్య కార్యక్రమాలు, భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై నేరాల నివారణ, చట్టపరమైన రక్షణలు, హెల్ప్లైన్ సేవలపై వివరించారు. భయపడకుండా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
CTR: కార్వేటినగరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సీఐ హనుమంతప్ప బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన మజ్జిగను పంపిణీ చేశారు. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BPT: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అర్హులకే అందాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జేసీ భావన వశిష్టతో కలిసి వివిధ శాఖలతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిధుల మళ్లింపు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, పనుల నాణ్యతపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ సూచించారు.
GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై స్పందించే తీరు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై మార్గనిర్దేశం చేశారు.
ATP: జిల్లాలో పరిశ్రమల స్థాపన, నిర్వహణ అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం సరళీకరించిందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆన్లైన్ సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తామన్నారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు సమయంలోనే ఫీజులు చెల్లించి, పూర్తి పత్రాలు సమర్పించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
CTR: చిత్తూరు AIMSRలో ‘ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ డెలివరీ’పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీన్ డా. అల్ఫ్రెడ్ జె. అగస్టీన్ మాట్లాడుతూ.. బోధన అనేది విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను పెంపొందించేలా ఉండాలని సూచించారు. ఆధునిక బోధన పద్ధతుల ద్వారానే విద్యార్థుల అభ్యాస సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
NLR: బుచ్చి పట్టణంలోని లైలా హాల్ ఎదురుగా మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్న జామాయిల్ అగ్నికి ఆహుతి అయింది. ఎవరో ఆకతాయిలో ఈ పని చేస్తుంటారని యాజమాన్యం అన్వేష్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు పది లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.
KDP: రాజంపేట సమీపంలోని మోడల్ స్కూల్ నుంచి పుల్లంపేట వరకు గాలి బీభత్సం కారణంగా భారీ వృక్షాలు, షెడ్లు నేలకొరిగాయి. రహదారులపై అడ్డంకులు ఏర్పడి వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై అధికారులు వెంటనే స్పందించి రోడ్లను క్లియర్ చేసి, ట్రాఫిక్ను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
VZM: రాష్ట్ర బాలల సంరక్షణ కమిషన్ సభ్యురాలు పి. నాగమానస బుధవారం స్థానిక ప్రత్యేక దత్తత సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలో ఉన్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం, బరువు, ఎదుగుదల రికార్డులను ఆమె నిశితంగా పరిశీలించారు. పిల్లలు పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించిన ఆమె, వారికి తక్షణమే బలవర్థకమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
విశాఖ ఎక్స్ప్రెస్లో మహిళపై జరిగిన అమానుష ఘటనపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శైలజ రాయపాటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి పరామర్శించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని, బాధితురాలికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని ఆమె పేర్కొన్నారు.
అన్నమయ్య: 10వ తరగతి ఫలితాల నేపథ్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విద్యార్థులకు సూచనలు చేశారు. ఫెయిల్ అయిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, సప్లిమెంటరీ ద్వారా మరో అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం చెప్పాలని, ఎవరి మనసును నొప్పించేలా మాట్లాడవద్దని సూచించారు. జీవితంలో అపజయం సహజమని, దాన్ని విజయానికి పునాదిగా తీసుకోవాలని అన్నారు.