KRNL: విభిన్న ప్రతిభావంతులు బ్యాక్ లాగ్ ఉద్యోగాల ప్రకటనను సవరించినట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రూయిస్ ఫాతిమా ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 18న జారీ చేసిన ప్రకటన ప్రకారం బధిరుల కేటగిరిలో 55 శాతం పైగా వికలత్వం ఉన్నవారే అర్హులని పేర్కొన్నారు. తాజాగా రెండు చెవుల్లో 60- 70 DB శబ్దలోపం ఉన్నవారే అర్హులని ఆమె స్పష్టం చేశారు.
VSP: రాష్ట్ర మంత్రి లోకేష్ విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్తో మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో సంస్థ ఇన్నోవేషన్, ఆర్&డీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కడప నగరంలోని కోటిరెడ్డి SKR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్నమయ్య: తాళ్లపాక అన్న మాచార్యుల జయంతి ఉత్సవాలను మే 2 నుంచి 8వ తేదీ వరకు తితిదే ఆధ్వర్యంలో తాళ్లపాక, బోయనపల్లి అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీ మంగళవారం తెలిపారు. మే 2న అన్నమాచార్య ప్రాజెక్ట్కు కళాకారులచే సప్తగిరి సంకీర్తన గోస్టి గానం, శ్రీవారి కల్యాణం, ఊంజల్ సేవ, సంగీత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.
CTR: యుద్ధంతో చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో సుమారు రూ. 1.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. ఏటా రూ. 2.50 లక్షల మెట్రిక్ టన్నుల గుజ్జును పల్ప్ ఫ్యాక్టరీలు తయారు చేస్తాయి. దీంట్లో అధిక శాతం గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధంతో తాత్కాలికంగా ఆగిన ఆర్డర్లు రాకపోవడంతో ఫ్యాక్టరీలో యజమానులు అయోమయంలో ఉన్నారు.
NDL: టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయన మరో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్నటితో సింగపూర్ పర్యటన ముగించుకుని మంత్రి బీసీ రాష్ట్రానికి చేరుకున్న విషయం తెలిసిందే.
KRNL: దేశానికి వచ్చే పెట్టుబడుల్లో సుమారు 25 శాతం ఏపీకే వస్తున్నాయని మంగళవారం మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ‘బస్సు వరల్డ్ ఇండియా కాంక్లేవ్-2026’ లో ఆయన ప్రసంగించారు. CM చంద్రబాబుపై ఉన్న నమ్మకమే ఈ పెట్టుబడులకు కారణమని పేర్కొన్నారు. ఏపీ ఈవీ పాలసీ 4.0 పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని, అభివృద్ధిలో రాష్ట్ర దూసుకుపోతుందన్నారు.
అన్నమయ్య: దెందులూరు మండలం సానిగూడెం అడ్డురోడ్డు వద్ద జరిగిన కత్తి దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఆర్. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. గాలాయగూడెంకు చెందిన హర్షవర్ధన్ సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల విషయమై తరుణ్ ప్రశ్నించగా, అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హర్షవర్ధన్ను అదుపులోకి తీసుకున్నారు.
WG: రాష్ట్రంలో ఇంధన పరిస్థితులపై సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో క్యూలైన్లు తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చిందని కలెక్టర్ నాగరాణి సీఎంతో పేర్కొన్నారు. డీజిల్ వినియోగంపై నియంత్రణ ఉండాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆమె తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
VZM: జిల్లాలో కొనసాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం సంబంధత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజిల్ అంశం సద్దుమణిగే వరకు రెవెన్యూ అధికారులు బంకుల వద్ద పర్యవేక్షించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జే.సీ పాల్గొన్నారు.
ATP: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో గ్రామ కమిటీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కమిటీ సభ్యుల ఐడీ కార్డుల వెరిఫికేషన్పై చర్చించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు.
E.G: రాజమండ్రి నగర పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా మంగళవారం తెలిపారు. మేజర్, మైనర్ డ్రెయిన్ల పూడికతీత పనులకు టెండర్లు పిలిచామని, మే నెలాఖరుకు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.5 కోట్లతో 18 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వివరించారు.
KKD: జిల్లాలోని ఆయిల్, రసాయన పరిశ్రమలలో ఈనెల 30న విపత్తు నియంత్రణపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధర ప్రసాద్ తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించేలా సిబ్బందిని సన్నద్ధం చేయడమే లక్ష్యం అన్నారు.
కోనసీమ: పిల్లల్లో మానసిక పరివర్తన, జీవన శైలిలో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘మిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఈ కార్యక్రమం విద్యార్థులపై చూపుతున్న సానుకూల ప్రభావంపై చర్చించారు. విద్యార్థుల మానసిక వికాసానికి ఇదొక విశిష్ఠ మార్గమని తెలిపారు.
NLR: ఏఎస్ పేట దర్గాలో హుండీల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. మంగళవారం రాత్రి వరకు 2వ విడత పూర్తయ్యే సరికి రూ.1.96కోట్ల నగదు, 49 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి లెక్కించారు. దర్గాలోని మొత్తం 25 హుండీలు ఉన్నాయి. ఇప్పటికీ 11 హుండీల్లో లెక్కింపు పూర్తి చేశామని ఏవో హుసేని తెలిపారు.