AKP: నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రతివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ తెలిపారు. ఎలమంచిలిలో బుధవారం నిర్వహించిన జనవాణిలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే అర్జీ దారులతో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
VZM: సీతం కళాశాలలో ఉచిత పాలిసెట్ (POLYCET) కోచింగ్ తరగతులు ఇవాళ ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక విలువైన అవకాశమని డైరెక్టర్ డా మజ్జి శశి భూషణరావు తెలిపారు. పరీక్షలో విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించేందుకు అవసరమైన సమగ్ర శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
BPT: వేమూరులోని అంబేద్కర్ నగర్ కాలనీలో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అగస్టిన్ తెలిపారు. బుధవారం జరిగిన PGRSలో జేసీకి ఫిర్యాదు చేశారు. 250 కుటుంబాలకు కేవలం 1-2 ట్యాపుల ద్వారా మాత్రమే నీరు వస్తోందని చెప్పారు. వెంటనే సమస్య పరిష్కరించి తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు.
ప్రకాశం: టంగుటూరు సమీపంలోని టోల్ ప్లాజా ప్రాంగణంలో ఉన్న ఆఫీస్ ముందు కార్మికులు బుధవారం నిరసనకు దిగారు. టోల్ ప్లాజా మేనేజర్ కిరణకు కార్మికులు మధ్య వీధుల విషయంలో మంగళవారం చిన్న వివాదం తలెత్తింది. దీంతో బుధవారం మేనేజర్ కిరణ్ కక్షతో అక్రమంగా ముగ్గురిని విధుల నుంచి తొలగించారని, వారిని తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు.
GNTR: కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలో ‘మై టీడీపీ యాప్’ టాప్-10 పెర్ఫార్మర్స్తో ఆయన భేటీ అయ్యారు. ఉత్తమ కార్యకర్తలను సత్కరించి ఎన్టీఆర్ జ్ఞాపికను బహూకరించారు. మీ పనితీరు వల్లే ఇక్కడి వరకు రాగలిగారని అభినందించారు. పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు.
NLR: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
ATP: గుత్తిలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఏపీ గ్రంథాలయ పరిషత్తు సభ్యురాలు పద్మజ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయానికి వస్తున్న పాఠకులపై ఆరా తీశారు. గ్రంథాలయంలో అందుతున్న సదుపాయాలను పాఠకులను అడిగి తెలసుకున్నారు. పాఠకులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని స్థానిక గ్రంథాలయ అధికారి రామాంజనేయులును ఆదేశించారు.
SKLM: పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో బుధవారం వరుస చోరీల కలకలం రేగింది. పాత జాతీయ రహదారిపై ఉన్న చికెన్ షాప్, డెకరేషన్ షాపుతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని మరో దుకాణంలో దొంగలు పడ్డారు. ఈ ఘటనల్లో సుమారు రూ.75 వేల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. ఒకే రోజు మూడు చోట్ల చోరీలు జరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన నిత్య అన్నదానం ట్రస్ట్కు బెంగళూరుకు చెందిన గౌతమి, వారి కుటుంబ సభ్యులు రూ.1 లక్ష విరాళంగా చెక్కు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
SS: ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి నుంచి 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను మంత్రి త్రివేణి ప్రారంభించారు. కాలనీవాసుల ఆరోగ్యమే ప్రాధాన్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. స్వచ్ఛమైన నీటితో రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆమె తెలిపారు.
BPT: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. వేమూరు నియోజకవర్గంలోని సురేపల్లి గ్రామంలో గురువారం జరగనున్న పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు విధులపై జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించారు.
PLD: మండల కేంద్రమైన ఈపూరు ఏపీ మోడల్ స్కూల్లో ఏప్రిల్ 12వ తేదీన 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మజ ఓ ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందన్నారు.
GNTR: చట్టసభల్లో పద్మశాలీలకు ప్రాధాన్యం దక్కడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, తమకు 16 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజధానిలో భవన్కు 3 ఎకరాలు ఇవ్వాలన్నారు. తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 26న మంగళగిరిలో పద్మశాలి మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మి రాజమండ్రిలోని కేంద్ర కారాగారం & మహిళా కారాగారాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కారాగారాలలో ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖైదీల తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు సహాయం అందిస్తామన్నారు.
ప్రకాశం: జిల్లా SP హర్షవర్ధన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. కొందరు మోసగాళ్లు పోలీసులుగా నటిస్తూ వీడియో కాల్ చేసి మీరు అరెస్ట్లో ఉన్నారని భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఇటువంటి కాల్స్ నమ్మకుండా వెంటనే కట్ చేయాలని, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఇవ్వకూడదన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలి లేదా సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయాలని అన్నారు.