BPT: ఈ నెల 23వ తేదీన బల్లికురవ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కుసుమకుమారి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుందని, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై మండల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని కోరారు. సమావేశానికి సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో సిద్ధంగా రావాలని ఎంపీడీవో సూచించారు.
KRNL: కౌతాళం మండల MROగా పి. రవిచంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రవిచంద్ర మాట్లాడుతూ.. మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. భూ సమస్యలు, ధ్రువపత్రాల జారీ సేవలను సమయానికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం: చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్సై కె. కృష్ణప్రసాద్ తెలిపారు. 2024లో మందస మకరజోల వద్ద వృద్ధురాలి గొలుసు లాక్కెళ్లగా, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సోంపేట కోర్టు తాజాగా ఈ తీర్పు వెల్లడించింది.
సత్యసాయి: కదిరి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని చాందిని ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలలో 991 మార్కులతో జిల్లా స్థాయిలో టాపర్గా నిలిచింది. ఈ కళాశాలలో అత్యధిక మంది విద్యార్థినులు 90 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అత్యధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీయులను కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ ప్రసాద్ ,అధ్యాపకులు బుధవారం అభినందించారు.
ASR: మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతగిరి మండలం మల్లిపాడు గ్రామానికి ఇప్పటికీ రహదారి లేదు. గ్రామానికి చెందిన బాబూరావు అనారోగ్యానికి గురికావడంతో స్థానికులు అతడిని ఆరు కిలోమీటర్ల దూరం డోలీమోతతో మోసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
VZM: టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో స్థానం దక్కించుకున్న గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గంట్యాడ శ్రీదేవిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. పార్టీ నాయకులు కార్యకర్తల హర్షద్వానాల మధ్య మంత్రి శ్రీనివాస్ శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. నాయకులు కార్యకర్తలు శ్రీదేవికి శుభాకాంక్షలు తెలియజేశారు.
NLR: ఉదయగిరి (M) బండగానిపల్లి పంచాయితీ బీజేపీకి చెందిన గుంటా రాము (30) అనే యువకుడు అనుమానాస్పదంగా బెంగళూరులోని మారతహళ్లి రైల్వే ట్రాక్ వద్ద విగతజీవిగా పడి ఉన్నారు. వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న తండ్రి గుంటా పిచ్చిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు తరలివెళ్లారు.
GNTR: సీఎం చంద్రబాబు గురువారం అధికారిక కార్యక్రమాలతో నిమగ్నం కానున్నారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10:50కి సచివాలయానికి చేరుకుంటారు. 11:45కు ఆర్థిక వ్యవహారాలపై సమీక్ష, సాయంత్రం 4 గంటలకు దేవాదాయ శాఖపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5:30కి నివాసానికి చేరుకుంటారని టీడీపీ నేతలు తెలిపారు.
BPT: బాపట్ల మండలంలోని విద్యుత్ సబ్ డివిజన్ మారిన కారణంగా ఈ ఏప్రిల్ నెల కరెంటు బిల్లులు వసూలు చేసే సిబ్బంది అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ విద్యుత్ బిల్లులను మీసేవ కేంద్రాల ద్వారా గానీ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా చెల్లించాలని కోరారు. సకాలంలో బిల్లులు కట్టి సహకరించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.
TPT: తిరుమలలో మోకాళ్ల మెట్లు సమీపంలోని ఘాట్ రోడ్డుపై సుమారు 7 అడుగుల నాగుపాము ప్రత్యక్షమై వాహనదారుల్లో భయాందోళనకు గురిచేసింది. రోడ్డుపైకి వచ్చిన పామును గమనించిన వాహనదారులు కాసేపు ఆగిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.
NLR: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా బుధవారం కందుకూరు ఆర్టీసీ డిపోలో సిబ్బందికి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరమని, అత్యవసర సమయాల్లో వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారి ఎం. చంద్రమౌళి కోరారు. అనంతరం కేసరగుంట కాలనీలోని గుడిసెల నివాసితులకు నివారణ చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: నరసన్న పేట మండలం మడపాం టోల్ గేట్ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వాహనాలను పట్టుకొని , సీజ్ చేసినట్లు ఎస్సై బి. గణేష్ తెలిపారు. 12 మూగజీవాలను సంరక్షించి, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మూగ జీవులను అక్రమ రవాణా చేస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
CTR: నగరం సమీపంలోని గంగాసాగరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. హైవే అధికారులు గురువారం ఉదయం లారీలను రోడ్డుపై ఆపుతున్న సందర్భంలో వెంట వెంటనే రెండు లారీలు ఆపడంతో వెనుక నుంచి వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరగడంతో హైవే అధికారులు వెంటనే అక్కడి నుంచి జారుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
VZM: ముందస్తుగా పన్నులు చెల్లిస్తే 5 శాతం రిబేటు పొందవచ్చని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2026-27 పన్నులు ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రిటేట్ వస్తుందన్న విషయం ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు.