E.G: సింగరాజుపాలెం ఎస్సీ కాలనీలో పైపుల ద్వారా మురికినీరు వస్తోందని కాలని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా కలుషిత నీరు తాగడంతో అనారోగ్య సమస్యలు పెరిగినట్లు స్థానికులు తెలిపారు. సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో సమస్యను పట్టించుకునే వారు లేరని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటరాజు స్పందించి అధికారులతో వెంటనే మరమ్మతులు చేయించారు.
ATP: తాడిపత్రిలోని ప్రసిద్ధ బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో మంగళవారం ఉదయం స్వామివారిని విశేషంగా సపోటా పండ్లతో అలంకరించారు. శివలింగం చుట్టూ పండ్లను అమర్చిన తీరు సందర్శకులను కట్టిపడేసింది. ప్రకృతి ప్రసాదాలతో దైవాన్ని కొలవడం భక్తికి, పర్యావరణ హితానికి నిదర్శనమని అర్చకులు యోగానందశర్మ పేర్కొన్నారు. ఫలాల అలంకరణను చూసి భక్తులు పులకించిపోయారు.
SS: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తన పుట్టినరోజును పురస్కరించుకుని ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. భక్తులు, అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
NDL: కొలిమిగుండ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 11 వరకు ‘పోలీస్ 30 యాక్ట్’ అమల్లో ఉంటుందని సీఐ రమేశ్ బాబు తెలిపారు. బహిరంగంగా గుంపులుగా చేరడం, ర్యాలీలు, సభలు నిషేధించారు. అవసరమైన కార్యక్రమాలకు ముందస్తుగా డీఎస్పీ అనుమతి తప్పనిసరి అని హెచ్చరించారు.
E.G: రాజమండ్రి మారంపూడిలో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి 12వ వార్షికోత్సవ జాతర సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి దుర్గేశ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మంత్రిని సత్కరించారు. జాతర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
భారతీయ జనతా పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తవలస మండల కాటకాపల్లి గ్రామంలో ‘మన ఊరు- మన జెండా’ కార్యక్రమం సోమవారం విజయనగరం జిల్లా వైస్ ప్రెసిడెంట్ చొక్కాకుల అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ రాముడు, తదితరులు పాల్గొన్నారు.
W.G: భీమవరం మున్సిపల్ కార్యాలయంలో రేపు నిర్వహించనున్న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ గోడపత్రికను జేసీ రాహుల్ ఆవిష్కరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్ను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని, వివిధ కంపెనీలు పాల్గొనే ఈ కార్యక్రమంలో అర్హత గల అభ్యర్థులు హాజరవ్వాలని కోరారు.
VSP: భీమిలి జోన్లో సంతపేట, తగరపువలసలలో ఖాళీగా ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ షాపు రూములకు ఈనెల 13న జోనల్ కార్యాలయంలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు భీమిలి జోనల్ కమిషనర్ విజయ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ వేలం పాటలో పాల్గొనదలచిన వారు కార్యాలయం పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
PPM: పదోతరగతి సమాధాన పత్రాల ముల్యాంకనం పట్టణంలో ఉన్న DVMM హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం సజావుగా నిర్వహించామని మన్యం జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం ఐదు సబ్జెక్టులకు సంబంధించి జిల్లాకు 98377 సమాధాన పత్రాలు రాగా, అందులో 4982 పత్రాలు దిద్దడం జరిగిందన్నారు. మొత్తం 418 పరీక్షల పరిశీలకులు హాజరయ్యారన్నారు.
ELR: నూజివీడు పట్టణంలోని 21,22 వార్డులలో మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బందితో కలిసి ఇంటింటికి పర్యటించి ప్రజల నుంచా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీల తీరు, వాటిలో పరిశుభ్రత, రోడ్లపై చెత్తాచెదారం వంటి అంశాలు పరిశీలించారు. చెత్తను రోడ్లపై వేయవద్దని, గ్రీన్ అంబాసిడర్లకు డస్ట్ బిన్స్తో చెత్త అందించాలన్నారు.
CTR: పుంగనూరు పట్టణం ఎంపీటీ రోడ్డులోని శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా నిజరూప దర్శనంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ASR: జిల్లా కలెక్టర్ టీ.నిశాంతిని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలువురు నేతలు సోమవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్గా గిరిజనులకు అత్యుత్తమ సేవలు అందించాలని కోరారు. అలాగే గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగం సూర్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
AKP: మాడుగులలో ఈ నెల 13న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరగనుందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ తెలిపారు. రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ క్యాంటీన్ను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభిస్తారన్నారు. ఈ సందర్భంగా పాండవుల చెరువు శంకుస్థాపన, జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ, సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
NLR: ఇందుకూరుపేట పీఎస్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దేవరకొండ కిశోర్ అనే వ్యక్తి బాధితుడి నుంచి రూ.10 లక్షలు తీసుకుని పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.