ATP: గుంతకల్లులో ఈ నెల 20 తేదీన జరిగే జగత్ జ్యోతి శ్రీ గురు బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వీరశైవ సంఘం అధ్యక్షుడు విరుపాక్షి రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి ఉరవకొండ గవి మఠం ఉత్తరాధికారి కర్రీ బసవ రాజేంద్ర ప్రసాద్ స్వాముల వారు హాజరవుతారన్నారు. సోమవారం సాయం కాలం 4 గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.
సత్యసాయి: జిల్లాలో ఫుట్బాల్, బాక్సింగ్ క్రీడల జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. ఏప్రిల్ 23న హిందూపురంలో ఫుట్బాల్, 24న ధర్మవరంలో బాక్సింగ్ ఎంపికలు జరుగుతాయన్నారు. అండర్-15, 19, 21 విభాగాల్లో క్రీడాకారులు పాల్గొనవచ్చు. ఇక్కడ ఎంపికైన వారు విశాఖపట్నం, అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు.
TPT: శ్రీకాళహస్తి గుడిలో రూ. 500కే రాహుకేతు పూజలు యధావిధిగా కొనసాగించాలని స్థానిక BJP నాయకులు ఆలయ ఈవో వెంకటేశులకు వినతిపత్రం అందజేశారు. రూ. 500ల రాహుకేతు పూజలను రద్దు చేయాలని నిర్ణయించడం సరైనది కాదని, ఉపసంహరించుకోవాలని ఈవోని కోరారు. లేని పక్షంలో తాము నిరసనలు వ్యక్తం చేస్తామని వారు హెచ్చరించారు.
NLR: కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు పాల్గొన్నారు. చుట్టుపక్కల 10 మండలాల నుంచి వచ్చే రోగులకు సహనం, బాధ్యతతో సేవలు అందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. మందులు పూర్తిగా అందుబాటులో ఉంచాలని, రాత్రివేళల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
E.G: నల్లజర్లలో ముళ్ళపూడి బాపిరాజును అప్కాబ్ చైర్మెన్ గన్ని వీరాంజనేయులు కలిసారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. స్థానిక కార్యకర్తలతో, నేతలతో భేటీ అయ్యారు. వచ్చే మున్సిపల్, పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో వారికి దిశ నిర్దేశం చేశారు. టిడిపి జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన బాపిరాజును ఈ సందర్భంగా గన్ని అభినందించారు
GNTR: అమరావతిలోని ఐదు ఐకానిక్ భవనాల పూర్తికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. టవర్ 1 నుండి 4 వరకు, జీఏడీ టవర్లలో విద్యుత్, ప్లంబింగ్, ఏసీ, ఫైర్ సేఫ్టీ (MEP) పనుల కోసం టెండర్లు పిలిచింది. రూ. 1,856 కోట్లకు పైగా అంచనాతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను 18 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల కీలక కార్యాలయాల భవనాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
KKD: అధికారులు మొక్కుబడి తంతుగా కాకుండా అంకిత భావంతో జల సంరక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. పెద్దాపురం మండల పరిషత్లో శనివారం జలధార జల సంరక్షణపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. భావితరాల కోసం జలవనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు.
AKP: ఎలమంచిలిలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మిత్రపక్షాల వ్యతిరేకతపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పిల్లా రామకుమారి నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి మహిళా సాధికారతకు ఈ బిల్లు ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
W.G: భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు తాటి ముంజెలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఆకివీడు ప్రాంతంలో ముంజెలకు డిమాండ్ అమాంతం పెరిగింది. వేసవిలో మాత్రమే లభించే ఈ ప్రకృతి ప్రసాదాన్ని ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కాయ ధర రూ.25 వరకు పలుకుతుండగా, వ్యాపారులు ముంజెలను తీసి డజన్ల లెక్కన కూడా విక్రయిస్తున్నారు.
NDL: ఈనెల 21న శ్రీశైలం డ్యామ్ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ పరిశీలించనున్నారు. 20న శ్రీశైలం చేరుకొని అక్కడే బస చేస్తారు. క్షేత్రస్థాయిలో డ్యామ్ను సందర్శించి, జల వనరుల శాఖ ఇరు రాష్ట్రాల అధికారులతో జలాశయం భద్రతపై సమీక్షించనున్నారు. అలాగే AP, TG రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి అంశంలో నెలకొన్న వివదంపైనా చర్చించనున్నారు.
VZM: సీనియర్ పాత్రికేయుడు సుంకర రాజేష్(53) అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున అకాల మరణం చెందారు. తొలుత ఈనాడు, తరువాత సాక్షి దినపత్రికలో ఆయన పని చేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల నరసింగరావు వారి నివాసానికి వెళ్లి రాజేష్ మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.
కడప: కమలాపురం(M) గోపులాపురం గ్రామానికి చెందిన రైతు మీగడ నారాయణరెడ్డి (65) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వారి వివరాల మేరకు.. ఆయనకు అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
SKLM: స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సేవకుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్థంతి సందర్భంగా పలాస మున్సిపాలిటీలోని ఆయన విగ్రహానికి ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న చేసిన సేవలు ఎప్పటికీ మరువలేని వని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. స్థానిక TDP నాయకులు ఆయన అభిమానులు పాల్గొన్నారు.
KRNL: ఆదోని పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పగల్, పెసలబండ, ఆస్పరి, మండిగిరి వంటి స్కీంల పరిధిలో గ్రామాలకు సక్రమంగా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కీంల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్లు 20-40% తక్కువ రేటుకు పనులు తీసుకుని, వర్కర్లకు జీతాలు సైతం ఇవ్వడం లేదన్నారు.
VZM: గంట్యాడ మండల కేంద్రంలోని గ్రంథాలయం ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది. భవనం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్న కారణంగా పాఠకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముండటంతో వెంటనే కొత్త భవనం నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.