WG: ‘మే’ డేను వాడవాడలా కార్మికులు ఘనంగా నిర్వహించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ఆదివారం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఏపీ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో భీమారావు మాట్లాడారు. ‘మే’ డే ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాల పునరుద్ధరించాలని కోరారు.
W.G: నరసాపురం నుంచి హైదరాబాద్ (చర్లపల్లి) వరకు నడిచే నూతన వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఆదివారం ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుందని ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని మంత్రి అన్నారు.
NDL: ప్యాపిలి మండలం పోతుదొడ్డిలో కోడి పందేల నిర్వాహకులను ఆదివారం సాయంత్రం ఎస్సై నాగార్జున అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన రవికుమార్, మునుగుల రామాంజనేయులు, నాగప్ప, రామకృష్ణ తదితరులు గ్రామ శివారు ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండటంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 8 బైక్లు, 4 కోడి కత్తులు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామున్నారు.
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సబ్డివిజన్లు, పోలీస్ స్టేషన్ల పరిధిలలో రాత్రివేళల్లో పోలీసులు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్, తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రాత్రిగస్తీ, తనిఖీలు, అనుమానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్ చెకింగ్లు, స్టాప్, వాచ్ అండ్ గో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అన్నమయ్య: జిల్లాలో డీజిల్, పెట్రోల్ సరఫరాకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ అవి నియంత్రణలోనే ఉన్నాయని చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
KDP: చెన్నూరులోని వీరబ్రహ్మేంద్రస్వామి వారి గ్రామోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో భాగంగా కోలాటం నిర్వహించారు. చెన్నూరులో నిర్వహించిన కోలాట ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు సమూహాలుగా పాల్గొని కోలాటం ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కోలాట బృందానికి చెన్నూరులో మంచి గుర్తింపు లభించింది.
W.G: నరసాపురం శ్రీ వైఎన్ కళాశాల పాలకవర్గ (గవర్నింగ్ బాడీ) ఎన్నికల్లో ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికలకు ఆయన కళాశాల పూర్వ విద్యార్థిగా హాజరైన తాను చదువుకున్న విద్యాసంస్థ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
NLR: కావలి రూరల్ బుడంగుంట కాలనీకి చెందిన తురకా రమణమ్మపై అల్లుడు చల్లా శ్రీనివాసులు కూరగాయలు కత్తితో దాడి చేశాడని ఫిర్యాదు రావడంతో ఎస్సై బాజీ బాబు సోమవారం కేసు నమోదు చేశారు. తన భార్య తనతో కాపురానికి రాలేదని శ్రీనివాసులు అత్తపై దాడి చేశాడు. రమణమ్మ ఏరియా ఆసుపత్రిలో ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KKD: అన్నవరం దేవస్థానంలో నిర్వహించే పూజలు, ఆర్జిత సేవలు, అలంకారాలను ఆన్లైన్ చేయాలని దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. భక్తులకు సమాచారం వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. దీనివల్ల భక్తులకు సేవల బుకింగ్ సులభతరం కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
VZM: రాజాంలోని బొబ్బిలి సెంటర్లో యాదవుల వీధి దగ్గర ఆదివారం సాయంత్రం యువకుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జానాలను చెదరగొట్టి పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఘర్షణకు గల కారణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని సంతావలస–గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న చేతి పంపు బోరు పాడైపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మండల కేంద్రానికి వచ్చే గిరిజనులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బోరును తక్షణమే మరమ్మతు చేయాలని కోరుతున్నారు.
NTR: విజయవాడ నిడమానూరు వద్ద నిలిచిపోయిన ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. గతంలో రద్దైన ఈ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ చర్యలు ముమ్మరం చేశాయి. సుమారు రూ. 640 కోట్ల అంచనా వ్యయంతో కూడిన DPRకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింనట్లు తెలుస్తోంది. CM స్థాయిలో జరిగిన చర్చల అనంతరం, ఈ ప్రాజెక్టును కేంద్రానికి సిఫార్సు చేసేంది.
NDL: శ్రీశైలం ఆలయ వెబ్సైట్ ఆర్జిత సేవలు, పూజలు, అలంకరణల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఓ ప్రకటనలో ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ విశేషాలు, సౌకర్యాల సమాచారం ఆన్లైన్ అందుబాటులో ఉంచాలని ఈవోను ఆదేశించారు. దీనివల్ల సమాచార సేకరణ భక్తులకు మరింత సులభతరం కానుంది.
CTR: గ్రామీణ ప్రాంత ప్రజలు ఆన్లైన్ మోసాలు, సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కుప్పం రూరల్ CI మల్లేష్ యాదవ్ సూచించారు. ‘ధైర్య స్పర్శ’ కార్యక్రమంలో భాగంగా రామకుప్పం మండలం ముద్దనపల్లిలో ఆదివారం రాత్రి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టం, మహిళలపై నేరాలకు పాల్పడితే ఏ విధమైన శిక్షలు ఉంటాయనేది వివరించారు.
KDP: పెడ్లిమర్రి(M)లోని చిన్నదాసరపల్లెలో ప్రసిద్ధిచెందిన వేయినూతులకోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పి. నరసింహ హరిప్రసాద్ తెలిపారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.