సత్యసాయి: పెనుకొండ ఆర్అండ్బీ అతిథి గృహంలో పంచాయతీల ప్రత్యేక అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులపై దృష్టి సారించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి కొరత రాకుండా చూడాలని అన్నారు.
TPT: తిరుపతిలోని జేపీ జువెలరీలో మార్చి 23న బంగారు గొలుసు దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసుతో పాటు రూ.80 వేల విలువైన సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వెస్ట్ పోలీసులు అచ్యుతరాయ రోడ్డులో నిందితుడిని పట్టుకుని రిమాండ్కు తరలించారు.
KRNL: ఆదోని పట్టణంలో ఏప్రిల్ 13న నూతనంగా ప్రారంభం కానున్న ఆంధ్రా గోల్డ్ అండ్ జ్యూవెలరీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటుడు అలీ తన సతీమణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వారి రాక నేపథ్యంలో అభిమానులు, వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
ATP: రాయదుర్గం ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడమే ప్రాధాన్యతని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రూ.72.32 కోట్లతో అమృత్-2 పథకం కింద 70 వేల మందికి ఉపయోగపడే పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
PPM: జిల్లా కేంద్రంలో ఈ నెల 22న నిర్వహించనున్న భారీ సాంస్కృతిక ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. పట్టణంలో సుమారు 6 వేల మంది విద్యార్థులతో ఈ ప్రదర్శనను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో కలిసి వివిధ శాఖల అధికారులతో VC నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
NLR: నెల్లూరు జిల్లాలో పరిపాలనా కారణాలతో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాపూరు, చేజర్ల, సైదాపురం, కండలేరు ఎస్సైలతో పాటు వీఆర్లో ఉన్న నలుగురు అధికారులకు కొత్త పోస్టింగ్లు ఇచ్చారు. బదిలీ అయిన ఎస్సైలందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
AKP: సబ్బవరం మండలం గొల్లలపాలెం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ స్వీపర్ కొమ్ము దుర్గాలు (65) దుర్మరణం చెందాడు. ఇంటి నుంచి గొల్లల పాలెం పంచాయితీ కార్యాలయానికి బైక్ పై వెనక కూర్చుని వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దుర్గాలు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్ మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఎంపీ ఎం. శ్రీభరత్, సినీ నటుడు శివాజి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఏయూను ప్రపంచ స్థాయి వర్సిటీగా తీర్చిదిద్దాలని శ్రీభరత్ ఆకాంక్షించగా, యువత ఒత్తిడి లేకుండా లక్ష్యాల దిశగా సాగాలని శివాజీ సూచించారు.
CTR: చౌడేపల్లిలో గంగ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. నిన్న రాత్రి కుమ్మరుల ఇంటి నుంచి అమ్మవారిని కళ్యాణ గంగమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఊరేగింపుగా రజకుల ఇంటికి తీసుకువెళ్లారు. మడవలి రాజుతో కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం నడివీధిలో ప్రతిష్టించారు. ఇవాళ కూడా ఈ జాతర కొనసాగనుంది.
VZM: రాజాం పట్టణంలో బుధవారం వాటర్ ట్యాంకర్స్ ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నట్టు మునిసిపల్ కమిషనర్ రామచందర్రావు మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ రేగడి మండలం మజ్జి రాముడు పేట వద్ద ప్రధాన పైపులైను పని ఇంకా జరుగుతుండడంతో ట్యాంకర్స్ ద్వారా పట్టణంలో నీటిని సరఫరా చేస్తామన్నారు. పైప్ లైన్ పనులు అయిన వెంటనే కొళాయిలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
KRNL: పెద్దపాడు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదరుగా వస్తున్న కారును ఓ పెళ్లి వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పెళ్లికూతురితోసహా పలువురు గాయపడినట్లు సమాచారం. పెళ్లి బృందం గూడూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
TPT: తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 43వ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు సహా అన్ని పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎన్. మౌర్య పాల్గొన్నారు.
NDL: ఈ ఏడాదికి సంబంధించి జరిగిన అకాడమిక్ ఆడిట్లో కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఏ-గ్రేడ్ పత్రం లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. ఈ మేరకు డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశానికి అకాడమిక్ అడ్వైజర్లుగా వచ్చిన డాక్టర్ హనుమంత రెడ్డి కాసిం సాహెబ్ కళాశాల అధ్యా పకులను అభినందించి ఏ-గ్రేడ్ పత్రాన్ని అందజేశారు.
ASR: పెదబయలులో జరిగిన టీడీపీ కేడర్ సమావేశంలో అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ సియ్యారి దొన్ను దొర పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
GNTR: అమరావతిలో ఎకో టూరిజంపై ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. మంగళవారం వీరు రాజధానిలో పర్యటించారు. గ్రావిటీ కెనాల్ వద్ద ఎకో టూరిజం పనులను పరిశీలించారు. అనంతవరం నర్సరీలో వృక్షాల సంరక్షణను బృందం అభినందించింది. నీరుకొండలో 0.4 టీఎంసీలతో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల వివరాలను సీఎండీ వారికి తెలియజేశారు.