అన్నమయ్య: రాయచోటిలో కర్ణాటకకు చెందిన మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు నసీర్ను సంయుక్త పోలీస్ ఆపరేషన్లో అరెస్ట్ చేశారు. అతనిపై 26 కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ చర్యలో అన్నమయ్య ఎస్పీ ధీరజ్ చొరవకు ప్రశంసలు లభించాయి. స్థానికంగా తప్పుడు పేరుతో నివసిస్తున్నట్టు విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు.
TPT: తిరుపతి నగరంలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఈఈసీ గంగాధరరెడ్డి తెలపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు న్యూమారుతీ నగర్, అమరావతి నగర్, ఎల్బీ నగర్, మహిళా యూనివర్సిటీ ఏరియా, ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
GNTR: చేబ్రోలు మండల పరిధిలో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు MLA ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. మృతి చెందిన నలుగురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల చొప్పున, మొత్తం రూ. 6 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
TPT: తొట్టంబేడు 2 టౌన్ పరిధి చెన్నై రోడ్డులోని MGM ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమె ఆచూకీ తెలిసినవారు శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.
AKP: ఎస్ రాయవరం మండలం తిమ్మాపురంలో ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. నక్కపల్లి మండలానికి చెందిన కొల్లి సురేంద్ర(19) ద్విచక్ర వాహనంపై వెళుతూ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు.
PLD: నాగార్జునసాగర్ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు శుక్రవారం రెవెన్యూ అధికారులతో భేటీ అయ్యారు. పశువేముల, చింతలతండా,నాగులవరం గ్రామాల్లో సుమారు 800 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.భూముల వర్గీకరణ, ధరలపై తహశీల్దారుతో చర్చించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.
KDP: కడప రైల్వే స్టేషన్ సమీపంలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కాచిగూడ నుంచి తిరుచానూరు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న బిటెక్ విద్యార్థి సైపుల్లా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లి తిరిగి కడపకు వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
KRNL: సోలార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ఇక నుంచి 1912 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. నమోదైన ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా సోలార్ విక్రేతలు పరిష్కరిస్తారని అన్నారు.
కృష్ణా: పెనమలూరు పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసుకు ముగింపు పలికింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నీళ్లు అడిగినట్లు నటిస్తూ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బాలికను అసభ్యంగా తాకిన స్వామియేలు దోషిగా తేలాడు. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడికి ఐదేళ్లు శిక్ష 2000 జరిమానా విధించింది.
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక ఎస్సీ హాస్టల్ వెనుకవైపు ఉన్న కంపచెట్లలో శుక్రవారం జూద స్థావరాలపై దాడులు చేసినట్లు డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. సిబ్బందితో దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ.40,150ల నగదుతోపాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో గోపీచంద్ (29) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. చాపవారి వీధికి చెందిన ఇతడు గొట్టుముక్కల రోడ్డులోని ఒక షాపులో పనిచేస్తున్నాడు. ఈ నెల 17న పనికి వెళ్లిన గోపీచంద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
BPT: కారంచేడు మండల పరిధిలోని దగ్గుబాడుకు చెందిన నాయుడు శ్రీరామమూర్తికి, ఆస్తి వివాదంలో తన వదినపై హత్యాయత్నం చేసిన కేసులో శుక్రవారం ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఎస్సై ఖాదర్ భాషా, పీపీ శ్రీనివాసరెడ్డి, పీసీ బాల శంకర్లను ఉన్నతాధికారులు అభినందించారు.
AKP: లీజు పేరుతో ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వవద్దని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం ధర్నా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎస్.డబ్ల్యూ.ఎస్. జిల్లా కార్యదర్శి పరమేశ్వర రావు మాట్లాడుతూ డిపోల మూసివేత చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
AKP: మునగపాక మండలం పాటిపల్లి ఏపీ మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ, EWS వారు రూ.200, ఎస్సీ ఎస్టీ, PHC చెందినవారు రూ.125 దరఖాస్తు ఫీజుతో చెల్లించాలన్నారు.
NDL: గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవాలని ఎంపీడీవో మేరీ సూచించారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక శిక్షణ నిర్వహించారు. గ్రామాల్లో ఆస్తి, ఇతర పన్నుల ద్వారా ఆదాయం సృష్టించాలని ఆమె కోరారు. పంచాయతీల ఆర్థిక స్థిరీకరణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.