KRNL: కోసిగి మండలం కందుకూరులో రేపు జరిగే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరు కానున్నారు. మార్చి ఒకటో తారీఖు ఆదివారం కావడంతో శనివారం రోజునే సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కందుకూరులో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
VSP: పంజాబ్లోని జలంధర్లో మార్చి 28, 29 తేదీల్లో జరిగే 15వ జాతీయ బాడీ లిఫ్టింగ్ పోటీలకు జిల్లాకు చెందిన కిలాని గణేష్ న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు. వాయుపుత్ర హెల్త్ క్లబ్ చీఫ్ కోచ్గా సేవలందిస్తున్న ఆయనకు ఇది ఎనిమిదోసారి జాతీయ స్థాయి బాధ్యత కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక ప్రతినిధిగా ఎంపికైన గణేష్ను పలువురు అభినందించారు.
NDL: రేపు బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని మురళీమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
కోనసీమ: ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం పేషీలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలుసుకున్నారు. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని దేవాదాయశాఖ నుంచి దేవాలయాల అభివృద్ధికి, పుష్కరఘాట్ల అభివృద్ధికి, ఆర్అండ్బీ శాఖ నుంచి రహదారుల అభివృద్ధికి, పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాలతో స్కూల్ బస్సు వాహనచోదకులతో పట్టణ ఎస్ఐ, MVIలతో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రాణాలు తమ చేతిలో ఉన్నాయని చోదకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వాహనం నడిపినప్పుడు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
VZM: చీపురుపల్లి, రావివలస గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఇంఛార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి మరియు ఇతర అధికారులతో భద్రత ఏర్పాట్లును విశాఖపట్నం రేంజ్ ఐజీపీ, గోపీనాథ్ జట్టి శుక్రవారం పర్యవేక్షించారు. సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, మీటింగు స్థలం, కార్యకర్తలతో సమావేశ స్థలం, పార్కింగు స్థలాలు, పరిశీలించారు.
SKLM: జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో చేపలు రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శుక్రవారం 5 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణా నిపుణులు డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ కోటేశ్వర్లు మాట్లాడుతూ.. చేపలతో అనేక ఉత్పత్తుల తయారీ ద్వారా ఆదాయం పెరుగుతుందని మార్కెట్లో డిమాండ్ ఉంటుందని తెలిపారు.
VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ త్రిపురాంతక స్వామి (క్షేత్రపాలకులు) ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఐదు రోజులుగా సాగిన శాస్త్రోక్త ఉత్సవాలు ప్రధాన కార్యక్రమాలతో ముగిశాయి. శుభ ముహూర్తంలో ఆలయ ఈవో జె. వెంకటరావు దంపతులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు.
CTR: నివాసాల ప్రదేశంలో నిర్మిస్తున్న పాల డైరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆ ప్రాంతవాసులు కోరారు. శుక్రవారం MPDO అప్పాజీకి వినతి పత్రం అందజేశారు. పుంగనూరు మండలం రాంపల్లి సమీపాన గల వెంకటాద్రి కాలనీలో పాల డైరీ నిర్మిస్తున్నారని చెప్పారు. డైరీలో నుంచి బయటకు వచ్చే వ్యర్థపు నీటి వల్ల దోమలు తీవ్రత ఎక్కువ అవుతాయని స్థానికులు తెలిపారు.
గుంటూరు: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం తొలి సమీక్షా సమావేశం జరిగింది. సంస్థ చైర్పర్సన్ భీమనేని వందనాదేవి, కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ దీన్ని నిర్వహించారు. పాత ఫర్నిచర్ తొలగింపునకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని, సెస్ నిధులు సంస్థకు జమ అయ్యేలా చూడాలని ఛైర్పర్సన్ ఆదేశించారు. సిబ్బందికి డిజిటల్ బోర్డులు అందజేశారు.
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో పరిపాలన ప్రధాన కార్యదర్శి శ్యామలరావు అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి 1వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విచ్చేయనున్న సందర్భంగా, గన్నవరం విమానాశ్రయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
PLD: పెదకూరపాడులో వ్యవసాయ కూలీలు ప్రమాదపరితంగా ట్రాక్టర్ఫై శుక్రవారం సాయంకాలం ప్రయాణం చేస్తున్నారు. ట్రాక్టర్కు ఇరువైపులా ఉన్న డోర్లను తీసివేసి ఓవర్ లోడ్తో కూర్చోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలన్నారు. రైతులకు, ట్రాక్టర్ యాజమాన్యానికి పోలీస్ అధికారులు అవగాహన కల్పించాలని వారు కోరారు.
NTR: కొండపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎండ్లూరి సుబ్బానాయుడు గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన భౌతికకాయంపై టీడీపీ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
PLD: ఈపూరు ప్రసన్నాంజనేయ స్వామివారి తిరుణాల మార్చి 1న ఘనంగా జరగనుంది. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఎస్సై కె. వేణుగోపాల్ శుక్రవారం పరిశీలించి భద్రతా సూచనలు జారీ చేశారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా హాజరుకానున్నారు. భక్తులు పాల్గొని తిరునాళ్ళను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
TPT: మామండూరు జలపాతంలో ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. తిరుపతి మంగళానికి చెందిన దిలీప్(19)సహా ఐదుగురు బీటెక్ విద్యార్థులు మామండూరు జలపాతానికి వెళ్లారు. అక్కడ ఈత రాని దిలీప్ అనుకోకుండా నీటిలో మునిగి మృతి చెందాడు. స్నేహితులు, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. దీనిపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.