ఎన్నికల సమయంలో చేసిన అప్పు తీర్చలేక ,రుణం ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక బీజేపీ నేత సెల్పీ వీడియో తీసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎనుమాముల బాలాజీనగర్కు చెందిన గంధం కుమారస్వామి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత నగరపాలక సంస్థ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల సమయంలో ఎనుమాముల మాజీ సర్పంచి సాంబేశ్వర్ నుంచి కుమార స్వామీ రూ. 25 లక్షలు తీసుకున్నాడు. ఎన్నికల్లో ఓటమిపాలై ఓ వైపు బాధపడుతుంటే..
మరోవైపు అప్పు ఇచ్చిన మాజీ సర్పంచి డబ్బుల కోసం వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు. అప్పు ఇచ్చిన మాజీ సర్పంచి ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యచేసుకుంటున్నానని, తన భార్య, పిల్లలను వేధించవద్దంటూ సూసైడ్ లెటర్ రాశాడు. అనంతరం సెల్ఫీ వీడియోను మిత్రులకు పంపించి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తన భర్త మృతికి కారకులైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుమారస్వామి భార్య లక్ష్మి ఎనుమాముల సీఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.