ADB: ఉట్నూర్ మండలం షాంపూర్ వద్ద వాగులో పడి ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును లంబాడ జేఏసీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఇరుకైన బ్రిడ్జిలు ఉండడం వల్లనే ప్రమాదం చోటుచేసుకుందన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డులు బ్రిడ్జిలు అధ్వాన్నంగా ఉన్న ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.
BDK: BRS పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని వనమా సూచించారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును నూతన కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేటర్లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై చర్చించారు.
MDK: కొల్చారం మండలం పైతర, తుక్కాపూర్ శివారుల్లో మంజీరా ఇసుక దోపిడీ బహిరంగంగా సాగుతోంది. ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, తక్షణమే ఈ దందాను అరికట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.
ASF: రెబ్బెన మండలంలో మంగళవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమ ఇసుక రవాణా బయటపడింది. పాసిగాం నుంచి రెబ్బెనకు అనుమతి లేకుండా ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్, ఓనర్ నీకోడే తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు SI వెంకట కృష్ణ తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
SRPT: రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ మంగళవారం తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతుండగా పరీక్ష సమయాల్లో పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
PDPL: ధర్మపురిలో గోదావరి నది పరిశుభ్రత కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ “స్వచ్ఛ ధర్మపురి-స్వచ్ఛ గోదావరి” కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి గోదావరి పవిత్రతను కాపాడాలని ఆయన తెలిపారు. భక్తులు నదిలో పాత బట్టలు, చెత్త వేయకుండా సూచించిన ప్రదేశాల్లో వేయాలని పేర్కొన్నారు.
MNCL: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఆరోగ్య పథకాన్ని ప్రవేశ పెట్టడం హర్షణీయమని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ ఉద్యోగులకు రూ. 1 కోటి బీమా సదుపాయం, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల జీతాలను 010 పద్దు ద్వారా చెల్లిస్తూ ప్రత్యేక డైరెక్టరేట్ను మంజూరు చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
MBNR: స్వచ్ఛ భారత్ వైపు ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని మహబూబ్ నగర్ కార్పొరేషన్ 21 డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో గీతం పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
WNP: జిల్లాలో రేపటి నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఎస్పీ సునీత రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 25 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
NLG: తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు తాడూరి చంద్రం తండ్రి వీరయ్య ఇటీవల మరణించిన విషమం తెలిసిందే. ఇవాళ చిట్యాలలోని వారి స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం, ఇతర జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
KMR: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మహాదేవ్ కుంటలో చురుకుగా సాగుతున్న ఉపాధి హామీ పనులు గ్ర సర్పంచ్ రమణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కూలీలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయం పాటించాలని ఇవాళ కూలీలకు విజ్ఞప్తి చేశారు.
NZB: వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి మంగళవారం సూచించారు. ‘అరైవ్ అలైవ్’ రెండో విడతలో భాగంగా షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే ప్రచారం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. భద్రతపై అవగాహన ప్రతి పౌరుడికి చేరాలని ఎస్సై కోరారు.
KNR: శంకరపట్నం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో చందు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. గద్దపాకకు చెందిన గర్భిణి ప్రసవం కోసం రావడంతో ఆమెకు మనోధైర్యం కల్పించి, మెరుగైన సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యాధికారులు డా. శ్రావణి పాల్గొన్నారు.
PDPL: మిర్జాపూర్లో ఇవాళ నిర్వహించిన ‘సంఘటన సృజన అభియాన్’ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన గ్రామస్థులతో సమావేశమయ్యారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
MLG: గోవిందరావుపేట మండల కేంద్రంలో గత 15 రోజుల్లో ఐదు చోట్ల దొంగతనాలు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. SC కాలనీలో బంగారు ఆభరణాలు, చికెన్ సెంటరులో నగదు అపహరణకు గురవ్వగా, సోమవారం రాత్రి ప్రధాన రహదారిపైన ఉన్న కిరాణా దుకాణంలో రూ. 50 వేల నగదు చోరీకి గురైంది. వరుస ఘటనలతో రాత్రి వేళల్లో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.